గద్వాల: జిల్లాలోని వివిధ ప్రాజెక్టుల పరిధిలో చేపట్టాల్సిన భూసేకరణను ( Land Acquisition ) వేగవంతం చేసి సంబంధిత ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ( Collector Rizwan Basha ) అన్నారు. జవహర్ నెట్టెంపాడు, తుమ్మిళ్ల, గట్టు ఎత్తిపోతల పథకాలకు సంబంధించి చేపడుతున్న భూ సేకరణ, ఆర్అండ్ఆర్ అంశాలపై గద్వాల శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో కలిసి కలెక్టర్ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్లో ఉన్న భూసేకరణను వేగవంతం చేసేందుకు నీటిపారుదల, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయా ఎత్తిపోతల ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణకు సంబంధించి అవార్డు పూర్తయిన రైతులకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించి, పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. నెట్టెంపాడు ప్రాజెక్టులో భాగంగా చేస్తున్న వివిధ పనులను సంబంధిత గుత్తేదారులు నిర్దేశిత గడువులోగా పూర్తిచేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు ప్రారంభమై 20 ఏళ్లు అవుతున్నా కొన్ని ప్యాకేజీల్లో నేటికీ భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదని, ఈ విషయంలో సంబంధిత అధికారుల పనితీరు మెరుగుపడాల్సి ఉందన్నారు. ప్రభుత్వ అవసరాలను గురించి సంబంధిత అధికారులు తెలియజేసి ఒప్పించాలని సూచించారు. నెట్టెంపాడు ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా చేస్తున్న 99 ప్యాకేజీ పనులను సకాలంలో పూర్తిచేసి సంబంధిత ఆయకట్టుకు సాగునీరు అందించాలని కోరారు.