‘అద్దంలో నేను’ కథా సంపుటిలో మొత్తం 25 కథలున్నాయి. కానీ ‘అద్దంలో నేను’ కథ లేదు. అదే నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. సంపుటిలో గొప్ప అనుకునే ఓ కథ పేరును రచయిత సంపుటికి పెడతారు. అది చాలా కాలంగా ఆచరణంగా వస్తున్న సంప్రదాయం. ఆ సంప్రదాయానికి సుజన ‘గుడి గంట’ మోగించి, ప్రతి పాఠకుడు కథలలో తమను తాము చూసుకోగలరు కనుక, ‘అద్దంలో నేను’ అనే పేరు పెట్టారు. కవి/కవయిత్రి, రచయిత/రచయిత్రి అంటే కాలానికి సాక్షులు అని బలంగా నమ్ముతాను.
తన కాలంలో జరిగినవి, జరుగుతున్నవి కవులు, రచయితలు రాసినప్పుడే ఆ రాతలకు విలువ, గౌరవం దక్కుతాయి. ప్రతి కథా మన ముందు జరుగుతున్న ఘటనల సమాహారమే! రచయిత్రి కథ మొదలు పెట్టడంలో ఎంత నేర్పరో, ముగించడంలోనూ అంతే నేర్పరి. తను రాసేదేమిటో సుజనకు స్పష్టంగా తెలుసు. అందుకే ప్రతి కథలో మంచి మలుపు, విషయం ఉండాలని భావించడమే కాదు, సఫలీకృతులు కూడా అయ్యారు.
చెట్టు చెబుతుంది జీవితానికి అర్థం, రాయితో కొట్టినా కాయనిస్తుంది! అలాగే కిటికీ కూడా బోధిస్తుంది, లోకాన్ని తలుపులు (మనసుకున్న) తెరిచి చూడమని! ‘నోటు కంటే ఓటు ముఖ్యం’ అంటారు గిరిప్రదక్షిణ అనే కథలో. బతుకమ్మ ఉయ్యా లో సల్లంగా బతికించు ఉయ్యాలో అంటూ ఆటలాడి, పాటలు పాడితే బతుకు దారంతా బతుకమ్మ మన తోడు నడవదూ! అతివల ఆంక్షలు మహిళల మనోభావాలు’ తెలియాలంటే 25వ గంట చదవక తప్పదుగా మరి! అని ఆకట్టుకునేలా రాశారు. ‘వ్యత్యాసం’ అనే కథ కండ్లు చెమ్మగిల్లేలా చేసింది. ఇది నిజంగా మనల్ని మనం అద్దంలో చూసుకునేట్టు చేసిన కథ! కుక్కలకు ఇచ్చే అటెన్షన్, మనము వృద్ధులకు, అదీ మన తల్లిదండ్రులకు ఇస్తున్నామా ? ఈ ప్రశ్న మనసులో పుట్టక మానదు. అన్నం పెట్టాల్సింది అహంకారులకు కాదు, అన్నార్తులకు అని తెలియజెప్పే కథ ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’. ఇక ‘నాన్న డైరీ’ మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది. ‘వారి చెప్పుల్లోకి కాళ్లు దూర్చి’ నడిస్తే ఎలా ఉంటుందో, మనకు బోధపడుతుంది.
ఇక ‘అనుబంధాలు’, ‘ప్రకృతి నేర్పిన పాఠం’, ‘ఆమె మారిపోయింది’, ‘రెప్పచాటు స్వప్నం’, ‘టైం ఎంతయింది? ’, ‘క(ఖ)ర్మయోగి’, ‘చివరి కోరిక’ మనసును ఆలోచనలోకి నెడుతాయి. కొంతమంది పుంఖానుపుంఖాలుగా రచనలు చేస్తారు ప్రతీకథ ఓ ప్రత్యేకత సంతరించుకొని, పాఠకుల మనసులో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. కథా సంకలనంలో మరో గొప్ప విషయం ఏమిటంటే, రచయిత్రికి ‘యాస’ మీద రచయిత్రికి ఉన్న పట్టు. తెలంగాణ యాస అయితే మరీ! ‘యాస.. భాషకు శ్వాస’ అని నమ్ముతాను. ఆ మాటను ఈ కథల సంకలనంలో నిజం చేశారు సుజనాదేవి. ‘అత్త ఉన్న కోడలుత్తమురాలు’ అనే పోస్ట్ చేయని ఉత్తరం కథ చదువుతుంటే మౌనం సముద్రమై కండ్లల్లో ఆవిరైంది. చాలా కథలు మనం మరచిపోయిన ‘మానవతని’ గుర్తుకు తెచ్చేవే.
-భువనచంద్ర