కొల్లాపూర్, జనవరి 9: దక్షిణ తెలంగాణలోనే రెండో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిగా భక్తులు కొలిచే కొల్లాపూర్ మండలం సింగవట్నం లక్ష్మీనర్సింహస్వామి ఇక్కడ లింగరూపంలో కొలువయ్యాడు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా నిత్యపూజలందుకుంటున్నాడు. ఏటా సంక్రాంతి రోజున ఈ నెల 15వ తేదీ నుంచి లక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై 21వ తేదీన ఉత్సవాలు ముగుస్తాయి. అయితే జాతర నెలరోజులుగా కొనసాగుతుంది. బ్రహ్మోత్సవాలకు ఆలయ అధికారు లు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. బ్రహ్మోత్సవాలకు తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. స్వామికి ఎదురుగా అర కిలోమీటరు దూరానా ఎత్తైనా రత్నగిరికొండపై లక్ష్మీదేవి కొలువై ఉన్నది. స్వామివారికి నిత్యం అభిషేకం, పూజా కైంకర్యాలు నిర్వహిస్తారు.
స్థల పురాణం..
లక్ష్మీనర్సింహస్వామి ఈ ప్రాంతంలో వెలియడానికి వెనుక ఆసక్తికరమైన ఇతీహాసం ఉన్నదని స్థానిక కురువృద్ధులు చెబుతారు. ఐదు శతాబ్దాల కిందట సురభివంశానికి చెందిన 11వ తరం వారైన సంగమనాయుడనే భూపాలుడు జటప్రోలు కేంద్రంగా ఈ ప్రాంతాన్ని పాలించాడు. ఆ సమయంలో ఓ రైతు తన పొలంలో ఒక మూలన అరక దున్నుతుండగా లింగాకారంలో ఓ శిల నాగలికి అడ్డుతగులుతుండగా శిలను రైతు ఎన్నిసార్లు ఒడ్డుమీదకు చేర్చినా తిరిగి అక్కడై ప్రత్యక్షమై అతడి పనికి అంతరాయం కలిగిస్తుండేది. వారం రోజులు జరిగినా అమాయకుడైన ఆ రైతు అడ్డుతగులుతున్న శిల మహిమను గుర్తించలేక దేవుడిని ప్రార్థిస్తూ తనను కరుణించమని ప్రార్థించాడు.
ఒక రాత్రి భూపాలుడైన సింగమనాయుడి కలలో శిలారూపంలో ఉన్న దేవుడు కనిపించి తాను ఈ ప్రాంతానికి ఉత్తరదశలో ఓ రైతు పొలంలో వెలిశానని చెప్పాడు. తాను రోజూ నాగలికి అడ్డుతగులుతున్నా అతను తనను నర్సింహస్వామిగా గుర్తించడం లేదని చెప్పాడు. ఇదే దినం నడిజాములో తనను గుర్తించి వెం టనే ప్రతిష్ఠించి పూజలు చేయాలని చెబుతాడు. సింగమనాయుడు తాను కన్నది కల, నిజమా అని తెలుసుకునేందుకు సైన్యంతో రైతు పొలాన్ని కాగడాల సాయంతో వెతకగా లింగరూపంలో వెలిగిపోతున్న శిల కన్పించిందట. కలలో దేవుడు కనిపించి చెప్పిన పోలికలన్నీ సరిగ్గా సరిపోవడంతో అప్పటికప్పుడే భూపాలుడు ఆ లింగాన్ని అభిషేకించి ప్రతిష్ఠించారని ప్రచారంలో ఉన్నది. స్వామికి
ఎండతగలకుండా నాపరాయి, మట్టితో చిన్నగుడిని అప్పట్లో నిర్మించారు.