అలంపూర్, ఫిబ్రవరి 11 : రెండ్రోజుల్లో తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి ఆయకట్టుకు సాగునీరు అందిస్తామని అలంపూర్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహం తెలిపారు. మాయ మాటలు చెప్పి, ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ఓట్ల రాజకీయం చేసే ఇతర పార్టీల నాయకుల మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. శనివారం ఏపీలోని కర్నూల్ జిల్లా ఇరిగేషన్ ఎస్సీ శేఖర్రెడ్డితో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడారు. తుమ్మిళ ఎత్తిపోతల ఆయకట్టులో పంటలు ఎండుదశలో ఉంటూ రైతులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. కేసీ కెనాల్ నుంచి విడుదలవుతున్న 1000 క్యూసెక్కుల నీటిని 400 క్యూసెక్కులకు తగ్గించడం వల్ల తుమ్మిళ్ల నీటిని మోటార్లతో పంపింగ్ చేసుకోవచ్చని కోరారు. ఇందుకు ఏపీ ఇరిగేషన్ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఎత్తిపోతల మోటార్లను ఆన్ చేసేందుకు సిద్ధం కావాలని తెలంగాణ ఇరిగేషన్ అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.
పంటల సాగుకు నిరంతర ఉచిత విద్యుత్ ఇవ్వాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్రెడ్డితో, అసెంబ్లీ సమావేశాల సమయంలో సీఎం కేసీఆర్ను కలిసి మాట్లాడానని ఎమ్మెల్యే అబ్రహం తెలిపారు. నిరంతర విద్యుత్ పరఫరా చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. రైతులు ఆందోళన చెందొద్దని, ప్రభుత్వంపై భరోసాతో ఉండాలన్నారు.