గొల్లపల్లి-చీర్కపల్లి నూతన రిజర్వాయర్ ప్రతిపాదనను రద్దు చేయాలంటూ ప్రతిపాదిత ప్రాంత సమీప గ్రామాల రైతులు పట్టు వదలని విక్రమార్కుడిలా 49రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈ రిజర్వాయర్ ఆరు గ్రామా ల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రాంత రైతులకు చెందిన పొలాల్లో గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఎంజీకేఎల్ఐలోని డీ-8 కాల్వ ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుందని ఈ ప్రాంతంలో ఎలాం టి రిజర్వాయర్ అవసరం లేదంటూ తేల్చి చెబుతున్నారు. ఈ ఆరు గ్రామాల రైతులు గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ వద్దేవద్దంటూ, మా భూముల ను వదులకోమని ముక్త కంఠంతో నినదిస్తున్నారు.
– వనపర్తి, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ)
గత అసెంబ్లీ సమావేశాల్లో వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి పలు అభివృద్ధి అంశాలను ప్రస్తావించారు. గత డిసెంబర్ 29న జరిగిన అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ను మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎమ్మెల్యే అసెంబ్లీలో చేసిన ఆ విజ్ఞప్తితో ఆరుగ్రామాల ప్రజలకు కంటి మీద కునుకులేకుండా పోయింది. కొత్త రిజర్వాయర్ ప్రతిపాదనను ఎ మ్మెల్యే ఉపసంహరించుకోవాలని దీక్షలకు పూనుకున్నారు.
ఇలా రైతులు చేపట్టిన ఈ దీక్షలు నేటికీ 49వ రోజుకు చేరుకోవడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. వనపర్తి నియోజకవర్గం ఏదుల మండలంలోని గొల్లపల్లి-చీర్కపల్లి గ్రామాలను అనుసరించి నూతనంగా ప్రతిపాదిస్తున్న రిజర్వాయర్ను ఆరుగ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పదేళ్ల కిందట ఏదుల రిజర్వాయర్ లేనప్పుడు ఈ ప్రాంతానికి సాగునీటికి ఇ బ్బందులుండేవి. అలాగే ఎంజీకేఎల్ఐలోని డీ-8 కాల్వ ద్వారా కూడా సాగునీరు పుష్కలంగా అందుతుంది. ఇలా రెండు వసతుల తో ఈ పరిసర గ్రామాలకు సాగునీరు వసతి పుష్కలముగా ఉందని, ఇకకొత్త రిజర్వాయర్ అవసరం లేదని ఆయా గ్రామాల రైతులుపేర్కొంటున్నారు.
1352 ఎకరాలు పోతుందని..
నూతనంగా ప్రతిపాదించిన గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ద్వారా 1352 ఎకరాల భూమి రిజర్వాయర్లో ముంపునకు గురవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 15రిజర్వాయర్లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం జీవో నెంబర్ 34ను రూపొందించిందని రైతులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ రిజర్వాయర్ వల్ల నష్టం కలుగుతుందనుకున్న రైతులు అప్రమత్తం అయ్యారు. గతంలోనే ఏదుల రిజర్వాయర్ ఏర్పాటులో కూడా తమ ప్రాంత భూములు పోయాయని, ఇప్పుడు కొత్త గా ఈ ప్రాంతానికి రిజర్వాయర్ అవసరం లేదని రైతులు వాదనలకు దిగుతున్నారు.
కొనసాగుతున్న రైతు దీక్షలు
గొల్లపల్లి-చీర్కపల్లి రిజర్వాయర్ ప్రతిపాదన వద్దంటూ రైతులు చేపట్టిన దీక్షలు 49రోజులకు చేరుకున్నది. దీనివల్ల ఈ గ్రామాల్లోని రైతులు తీ వ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని అన్నదాత లు గుర్రుగా ఉన్నారు. గత డిసెంబర్ 30న ఆరు గ్రామాల రైతులు రిజర్వాయర్ ప్రతిపాదనకు వ్యతిరేకంగా దీక్షలకు పూనుకున్నారు. ప్రతిరోజూ 30మంది రైతులకుపైగా దీక్షల్లో ఉంటూ మా భూములు మాకే ఉండాలని నినాదాలు చేస్తున్నారు. ఎవరైనా రిజర్వాయర్పై సానుకూలంగా ఉంటే..రైతులు ఏమాత్రం సహించడం లేదు. మా సర్వస్వాన్ని కోల్పోయే రిజర్వాయర్ వద్దే వద్దం టూ భీష్మించుకున్నారు. చెన్నారం, గొల్లపల్లి, చీర్కపల్లి, తల్పునూరు, రేవల్లి, ఏదుల గ్రామాల రైతు ల భూములు నూతన రిజర్వాయర్లో మునిగిపోతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం మా భూములకు గత ఏడేళ్ల నుంచి పుష్కలంగా సాగునీరందుతుందని, ఏదుల రిజర్వాయర్, డీ-8 కెనాల్ లేనప్పుడు సాగునీరు మాకు లేదని గుర్తు చేస్తున్నారు.
