గద్వాల, జూన్ 8 : జిల్లాలో సివిల్ సప్లయ్ కార్యాలయంలో పనిచేసే ఓ ఉన్నతాధికారి అండదండలతో మిల్లర్లు బియ్యం మాయం చేస్తున్నారు. వారు చెప్పిన వారికే ధాన్యం కేటాయింపు మొదలు.. ఎవరైనా మిల్లర్లు తప్పు చేస్తే వారిని రక్షించే వరకు మిల్లర్లకు ఆ అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలున్నాయి. అంతేకాకుండా జిల్లాలో సుమారు రూ.10కోట్ల విలువ చేసే ధాన్యం మాయం చేశారు. ఈ విషయం జిల్లా సివిల్ సప్లయ్ అధికారులకు తెలిసినా పట్టించుకోలేదు. ఇటీవల హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మిల్లులపై దాడి చేయగా, అసలు విషయం బయట పడింది. దీంతో ఏం చేయాలో ఆ జిల్లా అధికారికి పాలుపోక ఈ వ్యవహారం నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. పేదలకు ఆహార భద్రత పథకం కింద (సీఎంఆర్)కస్టమ్ మిల్లింగ్ రైస్ ఇవ్వడం కోసం రైస్మిల్లర్లకు ప్రభుత్వం ధాన్యం అప్పగిస్తుండగా, ఆ ధాన్యాన్ని కొందరు మిల్లర్లు అమ్ముకొని రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సీఎంఆర్ భర్తీ చేస్తున్నారు. రేషన్ బియ్యం కొనుగోలు చేయడానికి ఓ ముఠానే జిల్లాలో ఏర్పడింది. ఆ ముఠా రేషన్ బియ్యం సేకరించి మిల్లర్లకు ఇస్తున్నట్లు సమాచారం. జిల్లాలో 2021-22 వానకాలం, యాసంగికి సంబంధించి 583 ఏసీకేలు మిల్లర్ల నుంచి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. గడువు సమీపించి మిల్లర్లు పెండింగ్ ధాన్యం డెలివరీ చేయాల్సి ఉన్నా పట్టించుకోకుండా అధికారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అయితే కొందరు మిల్లర్లు వడ్లను అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు తెలిసింది. జిల్లాలో మూడు మిల్లులలో సుమారు 108 ఏసీకేలు అమ్ముకొని రూ.10కోట్ల మేర అక్రమంగా సంపాదించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం ఆశాఖ అధికారులకు తెలిసినా ముడుపులు ముట్టడంతో ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మిల్లులపై దాడులు చేయగా, అసలు విషయాలు బయటకు వచ్చాయి..
రెండు మిల్లులపై కేసులు నమోదు..
హైదరాబాద్ నుంచి వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శనివారం జిల్లాలోని మూడు రైస్మిల్లులపై దాడులు నిర్వహించారు. అయిజలోని అన్న పూర్ణమిల్లుకు 60.24ఏసీకేలు, గద్వాల మండలం కాకులారంలో ఉన్న కృషా ్ణ రైస్మిల్లుకు 28.69 ఏసీకేల ధాన్యం, వడ్డేపల్లి మండలంలోని సూర్యట్రేడర్స్ మిల్లుకు 36.82 కేటాయించారు. ఈ మొత్తం ధాన్యానికి సంబంధించి 125.75 ఏసీకేల బియ్యం పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉండగా, కేవలం 16.02 ఏసీకేలు మాత్రమే అప్పగించారు. ఇంకా 109.73 ఏసీకేల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన ధాన్యం రెండు మిల్లులలో మాయమైంది. అయిజలోని అన్నపూర్ణ మిల్లులో కేవలం 1,716 బస్తాలు మాత్రమే మిల్లులో ఉన్నట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. కాకులారం మిల్లులో ధాన్యం నిల్వ లేకపోవడంతో మిల్లు యజమానులపై కేసులు నమోదు చేశారు. అలాగే అయిజలోని శ్రీనివాస రైస్మిల్లు, కేటిదొడ్డి మండలంలో నందిన్నె గ్రామ శివారులో ఉండే మిల్లులో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. దాడులు చేస్తారని ముందస్తు సమాచారం తెలుసుకున్న మిల్లుల యజమానులు ప్రస్తుతం మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని ఇక్కడి సివిల్ సప్లయ్ అధికారులతో పాత ధాన్యమని ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు చెప్పించి కేసులు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
అధికారుల అండదండలు..
రైస్ మిల్లర్లకు సివిల్ సప్లయ్శాఖలో పనిచేసే అధికారుల నుంచి పుష్కలంగా సహాయ సహాకారాలు ఉండడంతో వారు చెప్పిందే వేదంగా నడుస్తోంది. సివిల్ సప్లయ్ కార్యాలయంలో కూర్చొని వారికి అనుకూలమైనా మిల్లులకు ప్రభుత్వం కొనుగోలు చేసిన వడ్లను కేటాయిస్తున్నారంటే వారి ప్రాభల్యం ఎంత మేరకు ఉందో ఇట్టే తెలిసిపోతున్నది. గతంలో పీడీఎస్ రీసైక్లింగ్కు సంబంధించి జైలుకు వెళ్లి వచ్చిన మిల్లు యజమానికి ధాన్యం కేటాయించారంటే అధికారుల పనితీరు తెలిసిపోతున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో జిల్లాలోని అన్ని మిల్లులపై ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు చేసి విచారణ చేపడితే మరిన్ని మిల్లుల బాగోతం బయటపడే అవకాశం లేకపోలేదు.