జడ్చర్లటౌన్, డిసెంబర్ 22 : జడ్చర్ల మండలం మాచారం వద్ద 44వ జాతీయరహదారిపై గురువారం ఉదయం ఓ కంటైనర్ లారీని వెనుకనుంచి కారు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు హైదరాబాద్లోని గోషామహల్ ప్రాంతానికి చెందిన రవి, లాలూ, చింటూ అనే ముగ్గురు కలిసి వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ నుంచి నంద్యాలకు కారులో బయల్దేరారు. జడ్చర్ల మండలం మాచారం గ్రామ శివారులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటగానే కారు అదుపుతప్పి ఒక్కసారిగా ముందు వెళ్తున్న కంటైనర్ని ఢీకొంది.
ఈ ప్రమాదంలో కంటైనర్ లారీ వెనుక కారు దూసుకెళ్లడంతో కారు డ్రైవర్ చింటూ కారు స్టీరింగ్లో ఇరుక్కున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని స్థానికుల సహాయంతో డ్రైవర్ను బయటకు తీశారు. కారులో ఇరుక్కున్న డ్రైవర్ను బయటకు తీసేందుకు దాదాపు రెండు గంటల సమయం పట్టింది. దీంతో మూడు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. 108 అంబులెన్స్ సిబ్బంది అక్కడే కారు స్టీరింగ్లో ఇరుక్కున్న డ్రైవర్కు స్లైన్ బాటిల్ ఎక్కిస్తూ ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్షతగాత్రులు ముగ్గిరిని చికిత్స నిమిత్తం మహబూబ్నగర్ ఎస్వీఎస్ దవాఖానకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.