గద్వాల, డిసెంబర్ 11: నిజాం రాజ్యంలోనే అతి పెద్ద హిందూ సంప్రదాయ సంస్థానం, ఖ్యాతిగాంచిన గద్వాల సంస్థానం యుద్ధ చరిత్రకు సాక్ష్యం గద్వాల నడిబొడ్డున ప్రతిష్ఠించిన ఎల్లమ్మ ఫిరంగి చరిత్రను గుర్తుచేస్తున్నది. గద్వాల సంస్థాన మూల పురుషుడు, సంస్థానం స్థాపకుడైన నలసోమభూపాలుడి(నల్ల సోమనాద్రి) యుద్ధ పోరాట పటిమను, ఆ నాటి యుద్ధ సరళి, సైనికుల ధైర్య సాహసాలకు ఈ ఎల్లమ్మ ఫిరంగి గద్వాలకు గుర్తుగా నిలిచింది. నలసోమభూపాలుడు నిజాం రాజ్య సామంతులపై సాధించిన గెలుపునకు గుర్తుగా దండుగా(ఫైన్) కింద కర్నూలు పట్టణ కొండారెడ్డి బుర్జుపై ఉన్న ఎల్లమ్మ ఫిరంగిని నల్లసోమనాద్రి తీసుకొచ్చాడని చరిత్రకారులు చెబుతున్నారు.
సోమనాద్రి ఇక్కడి రాజోళి ప్రాంతం నుంచి పూడూరు గ్రామ దత్తపుత్రుడుగా వచ్చి కృష్ణానది తీరానికి వేటకు వచ్చాడని, గద్వాల ప్రాంతం కృష్ణానది సమీపంలో ఉన్నందున కోట నిర్మాణానికి, కోటకు స్థల నిర్ధారణ చేసుకోవడానికి వచ్చినట్లు తెలిసింది. స్థల నిర్ధారణ జరగగానే ఉప్పేరు నవాబుకోట నిర్మాణానికి ఆక్షేపణ తెలిపాడని చరిత్ర చెబుతున్నది. కాగా, ఉప్పేరు నవాబు నిజాం నాసారుద్దీల్లాకు అప్తుడైనందున నాసారుద్దీల్లా అనుమతితో కోట నిర్మాణం పూర్తయిన తర్వాత ఉప్పేరు నవాబుకు కప్పం చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఒప్పందం ప్రకారం కోట నిర్మాణం పూర్తయినా కప్పం చెల్లించకపోగా సోమనాద్రి ఉప్పేరు నవాబుపై యుద్ధం ప్రకటించాడు. గద్వాల, రాయిచూర్ మధ్యన ఆరగిద్ద గ్రామం వద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో ఉప్పేరు నవాబుకు సహాయంగా రాయిచూర్ నవాబు ఓసర్జంగ్ ప్రాగటూరు నవాబు ఈదర్సాహేబ్ వచ్చినా ఉప్పేరు నవాబుకు ఓటమి తప్పలేదు. ఓటమి పాలైన ఉప్పేరు నవాబు హైదరాబాద్ నవాబుల వద్ద తన గోడును చెప్పుకోగా, నైజాం నవాబులు అతడికి సహాయంగా సోమనాద్రిపై తిరిగి యుద్ధం ప్రకటించారు. రాయచూర్, ప్రాగటూరు, కర్నూల్ నవాబుల సహాయంతో ఉప్పేరు నవాబు యుద్ధానికి సిద్ధమయ్యారు. నైజాం సైన్యాలు తుంగభద్ర నది దక్షిణ తీరంలో నిర్జూర్ వద్ద సోమనాద్రి సైన్యాలు నది ఉత్తరతీరంలో కలుగొట్ల వద్ద మోహరించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
సోమనాద్రి ఒకవైపు నైజాం సైన్యాలతో తలపడుతూ శత్రు సైన్యాన్ని తన సైన్యం సహకారంతో చెండాడి నైజాం సైన్యాన్ని దెబ్బతీస్తూ వచ్చారు. యుద్ధంలో నైజాం వైపు ఉన్న బళ్లారి, ఆదోని నవాబులను సంహరించాడు. శత్రు సైన్యాలను తరుముతూ సోమనాద్రి కర్నూల్ కోటలోకి ప్రవేశించాడు. నిజాం సైన్యాలు కోట తలుపులు మూసివేసినప్పటికీ సోమనాద్రి అధైర్యపడకుండా శత్రు సైన్యాలను చీల్చి చెండాడి విజయం సాధించాడు. ఈ యుద్ధంలో గెలుపొందడం వల్ల కర్నూలు కోటలోని ఎల్లమ్మ దేవత బుర్జుపై ఉన్న ఫిరంగి సోమనాద్రి వశమైనది. ప్రముఖ చరిత్రకారుడు వైద్యం వెంకటాచార్యులు అభిప్రాయం మేరకు ఎల్లమ్మ బుర్జుపై ఉన్నందునే ఈ ఫిరంగి ఎల్లమ్మ ఫిరంగి అని నామకరణం వచ్చిందని పలువురి అభిప్రాయం.
సంస్థానాలు రద్దు అయిన తర్వాత గద్వాలకోట రాతిబుర్జు సమీపంలో ఏండ్లుగా మట్టిలో కూరుకుపోయి పడి ఉన్న ఎల్లమ్మ విగ్రహాన్ని కృష్ణానది పుష్కరాల సందర్భంగా మాజీ మంత్రి డీకే సమరసింహారెడ్డి చొరవతో పాతబస్టాండ్ను ఐలాండ్గా ఏర్పర్చి రాజీవ్మార్గ్ ప్రారంభంలో ఫిరంగిని ఉంచారు. ప్రస్తుతం ఫిరంగి ఆదరణకు నోచుకోవడం లేదు. ఈ ఫిరంగి ఇలా ఏర్పాటు చేయడం వల్ల పట్టణానికి మరింత శోభను తెచ్చింది. ఇది గద్వాల యుద్ధ చరిత్రను, సంస్కృతిని ప్రతిబింభజేస్తుంది. 30అడుగుల పొడవున్న ఫిరంగి రాష్ట్రంలో ఎక్కడా లేదని తెలుస్తుంది. గద్వాల కోట, గుడులు, గోపురాలు, చరిత్ర కట్టడాలు శిథిలమవుతున్నా ఎల్లమ్మ ఫిరంగి మాత్రం గద్వాల సంస్థాన పురాతన చరిత్రను ఎల్లకాలం నిలిపి ఉంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.