మాగనూరు : సంగంబండ రిజర్వాయర్ (Sangambanda Reservoir project) ముంపునకు గురైన ఉజ్జెల్లి గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పురాతన ఆలయ ప్రాంగణంలో తవ్వకాలు చేపట్టి, అక్కడ ఉన్న శివలింగాన్ని( Shiva Temple ) సైతం పెకలించిన ఆనవాళ్లు కనిపించడంతో గ్రామస్తుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
ఉజ్జెల్లి గ్రామం రిజర్వాయర్ ముంపునకు గురై అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం నిర్మానుష్యంగా మారడంతో కొందరు వ్యక్తులు తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈనెల 3 తేదీన రాత్రి వేళల్లో గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టినట్లు గ్రామస్తులు ఆరోపించారు.
ఆలయ పరిసరాల్లో మట్టి తొలగించడం, రాళ్లు చెల్లాచెదురుగా పడేయడం, పురాతన విగ్రహాలను కదిలించిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. గుప్త నిధుల పేరుతో పురాతన కట్టడాలను ధ్వంసం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఉజ్జెల్లిలో జరిగిన తవ్వకాలపై రెవెన్యూ, పోలీసు, పురావస్తు శాఖ అధికారులు సంయుక్తంగా విచారణ చేపట్టి, తవ్వకాలకు పాల్పడిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.