జడ్చర్లటౌన్, డిసెంబర్ 26: తాగుడుకు బానిసైన భర్త వేధింపులను తట్టుకోలేక ఇల్లు వదిలిపెట్టి తన మూడేండ్ల కొడుకుతో వచ్చిన ఓ నిండు గర్భిణీ నడిరోడ్డు పక్కనే ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఘటన జడ్చర్లలో వెలుగుచూసింది.. బాధితురాలి కథనం మేరకు.. మిడ్జిల్ మండలం చిల్వేర్కు చెందిన వాడ్యాల యాదమ్మకు తిమ్మాజిపేట మండలం ఆవంచకు చెందిన జంగయ్యతో వివాహమైనది. కొంతకాలంగా భర్త తాగుడుకు బానిసై వేధిస్తుండటంతో ఆమె తన కొడుకుతో కలిసి జడ్చర్లకు వచ్చింది. ఇక్కడే బిక్షాటన చేసుకుంటూ జడ్చర్లలోని గాంధీచౌరస్తా వద్ద రోడ్డు పక్కన ఓ రేకులషెడ్డు కింద తలదాచుకుంటున్నది. ఈనెల 2వ తేదీన ఆమె వైద్యపరీక్షల కోసం జడ్చర్ల ప్రభుత్వ దవాఖానకు వెళ్లింది. ఈ క్రమంలో దవాఖానలో డబ్బులు దొంగిలించిందని ఆమెపై దవాఖాన సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దవాఖాన వద్దకు చేరుకొని ఆమెను మందలించి వదిలిపెట్టారు. ఈ క్రమంలో ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి.. అయినా తనపై దొంగతనం ఆరోపణ ఉండటంతో దవాఖానకు వెళ్తే వైద్యులు తిడ్తారేమోనని భయంతో వెళ్లలేదు.
అర్ధరాత్రి ఎముకలు కొరికే చలిలోనే ఆమె ప్రసవ వేదనతో అవస్థ పడుతూ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. రక్తస్రావంతో ఉన్న ఆమె దీన పరిస్థితిని గుర్తించిన స్థానికులు వెంటనే తల్లీబిడ్డను ఆటోలో తీసుకెళ్లి జడ్చర్ల ప్రభుత్వ దవాఖానలో చేర్పించారు. అక్కడే డ్యూటీ డాక్టర్ సూర్య తల్లీబిడ్డకు వైద్యచికిత్సలు అం దించారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రభుత్వ దవాఖానకు కూతవేటు దూరంలో ఈ ఘటన చోటుచేసుకోవడం చర్చనీయాంశమైనది. ఈ విషయంపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సోమశేఖర్ను వివరణ కోరగా ఈ నెల 2న యాదమ్మ దవాఖానకు వచ్చిందని, దవాఖానలో డబ్బులు దొంగలించిన ఘటనలో పోలీసులు ఆమెను మందలించి వదిలిపెట్టారని, ఆ తర్వాత ఆమె దవాఖానకు రాలేదన్నారు. ప్రసవం అనంతరం ఆమెను స్థానికులు దవాఖానకు తీసుకొచ్చి చేర్పించారని చెప్పారు. ప్రస్తుతం తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని, ఆమె కుటుంబసభ్యులకు ఫోన్లు చేసినా ఎవరూ స్పందించడం లేదన్నారు. రెండురోజుల తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేస్తామన్నారు.