ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఒకే చోట లేకపోవడంతో సమస్యల పరిష్కారంలో జాప్యం ఏర్పడింది. ప్రజలు, అధికారుల ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం ఒకే గొడుగు కిందకు శాఖలను చేర్చేందుకు సమీకృత కలెక్టరేట్ నిర్మాణానికి పూనుకున్నది. నాగర్కర్నూల్లో రూ.52 కోట్లతో 12 ఎకరాల సువిశాల స్థలంలో మూడంతస్తుల్లో సకల హంగులతో సుందరంగా తీర్చిదిద్దారు. ఆయా శాఖల వారీగా గదులను కేటాయించారు. అలాగే రూ.35 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయం మినీ వైట్హౌజ్ను తలపిస్తున్నది. రెండంతస్తుల్లో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాల యం ఆకట్టుకుంటున్నది. కార్యాలయాల్లో పచ్చదనానికి అధిక ప్రాధాన్యతనిచ్చారు. భవనం చుట్టూ పచ్చని మొక్కలను నాటారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు చేశారు. ఈ మూడు భవనాలను
మంగళవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
నాగర్కర్నూల్, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : పరిపాలనను ప్రజల దరికి చేర్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కరువు కాటకాలతో అల్లాడిన కందనూలును సీఎం కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి స్వరాష్ట్రలో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నారు. ఇదే క్రమంలో ప్రజలకు చెంతకే పరిపాలన తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టారు. 32శాఖలను ఒకే భవనంలో అందుబాటులోకి తీసుకొచ్చి సమీకృత కలెక్టరేట్ను రూపొందించారు. ఇతర రాష్ర్టాల్లోని సచివాలయాలను మించి ఆధునిక వసతులతో హెలీప్యాడ్ సదుపాయం, పచ్చదనంతో సువిశాల గదులతో రూ.52కోట్లతో సుందరంగా భవనం నిర్మించారు. అంతేకాకుండా రాజమహల్ను తలపించే లా రూ.35కోట్లతో ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించారు. కార్పొరేట్ కార్యాలయాలను తలదన్నేలా నిర్మించిన ఈ కార్యాలయాలను ఈనెల 6న సీఎం కేసీఆర్ ప్రారంభించనుడడంతో ప్రజలకు పరిపాలన మరింత దరిచేరనున్నది.
ఆధునిక హంగులతో కలెక్టరేట్ భవనం..
సీఎం కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రం సాధించుకున్నాక 2016 అక్టోబర్ 11న విజయదశమి సందర్భంగా నాగర్కర్నూల్ నూతన జిల్లాగా ఆవిర్భవించింది. దీంతో గతంలో నిర్మించిన ఐవోసీ భవన సముదాయంలో పట్టణ నడిబొడ్డున కలెక్టరేట్ తాత్కాలికంగా కొనసాగుతోంది. కాగా, నూతన కలెక్టరేట్లను ఆధునిక వసతులతో నిర్మించేలా సీఎం కేసీఆర్ ఆదేశాలతో నాగర్కర్నూల్లోనూ రూ.52కోట్లతో కలెక్టరేట్ నూతన భవనం నిర్మాణమైంది. మున్సిపాలిటీ పరిధిలో గల దేశిటిక్యాల శివారులోని కొల్లాపూర్ చౌరస్తాలో 12ఎకరాల సువిశాల స్థలంలో 1.25లక్షల చదరపు అడుగుల స్థలంలో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు రెండు అంతస్తుల్లో నిర్మాణమైంది. ఇందులో 32శాఖల కార్యాలయాలు అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం ఐవోసీలో గదులు లేక వేర్వేరు స్థలాల్లో ఆయా కార్యాలయాలు కొనసాగుతున్నాయి.
ఈ భవనం ప్రారంభంతో అన్ని శాఖల అధికారులంతా నూతన కలెక్టరేట్లో ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఇప్పటికే ఆయా శాఖల వారీగా గదుల కేటాయింపు జరిగింది. ప్రజావాణి హాల్, ప్రజలు కూర్చునేందుకు గదులు, మరుగుదొడ్లు, తాగుచినీటి సౌకర్యం, వీడియో కాన్ఫరెన్స్ హాల్ నిర్మాణమయ్యాయి. ఇక జిల్లా పర్యటనలకు వచ్చే మంత్రులు నిర్వహించే సమావేశాలకు స్టేట్ హాల్ నిర్మించడం ప్రత్యేకం. హెలిక్యాప్టర్ కూడా ల్యాండయ్యేలా హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు. పచ్చదనానికి ప్రాధాన్యత ఇస్తూ నూతన భవనం చుట్టూ పచ్చని మొక్కలను నాటారు. ఆవరణలో పచ్చని గడ్డి తివాచిని తలపిస్తుంది. ప్రతి శాఖ కార్యాలయాలు అధికారితో పాటుగా సిబ్బందికీ అనుకూలంగా సువిశాలంగా ఉన్నాయి. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మించారు. కలెక్టరేట్లోకి వచ్చే ప్రజలకు ప్రభుత్వ కార్యాలయానికి వచ్చామా.. కార్పొరేట్ ఆఫీసుకు వచ్చామా అనే స్థాయిలో తీర్చిదిద్దడం గమనార్హం.
