‘టపటపటప చెమటబొట్లు తాళాలై పడుతుంటే..కరిగి కండరాల నరాలే స్వరాలు కడుతుంటే పాట పనితోనే పుట్టింది. పనిపాటతోనే జతకట్టింది.’ అంటూ పాట పుట్టుకను వర్ణిస్తారు సుద్దాల అశోక్తేజ. తెలంగాణ సాహిత్యమంతా మట్టిగర్భంలో నుంచి పుట్టిందే. తెలంగాణలో కవులే లేరన్నందుకు సురవరం ప్రతాపరెడ్డి ఏకంగా 354 మంది కవులతో గోలకొండ కవుల సంచికను తీసుకువచ్చారు. తెలంగాణ రైతాంగ పోరాటం మొదలు నిన్నటి మలిదశ ఉద్యమం వరకు ప్రతిదశలోనూ సాహిత్యమే ముందు వరుసలో నిలిచింది. అది పాటైనా, కవిత్వమైనా, కథ అయినా అన్నీ ఉద్యమం చుట్టే పరిభ్రమించాయి.
స్వరాష్ట్రంలో మన సాహిత్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. తెలంగాణ తేజోమూర్తుల పేరుమీదా పురస్కారాలను అందజేస్తున్నది. రాష్ట్రం అవతరించి పదేండ్లు పూర్తయిన సందర్భంలో ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు తెలంగాణ సాహిత్య దినోత్సవాన్ని వైభవోపేతంగా నిర్వహిస్తున్నది. ఈ సందర్బంగా కొంతమంది కవులు తమ కవితలతో తెలంగాణ అభివృద్ధికి నీరాజనాలు పలుకుతున్నారు.
కళ్లకు చూపు కూడా ఉండాలె
అసలు విషయాలను అడుగవలసినవాళ్ళనే అడుగాలె
ప్లాస్టిక్ బిందెడు నీళ్ళకోసం ప్రతిదినం పది ఫర్లాంగులు వెళ్ళే ‘ఆమె ’ ను
వాకిట్లో నిలబడి నీటిధారను చిమ్ముతున్న ‘నల్లా ’ గురించి అడగాలె
ఉప్పొంగే గంగను దోసిట్లో నింపిన భగీరథుని గురించి చెబుతుంది-
పూడుకుపోయిన వేల చెరువుల గురించి పచ్చని ఊరి పొలాలనడగాలె
కాకతీయులనాటి గొలుసుకట్టు చెరువులు పిల్లసముద్రాలై
ఎగిసెగిసిపడి తుళ్ళుతుండడం కనిపిస్తుంది
ప్రపంచమే అబ్బురపడ్డ ‘మహా కాళేశ్వరం’ ప్రాజెక్ట్ తో
600 మీటర్ల ఎత్తుకు ఎదురెక్కే గోదావరి నదిని అడుగాలె
దక్కన్ పీఠభూమిని ఈ దేశాన్ని పోషించే
అన్నంగిన్నెగా మార్చిన విజయగాథను వినిపిస్తుంది
వందలవేల ఎకరాల్లో పండే లక్షల టన్నుల ధాన్యరాసులను అడగాలె
నూటానలభై కోట్ల ప్రజలను పోషిస్తున్న జీవధ్వజోన్నతిని చూపిస్తాయి-
కళ్ళూ, చూపూ ఉన్న కొందరు నికార్సయిన మనుషులనడగాలె హైదరాబాద్ ఎక్కడుందని
ఆత్మను జెండాగా ఎగరేస్తూ గచ్చిబౌలీకి వలసవచ్చిన అమెరికాను చూపిస్తారు
భర్తను కోల్పోయి దుఃఖసముద్రయై నిలబడ్డ ఒక ఒంటరి మహిళనడగాలె
ఈ ప్రభుత్వమిచ్చిన పిడికెడు ఊపిరితో ఆమె తలెత్తుకోవడం కనిపిస్తది
చిన్నవే… మిణుకు మిణుకు నక్షత్రాలే… ఐనా
కల్యాణ లక్ష్ములు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్ కిట్లు,
కులవృత్తుల లక్షలు రైతు బంధులు, చదువుల అక్షరామృతాలు,
సాంకేతిక శిఖరోన్నతులు ఇవన్నీ.. కొత్త తరాలను సృష్టిస్తున్న సరికొత్త చరిత్రలు
ఢిల్లీ సుల్తాన్, బహమనీలు, కుతుబ్షాహీల, మొఘల్ , ఆసఫ్జాహీల
ఆరువందల తొంభై సంవత్సరాల రాక్షస అణచివేతలో
ప్రాణాలర్పిస్తూ సాయుధయై ఉద్యమించి ఉజ్జ్వలించి గర్జిస్తున్న
‘అస్తిత్వ ’ మహోన్నత శిఖరం .. మన తెలంగాణ
ఇప్పుడు మన తెలంగాణ శృతిచేసిన రుద్రవీణ .. ప్రళయిస్తున్న అగ్నిగర్భ
-ప్రొఫెసర్ రామా చంద్రమౌళి
93901 09993