అలంపూర్, ఫిబ్రవరి 24 : తుమ్మిళ్ల ఎత్తిపోతల మోటార్లకు నీరంది సజావుగా నడిచేందుకు టీబీ డ్యాం నుంచి ఇండెంట్ పెట్టాలని ఈఈ విజయ భాస్కర్తో మాట్లాడానని.. ఆయకట్టు రైతులు ఆందోళన చెందాల్సిన పని లేదని ఎమ్మెల్యే అబ్రహం స్పష్టం చేశారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. కర్నూలు జిల్లా ఇరిగేషన్ అధికారులతో కూడా ఇండెంట్ విషయమై మాట్లాడానన్నారు. ఆర్డీఎస్ ఆనకట్ట నుంచి శుక్రవారం 4,800 క్యూసెక్కుల నీరు విడుదలైందని తెలిపారు. తుమ్మిళ్ల వద్ద మోటార్లు రన్ కావాంటే వాటర్ లెవల్ 291.5మీటర్లు ఉండాలని.. ప్రస్తుతం 290 మీటర్లు మాత్రమే నీరు ఉన్నదన్నారు. శనివారం సాయంత్రం వరకు 1.5మీటర్ల లెవల్ పెరిగే అవకాశం ఉన్నందున ఆదివారం ఉదయమే మోటార్లు ఆన్ చేయిస్తామని చెప్పారు. విషయ పరిజ్ఞానం లేని, సమస్య అర్థం చేసుకోని కొంతమంది రాజకీయ నాయకుల మాటలు నమ్మి రైతులు ఆందోళన చెందొద్దని ఎమ్మెల్యే సూచించారు. అన్నదాతకు ప్రభుత్వం ఎల్లవేళలా తోడుగా ఉంటుదని స్పష్టం చేశారు.