మినీ వైట్హౌజ్లా పోలీస్ భవనం..
ఇక పోలీస్ భవన సముదాయం మినీ వైట్హౌజ్ను తలపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎస్పీ కార్యాలయం, రిజర్వు పోలీస్ బలగాలు ఇరుకు గదుల్లో కొనసాగుతున్నాయి. వందలాది మంది పోలీసులకు సరిపోవడం లేదు. జాతీయ, గణతంత్ర, రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించడం కష్టంగా మారింది. పోలీస్ మార్చ్, ఇతర శకటాల ప్రదర్శనకు స్థలం సరిపోవడం లేదు. కొత్త భవనం అందుబాటులోకి వస్తే పోలీసులకు సువిశాల స్థలంలో పరిపాలన అందుబాటులోకి రానుంది. పరిపాలన భవనాలు నాలుగు నియోజకవర్గాలకు అందుబాటులో నిర్మాణం కావడం గమనార్హం. పట్టణ నడిబొడ్డున ఇరుకైన భవనంలో ఉండటంతో రోజూ వేలాది మంది కార్యాలయానికి వస్తుండటంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో జిల్లా కేంద్రంలో ట్రాఫిక్, ప్రజల రద్దీ తగ్గుతుంది.
ప్రారంభానికి సిద్ధమైన బీఆర్ఎస్ కార్యాలయం..
తెలంగాణ సాధించి అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ సొంతంగా పార్టీ జిల్లా కార్యాలయాన్ని కూడా నిర్మించింది. జిల్లా తొలి అధ్యక్షుడిగా ప్రభుత్వ విప్, అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియామకమయ్యారు. జాతీయ పార్టీగా అవతరించడంతో రాబోయే కాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలందరికీ ఈ భవనం అందుబాటులో ఉండనుంది. ఇతర ఏ పార్టీలకూ లేనివిధంగా రెండంతస్తుల భవనం, మీటింగ్ హాల్, తెలంగాణ తల్లి విగ్రహం, పచ్చటి గార్డెన్తో ఆవరణతో కార్యాలయం ఆకట్టుకుంటోంది. ఈ భవనాలను మంగళవారం సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు మంత్రి నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్ రెడ్డి, బీరం హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
కాంతులీనుతున్న కందనూలు..
నాగర్కర్నూల్, జూన్ 4: ఈ నెల 6న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు విద్యుత్దీపాలతో అలంకరించారు. అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేపట్టారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయం సైతం ప్రారంభిస్తుండడంతో ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి, పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం బహిరంగసభ నిర్వహించే వెలమ ఫంక్షన్హాల్ వరకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. రోడ్డు పొడవునా సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే మ ర్రి జనార్దన్రెడ్డిల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీలు పెట్టడంతో రహదారులు గులాబీమయమయ్యాయి. లక్ష మందికిపైగా సభకు తరలిరావాలన్న లక్ష్యంతో అందుకు అనుగుణంగా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతున్నారు.
ప్రజలకు అందుబాటులో కలెక్టరేట్..
ప్రజలందరికీ అందుబాటులో ఉండే స్థలంలో కలెక్టరేట్ నిర్మాణమైంది. దాదాపు 32శాఖలు ఈ భవనంలో ఉంటాయి. ప్రజలందరూ తమ పనులను సులువుగా చేసుకొనేలా భవనం అందుబాటులోకి వచ్చింది. ఈనెల 6న సీఎం కేసీఆర్ ప్రారంభించనుండగా, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.
– ఉదయ్కుమార్, కలెక్టర్, నాగర్కర్నూల్
పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి..
జిల్లా పోలీసు కార్యాలయ భవనం పూర్తి సదుపాయాలతో నిర్మించారు. ఇకపై జిల్లా పోలీసు పరిపాలన, పెరేడ్ గ్రౌండ్ కా ర్యక్రమాలన్నీ నూతన భవనంలోనే నిర్వహించనున్నాం. తెలంగాణ వచ్చాక పోలీసు సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు.
– మనోహర్, ఎస్పీ, నాగర్కర్నూల్