దిగివచ్చే దాకా వెనక్కి తగ్గం
నూతన రిజర్వాయర్ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న రైతులు పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికి నెలన్నర రోజులైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పం దన రాలేదు. అయినా కూడా రైతులు దీక్షల వైపే మొగ్గు చూపుతున్నారు. ఎన్ని రోజులైనా సరే శాం తియుతంగా తమ నిరసన తెలియజేస్తామని ప్రతినబూనుతున్నారు. కొత్త రిజర్వాయర్ ఏర్పా టు పట్ల ఎమ్మెల్యే సైతం పునరాలోచించాలని, తమ జీవితాలతో అడుకోవద్దని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికే రైతులు చేస్తున్న దీక్షలకు పలు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు మద్దతునిస్తుండటంతో రైతులు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారు.
మేం కష్టజీవులం..
పదేళ్ల నుంచి వలసలు మానుకొని ప్ర శాంతంగా సేద్యం చేసుకుంటున్నం. నాకు 7ఎకరాల పొలం ఉన్నది. మూడెకరాల్లో మినుములు వేశా. ఇప్పుడు 4ఎకరాల్లో సన్న వడ్లు అలికిన. నా బోరు పుష్కలంగా నీరు పోస్తుంది. అదనంగా డీ-8 కెనాల్ నుంచి సాగునీరందుతుంది. తెలంగాణ రానప్పుడు దేశాలు పోయి బతికినం. కాల్వలు..నీళ్లు వచ్చిన తర్వాతే ఇక్కడ మా భూమితోనే బతుకుతున్నం. చదువుల్లేవు.. మాకు భూమి ఉంటేనే బతుకుదెరువు. దాన్ని వదులుకోలేం.
– మండ్ల కృష్ణయ్య, రైతు, చీర్కపల్లి
భూమి లేకుంటే బతకలేం..
వ్యవసాయ భూములు లేకుండా మేం బతకలేం. మాకు ఆరు ఎకరాల పొలం ఉంది. మా జీవనాధారం సేద్యం. దీనితో నే మా కుటుంబం నడిచేది. ఇప్పుడు కూ డా మా పొలంలో వరి నాటేశాం. బావి, బోరు ఉంది. నీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. కొత్త రిజర్వాయర్ ఏర్పాటైతే మా భూములు మొత్తం పో తాయి. మేం ససేమిరా ఒప్పుకోం. ఎన్ని డబ్బులు ఇచ్చినా మాకు వద్దు. మా భూమి మాకు ఉండాల్సిందే. రిజర్వాయర్ రద్దు కోసం ఎంతకైనా పోరాటం చేస్తాం.
– సుబ్బారెడ్డి, రైతు, గొల్లపల్లి
డబ్బులు ఎన్ని ఇచ్చినా వద్దు..
అవసరం లేని రిజర్వాయర్ను నిర్మిం చి మా పొలాలకు ఎన్ని డబ్బులు ఇస్తామ న్నా మాకు వద్దు. మా భూములే మాకు ముద్దు. తెలంగాణ వచ్చినంక భూమిపై ఆధారపడి బతుకుతున్నం. అంతకు ముందే అయితే, మేం కూడా సరే అని ఒ ప్పుకునేవాళ్లం. మా ప్రాంతంలో నీళ్లు లేకుంటే ఆలోచించే వాళ్లం. నాకు నలుగురు ఆడ పిల్లలు, ఒక కొడుకు. మా జీవనమంతా ఈ భూమిమీదే. మాకు 3ఎకరాల పొలం ఉంది. దీన్ని మేం వదులుకోం. ఎంతవరకైనా పోరాడుతాం.
– సింహాద్రి, రైతు, ఏదుల