‘అది నగరంలోని ఓ ప్రముఖ రెస్టారెంట్. సాధారణంగా రోజుకు సుమారు రూ.2 లక్షల వరకు వ్యాపారం కొనసాగుతున్నది. లాక్డౌన్ ప్రారంభమయ్యాక వ్యాపారం ఏ మాత్రం తగ్గకపోగా మరో లక్ష వరకు పెరిగింది. కేవలం యాప్ ఆధారిత సేవలతోనే హోటళ్లు, రెస్టారెంట్లు అధిక ఆదాయం పొందుతున్నాయి.’
లాక్డౌన్తో బయటకెళ్లే పరిస్థితి లేకపోవడంతో అధికమంది ఆన్లైన్ ఆర్డర్ల వైపు మొగ్గుచూపుతున్నారు. చాలావరకు నగరవాసులు బయటకు వెళ్లి సరదాగా హోటళ్లలో లంచ్, డిన్నర్, ఐస్క్రీం పార్లర్స్లో విభిన్న రకాల రుచులను ఆస్వాదించడం అలవాటు. కానీ కొవిడ్ విజృంభణకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో అలాంటి వారి ఆశలకు బ్రేకులు వేసింది. అయితే యాప్ ఆధారిత కంపెనీలు స్విగ్గీ, జొమాటోలు మాత్రం వారికి రుచులను అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు అలాంటి వారందరికి ఆన్లైన్ ఫుడ్ దిక్కయ్యింది. కస్టమర్ల నుంచి ఆర్డర్లు విరివిగా వస్తుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లు లాభాలబాటలో నడుస్తున్నాయి.
గ్రేటర్లో ఫుడ్ యాప్ ఆధారిత కంపెనీలకు భలే గిరాకీ ఉంది. ప్రతినిత్యం లక్షలాది ఆర్డర్స్ ఆహారానికి సంబంధించినవే ఉంటాయి. లాక్డౌన్కు ముందు ఒక డెలివరీ బాయ్కి సుమారు 15 నుంచి 20 వరకు ఆర్డర్లు రాగా..లాక్డౌన్ మొదలయ్యాక 30 నుంచి 50 వరకు వస్తుండటంతో వారికి చేతినిండా పని దొరుకుతున్నది. ప్రతి ఆర్డర్ మీద కమీషన్ 20 నుంచి 30 రూపాయల వరకు వచ్చేది. ఆర్డర్స్ పెరగడంతో కమీషన్ కూడా అధికంగానే వస్తున్నది. దీనికితోడు ఇప్పుడు రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో ఆర్డర్ నిర్ణీత సమయానికి ముందే ఇంటికి చేర వేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు కూడా పూర్తిగా ఆన్లైన్ సేవలకే పరిమితమవ్వడంతో ప్యాకింగ్ పనులు త్వరగా పూర్తవుతున్నాయి. ఆన్లైన్ సేవల వల్ల కొంతవరకు నిర్వహణ ఖర్చులు తగ్గాయని నిర్వాహకులు చెబుతున్నారు.
‘అతడి పేరు రాకేశ్. డెలివరీ బాయ్. లాక్డౌన్కు ముందు నిత్యం సుమారు 20 వరకు ఆర్డర్లు వచ్చేవి. లాక్డౌన్ ప్రారంభంతో ఆర్డర్లు రెట్టింపు అయ్యాయి. కమీషన్ అధికంగా సంపాదిస్తున్నాడు. ఒక ఆర్డర్ మీద రూ.20 చొప్పున రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకు ఆర్జిస్తున్నాడు.
లాక్డౌన్ ప్రారంభమైనప్పటి నుంచి ఆర్డర్లు అధికంగా వస్తున్నాయి. కస్టమర్లు ఇదివరకు హోటళ్లకు వచ్చి ఆరగించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. సమయం కన్నా ముందే ఆర్డర్లను ఇంటికి చేర్చుతున్నాం. కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ప్యాకింగ్లో ఏ చిన్నలోటు లేకుండా అందిస్తున్నాం. -కార్తీక్, స్విగ్గీ
లాక్డౌన్ విధించాక ఆన్లైన్ ఆర్డర్స్ అధికమయ్యాయి. కమీషన్ లేదని మానేసిన వారు కూడా ఇప్పుడు మళ్లీ ఉద్యోగంలో చేరుతున్నారు. కంపెనీలకు కూడా వారి అవసరం అధికంగా ఉన్నది. కరోనా క్లిష్ట సమయంలో కూడా ఆన్లైన్ సర్వీస్తో కస్టమర్లకు కావాల్సినవి అందిస్తున్నాం. అన్నిరకాల కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. – మనోజ్, జొమాటో