HomeLiterature-moreThe Occasion Of Kalipatnam Rama Rao Centenary Year Celebration
కాళీపట్నం కట్టిన కథల గుడి
కాళీపట్నం రామారావు మాస్టారు తన తరంలో అందరికంటే పెద్దవారేం కాదు. కానీ, వయసుకు మించిన పెద్దరికంతో మెలిగేవారాయన. తెల్లని దుస్తుల్లో ఎప్పుడూ నింపాదిగా స్పందించే మాస్టారును, ఆయన కంటే చిన్నవారే కాదు, పెద్దవారు సైతం గౌరవించేవారు.
కాళీపట్నం రామారావు మాస్టారు తన తరంలో అందరికంటే పెద్దవారేం కాదు. కానీ, వయసుకు మించిన పెద్దరికంతో మెలిగేవారాయన. తెల్లని దుస్తుల్లో ఎప్పుడూ నింపాదిగా స్పందించే మాస్టారును, ఆయన కంటే చిన్నవారే కాదు, పెద్దవారు సైతం గౌరవించేవారు. అందుకే ఆ దేవుడికి గానీ మాస్టారు ఎదురుపడితే, ఆయన కూడా మాస్టారుకు నమస్కరిస్తాడని ప్రముఖ కథా రచయిత రావిశాస్త్రి వ్యాఖ్యానించారు.
కథా నిలయం అనేది తెలుగు సాహిత్యంలో ఒక మహా నిర్మాణం. ఏ భారతీయ భాషల్లో, ఏ ప్రక్రియకూ ఇటువంటి ఏర్పాటు లేకపోవడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం. తొంభై శాతం మంది తెలుగువారికి ఈ విషయం తెలియకపోవడం సిగ్గుపడాల్సి విషయం.
ఆ ధవళ గాంభీర్యం వెనుక సముద్రమంత కల్లోలం దాగి ఉన్నదని చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఓ మామూలు గ్రామ కరణం ఇంట్లో ఐదుగురు సంతానంలో పెద్దవాడిగా జన్మించిన మాస్టారిది స్థితిమంతుల కుటుంబం కాకపోయినా, చిన్నతనంలో బాధ్యతలేం పెద్దగా భుజాలకెక్కలేదు. అందరి పిల్లల్లాగే అల్లరి అలవాటు కావడంతో తండ్రి ఆయనను ఆట కట్టించే ప్రయత్నం చేశారు. మాస్టారి చదువు బాధ్యతను ఆయన మాస్టార్లకే అప్పగించారు తండ్రి. దాంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలలో పలువురి సహాయ సహకారాలతో చదువు కొనసాగించారు. పదో తరగతి పూర్తయిన తర్వాత జబ్బు చేయడంతో స్వగ్రామం మురపాక చేరుకున్నారు. అప్పుడే అక్కడి రామకృష్ణ గ్రంథాలయంలోని పుస్తకాలతో సావాసం ఏర్పడింది.
ఆంధ్ర పత్రికలు, భారతులు, డిటెక్టివ్ నవలలు, మను చరిత్ర, వసు చరిత్ర, తిరుపతి వేంకటకవుల గ్రంథాలు, వేయి పడగలు ఒక్కటేమిటి అన్నింటినీ నమిలిపారేశారు. అక్కడి నుంచి అన్వేషణ ప్రారంభమైంది. జీవిత పరమార్థం ఏమిటి? అని చింతన మొదలై ఇల్లొదిలి పారిపోయారు. కానీ, రెండ్రోజుల్లో తిరిగి వచ్చేశారు. తర్వాత చిత్రలేఖనంపై ఆసక్తి పెరిగి కొన్నేండ్ల పాటు విస్తృతంగా బొమ్మలు వేశారు. చదువు నిమిత్తం వివిధ ప్రాంతాల్లో తిరిగిన మాస్టారు చివరికి విశాఖపట్నం చేరుకున్నారు. అక్కడి హిందూ రీడింగ్ రూంలోని పుస్తకాల ద్వారా చలం, విశ్వనాథ, శ్రీపాద తదితరులు పరిచయమయ్యారు. దాంతో ఆయనలో మళ్లీ కల్లోలం మొదలైంది. ప్రపంచం గురించీ, జీవిత లక్ష్యం గురించీ ఆలోచిస్తూ వేదాలు చదువాలని మరోసారి ఇల్లు వదిలిపెట్టి వెళ్లిపోయారు.
