మహబూబ్నగర్టౌన్, జనవరి 5 : జిల్లా కేంద్రంలోని అబ్దుల్ ఖాదర్షా ఉత్సవాలు ఈ నెల 6నుంచి ప్రారంభంకానున్నాయి. 85వ ఉర్సును పురస్కరించుకొని నిర్వాహకులు ఏర్పాట్లను పూర్తిచేశారు. మత సామరస్యానికి ప్రతీకగా ప్రతియేటా నిర్వహించే ఉర్సు వేడుకల్లో కుల, మతాలకతీతం గా ప్రజలు పాల్గొని మొక్కులు చెల్లించుకుంటారు. అబ్దుల్ఖాదర్ దర్గాకు ఎంతో చరిత్ర ఉన్నది. అన్ని మతాలు, కులాల ప్రజలకు ఆరాధ్యంగా నిలిచింది. అబ్దుల్ ఖాదర్షా ఓ పోలీస్ కానిస్టేబుల్ 1929లో కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ నుంచి మహబూబ్నగర్కు వచ్చి ఇక్కడే స్థిరపడినట్లు ముస్లిం మతపెద్దలు చెబుతారు. ఆయన పోలీస్ విధులు నిర్వహిస్తూనే దైవచింతన, ఆధ్యాత్మిక భావనతో ప్రజలను చేరదీసేవారు. తన ఉద్యోగ విరమణ అనంతరం ఆయన జిల్లా కేంద్రంలోని రాయిచూర్ రోడ్డులో ఓ చెట్టు కింద కూర్చొని ప్రజలకు హితబోధ చేసేవారు. ప్రతి గురు, శుక్రవారాల్లో ఖాదర్షా వద్దకు చుట్టుపక్క గ్రామాల ప్రజలు తరలివచ్చి తమ బాధలు, సమస్యలను విన్నవించుకునేవారు. ఆయన సామరస్యంతో పరిష్కార మార్గాలను చెప్పేవారని చరిత్ర చెబుతున్నది. ఖాదర్షా మరణానంతరం కుటుం బ సభ్యులు ఖాదర్షా ఆశయాలను ఆచరణలో పెట్టేందుకు రాయిచూర్ రోడ్డు పక్కనే నిర్మించిన ఆయన సమాధిపై దర్గాను ఏర్పాటు చేశారు. అప్పటినుంచి దర్గాను కుల, మతాలకతీతంగా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తున్నది.
ఈ నెల 6నుంచి అబ్దుల్ ఖాదర్ షా దర్గా ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. 6న జలాభిషేకం(గుసూల్ షరీఫ్), 7న సాయంత్రం 4గంటలకు గంధోత్సవం షేక్ బడేసాబ్ ఇంటి నుంచి బయలుదేరి అశోక్టాకీస్ చౌరస్తా, ఎస్బీహెచ్ రోడ్డు, తూర్పు కమాన్, పోలీస్ క్లబ్ నుంచి వన్టౌన్ చౌరస్తా గుండా దర్గాకు చేరుకుంటుంది. అక్కడ చాదర్ సమర్పించి ఫాతేహా అందజేస్తారు. ఉర్సు వేడుకల్లో నాగ్పూర్ చెందిన ప్రముఖ ఖవ్వాలి బృందం ఖవ్యాలి నిర్వహించనున్నారు. దాదాపు వారం రోజులపాటు జరిగే ఉర్సు వేడుకలు ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా ముంబై, హైదరాబాద్, రాయిచూర్ తదితర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు పాల్గొంటారు. ఈ వేడుకల్లో గుల్బర్గా పీఠాధిపతి కర్ణాటక ప్రసిద్ధ గుల్బర్గా షరీఫ్ దర్గాకు చెందిన పీఠాధిపతి హజ్రత్ సయ్యద్ హిదాయతుల్లా బాదేషా ఖాద్రి అల్ బాగ్దాదితోపాటు ప్రముఖ దర్గాల పీఠాధిపతులు హాజరుకానున్నా రు. స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులుతోపాటు పట్టణ ప్రముఖులు వేడుకలో పాల్గొననున్నారు. ఈ ఉత్సవాలకు సంబంధించి భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.