హైదరాబాద్, జూలై 12: హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. వచ్చే ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచేందుకు పడరాని పాట్లు పడుతున్నది. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రాజీనామా చేయటంతో ఇక్కడ త్వరలో ఉప ఎన్నిక జరుగనున్నది. దాంతో ఈటల కుటుంబంతోపాటు, ఆయన వెంట ఉన్న స్థానిక బీజేపీ నాయకులు ఇప్పటినుంచే ఓటర్లకు తాయిలాలు పంచటం మొదలుపెట్టారని సమాచారం. ఈటల సతీమణి ఈటల జమున ఈ నెల 6, 8 తేదీల్లో వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం మాదన్నపేట, గునిపర్తి గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె గ్రామస్తులకు ఈటల రాజేందర్, బీజేపీ గుర్తు ఉన్న ఫేస్ మాస్కులను, గోడ గడియారాలు భారీగా పంచినట్టు తెలిసింది.
మహిళా ఓటర్లే లక్ష్యంగా..
నియోజకవర్గంలోని మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకొనేందుకు ఈటల కుటుంబం, బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు స్థానికులు చెప్తున్నారు. జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దేశిని స్వప్న ఈ నెల 7,8 తేదీల్లో కొన్ని వందల కుటుంబాలకు కుక్కర్లను పంపిణీ చేశారని తెలిసింది. ఈటలను రాష్ట్ర క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయటానికి ముందే కొన్ని సంస్థల ద్వారా కమలాపూర్లోని కమ్యూనిటీ హాల్లో మ హిళలకు పంచేందుకు వెయ్యికిపైగా కుట్టుమెషిన్లను నిల్వ ఉంచారని స్థానికుల ద్వారా తెలిసింది. అందులో కొన్నింటిని ఇప్పటికే స్థానిక మహిళకు పంచారని సమాచారం. ఈటల రాజేందర్ ఆదేశాలతో ఇల్లందకుంటకు చెందిన శ్రీసీతారామ ఆలయ డైరెక్టర్ కనకుంట్ల అరవింద్, కమలాపూర్ కమ్యూనిటీహాల్ అధికారి మార్గం భిక్షపతి ఈ కుట్టు మెషిన్లను పంపిణీ చేస్తున్నట్టు తెలిసింది.
‘ఫేక్’డుగాళ్లు
బీజేపీ సృష్టించిన సోషల్ మీడియా యూనివర్సిటీ కిరాయి ముఠా హూజూరాబాద్లో దిగబడింది. దుష్ప్రచారం చేయటం లో సిద్ధహస్తులైన ‘ఫేక్’డుగాళ్లు నియోజకవర్గం అంతటా చేరారు. ఈటల రాజేందర్ మండలానికో యూట్యూబ్ చానల్ను తెరిపించారు. నియోజకవర్గానికి చెందిన పెయిడ్ అర్టిస్టులను తర్ఫీదు ఇప్పించి సర్కార్ను తిట్టిస్తున్నారు.