వనపర్తి, డిసెంబర్ 1 : మున్సిపాలిటీ ప్రజలు నల్లాబిల్లు, ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ డబ్బులను ఆన్లైన్ రశీదు లే కుండా చెల్లించొద్దని మున్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, కమిషనర్ విక్రమసింహారెడ్డి సూచించారు. మున్సిపాలిటీలో కాంట్రాక్టు ఉద్యోగి తిరుమల్రెడ్డి, జూనియర్ అసిస్టెంట్లు మధుబాబు, బాల గోవిందు అవినీతిపై గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గట్టుయాదవ్, విక్రమసింహారెడ్డి మాట్లాడుతూ తిరుమల్రెడ్డి నల్లాబిల్లు, ఇంటి పన్ను, ట్రేడ్ లైసెన్స్ డబ్బులు రూ.7.46 లక్షలు, బిల్ కలెక్టర్ ఇచ్చిన రూ.6.92 లక్షలను కార్యాలయ అకౌంట్లో జమ చేయకుండా వాడుకున్నాడన్నారు.
అతని కాంట్రాక్ట్ గడువు రద్దు అయినా కూడా పాత కమిషనర్ అలాగే కొనసాగించారని, ఇందుకుగానూ చర్యలు తీసుకోవాలని సీడీఎంఏకు లేఖ రాసినట్లు చెప్పారు. యాదాచారి వద్ద మూడేండ్లుగా వసూలు చేసిన రూ.82,371ను మధుబాబు వసూలు చేసి దొంగ రశీదు ఇచ్చారన్నారు. కాగా, యాదాచారి ఫిర్యాదు మేరకకు ఆన్లైన్లో పరిశీలించగా దొంగ రశీదు ఇచ్చినట్లు తేలడంతో మధుబాబుకు మోమో జారీచేసి సీడీఎంఏ దృష్టికి తీసుకెళ్లామన్నారు. మధుబాబును సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు పెట్టాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని చెప్పారు.
డిసెంబర్ 2021, జనవరి, ఫిబ్రవరి 2022లో క్యాషియర్గా పనిచేసిన బాలగోవిందు బిల్కలెక్టర్ల నుంచి వసూలు చేసిన రూ.4.50 లక్షలను బ్యాంకు ఖాతాలో జమ చేయలేదన్నారు. ఖాతాలో తేడాను గుర్తించి విచారిస్తే పొంతన లేని సమాధానం చెప్పాడన్నారు. అతడి వద్ద నుంచి పూర్తి డబ్బులను రికవరీ చేసి సీడీఎంఏ దృష్టికి తీసుకెళ్లగా ఇతర ప్రాం తానికి ట్రాన్స్ఫర్ చేసినట్లు వివరించారు. మున్సిపల్ అధికారులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు త ప్పవని హెచ్చరించారు.