నవాబ్పేట, డిసెంబర్ 1 : మండలంలోని కొన్ని గ్రామాల్లో వ్యాపారులు, రైస్మిల్లర్లు మార్కెట్ ఫీజు చెల్లించకుండా నేరుగా రైతులతో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని మార్కెట్ కమిటీ చైర్మన్ మెండె లక్ష్మయ్య అన్నారు. మండలంలోని కొల్లూరు గ్రామశివారులో ఉన్న రైస్మిల్లును గురువారం తనిఖీ చేయగా, మా ర్కెట్ ఫీజు చెల్లించకుండా రైతులతో నేరుగా ధాన్యం కొనుగోలు చేసినట్లు బయటపడిందన్నారు.
అలాగే కొల్లూరులోని కొందరు ఫర్టిలైజర్ వ్యాపారులు కూడా రైతులతో నేరుగా మొక్కజొన్న, ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తేలడంతో మార్కెట్ ఫీజు వసూలు చేసినట్లు తెలిపారు. మండలం నుంచి ధాన్యాన్ని అక్రమంగా తరలించకుండా చెక్పోస్ట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. వ్యాపారులు మార్కెట్ ఫీజు చెల్లించి ధాన్యం కొనుగోలు చేయాలని సూచించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ చందర్నాయక్, సిబ్బంది రాములు, సత్యం పాల్గొన్నారు.