రాజమండ్రి వేద పాఠశాలలో చేరాలనుకున్నారు. కానీ, ఎందుకనో ఆ ప్రయత్నాలు విరమించుకొని మళ్లీ ఇల్లు చేరుకున్నారు. అప్పటి నుంచి రచనా వ్యాసాంగం ప్రారంభించారు. ఆయనలోని ఆలోచనాధారను బయటకు ఉరికించడానికి కథ ఒక వాహిక అయింది. అయినా, ఆయన కుదురుగా ఉండలేకపోయారు. వచ్చిన ఉద్యోగాలు వదిలేశారు. రాని ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేశారు. పెళ్లయినా ఊళ్లు పట్టుకుతిరిగారు. చివరికి సెయింట్ ఆంథోనీ స్కూలులో ఉపాధ్యాయుడిగా చేరి, అక్కడే పదవీ విరమణ చేశారు.
ఆ మధ్య కాలంలో సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో పెను తుపానులు చెలరేగాయి. అవన్నీ కాళీపట్నం రామారావు మాస్టారి కథలకు నేపథ్యమయ్యాయి. జాతీయవాదం, అభ్యుదయం, నక్సలిజం, విప్లవం తదితర భావాలు సాహిత్యంలోకి వెల్లువెత్తాయి. విచిత్రం ఏమంటే, విప్లవ రచయితల సంఘం ఏర్పడి, విప్లవ రాజకీయాలు తెలుగు సాహిత్యాన్ని శాసిస్తున్న తరుణంలో మాస్టారు అస్త్ర సన్యాసం చేశారు. 1973 తర్వాత ఆయన కథలేమీ రాయలేదు. రెండు దశాబ్దాల తర్వాత ‘సంకల్పం’ అనే కథ రాశారు.
బాధ్యతలు స్వీకరించాల్సిన వయసులో సత్యాన్వేషణ చేసిన ఫలితంగా అప్పుడు ఆయన భుజాలు బరువెక్కాయి. ఒకవైపు తల్లిదండ్రుల మరణాలు, పిల్లల వివాహాలు, అనారోగ్యాలు ఆయనను కథా రచన వైపు దృష్టిమరల్చనీయలేదు. అయితే, పలు విలువైన కథా సంకలనాలు ప్రచురించి కథా సాహిత్యానికి తనదైన చేర్పు చేశారు. వీటితోపాటు నేటి ‘కథ’ శీర్షిక నిర్వహణ, కథా కథనం, కథలెలా రాస్తారు, కథలెందుకు రాస్తారు వంటి విలువైన ప్రచురణలు వెలువరించారు. కథల మాస్టారుగా తన స్థాయిని చాటిచెప్పారు. ఈ క్రమంలోనే ఎన్నో అవార్డులు, రివార్డులు స్వీకరించారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఆ మొత్తాలను తన వ్యక్తిగత అవసరాలకు ఆయన వాడుకోలేదు.
రావిశాస్త్రి మీద అభిమానంతో ఆయన పేరిట గ్రంథాలయం నెలకొల్పాలని, ఒక బస్ షెల్టర్ ఏర్పాటుచేయాలని తొలుత అనుకున్నప్పటికీ తనను ఇంతవాడిని చేసిన కథకే ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా 22 ఫిబ్రవరి 1997న కథా నిలయం భవనానికి ప్రారంభోత్సవం జరిగింది. ఎలాంటి నిబంధనలూ విధించుకోకుండా మొత్తం కథలను ఒకచోట చేర్చాలని కాళీపట్నం రామారావు మాస్టారు ప్రతినబూనారు. అహరహం శ్రమించి చాలావరకు సాధించారు. ఆయన హయాంలోనే ఏర్పాటైన ట్రస్టు ఇప్పుడు అదే బాధ్యతలతో తలమునకలుగా ఉంది.
కథా నిలయం అనేది తెలుగు సాహిత్యంలో ఒక మహా నిర్మాణం. ఏ భారతీయ భాషల్లో, ఏ ప్రక్రియకూ ఇటువంటి ఏర్పాటు లేకపోవడం తెలుగువారు గర్వపడాల్సిన విషయం. తొంభై శాతం మంది తెలుగువారికి ఈ విషయం తెలియకపోవడం సిగ్గుపడాల్సిన విషయం. తెలుగు కథను ఒకచోట చేర్చి, ఒక ఉనికి కల్పిస్తున్న వారితో భుజం కలపటం ప్రతి తెలుగువాడి గురుతర బాధ్యతను అందరూ గుర్తించాలని ఆశిద్దాం.
(కాళీపట్నం రామారావు శత జయంతి సంవత్సరం సందర్భంగా..)