తెలుగు ఆధునిక సాహిత్య ప్రక్రియ గజల్. ఇది ప్రేమ భావనలను అందమైన భాషలో, అద్భుతమైన చమత్కారంతో చెప్పే ఒక సుకుమారమైన సాహిత్య ప్రక్రియ. గజల్ ఒక అందమైన సాహిత్య రూపం. ఉర్దూలో తప్ప మరే ఇతర భాషల్లో ఇమడని అద్భుత నిర్మాణ సౌందర్యాత్మక, రసాత్మక సాహిత్య ప్రక్రియ. అందుకే అనేక దేశాల కవులను ఆకర్షించింది, అనుశీలింపజేసింది, అనుకరింపజేసింది. కవుల కలాల్లో సరికొత్త అభివ్యక్తిరూపంగా ఆవిర్భవించింది.
గజల్ పఠన యోగ్యమే కాదు, గానయోగ్యమైన ప్రక్రియ కూడా.
పర్షియన్ కవులు ఖసీదా అనే సాహితీ ప్రక్రియ ద్వారా గజల్ను వెలుగులోకి తీసుకొచ్చారు. పూర్వం అరేబియాలోని కార్మికులు రాత్రివేళల్లో సరదాగా తమ నాయకున్ని కీర్తిస్తూ ఖసీదాలను పాడేవారు. వాటి నుంచి పరిణామం చెందినదే గజల్. ఖసీదా నుంచి సర్వ లక్షణ సమన్వితంగా, నిర్మాణ బంధురంగా, ఛందోశిల్ప సౌందర్యంగా, అభివృద్ధి సుందరంగా, పరిణామం చెందిన అందమైన అంతర్జాతీయ సాహిత్య ప్రక్రియ గజల్.
ఇరాన్లో ఇది 10వ శతాబ్దంలో ప్రారంభమైంది. 12వ శతాబ్దంలో ముస్లిం రాజుల ప్రాబల్యంలో మొఘలులు.. ఇరానీల ఆచార వ్యవహారాలతో పాటు గజల్ను మన దేశానికి దిగుమతి చేశారు. ఇది మొదట అరబ్బీలో నుంచి పర్షియాలోకి వచ్చింది. అటుపిమ్మట ఉర్దూలోకి ప్రవేశించింది. తర్వాత తెలుగు భాషలోకి వచ్చింది. ఈ విధంగా తెలుగులోకి దిగుమతి అయిన ఇతర భాషా సాహిత్య ప్రక్రియే గజల్.
ఉత్తర భారతదేశంలో అమీర్ ఖుస్రూ మొదటిసారిగా ఉర్దూలో గజల్ను ప్రారంభించారు. కానీ, వాస్తవానికి దక్కన్లోనే మొదట గజల్ ప్రారంభమైందని పరిశోధకుల అభిప్రాయం. తెలుగులో గజల్ రచన గత శతాబ్ది మధ్యకాలంలో దాశరథితో మొదలై సినారెతో కళాత్మక గతిలో మధురస్మృతిలో సాగింది. గజల్స్ పాడితే బాగుంటాయి. గజల్ గానాన్ని గజల్ సరాబు అని అంటారు. సుమారు వందేండ్ల కిందటే గుజరాతీ భాషలో గజల్ రచన ప్రారంభమైంది. పంజాబీ, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లోనూ 21వ శతాబ్ది పూర్వార్థంలోనే గజల్స్ రచన ప్రారంభమైంది.
గజల్ మౌలిక వస్తువులైన.. ప్రేమ, దుఃఖం, ధైర్యం, వాంఛ, అవమానం, కరుణ ఇత్యాది భావాలపైనే గజల్ సాగుతుంది. కవి విరహంతో ప్రియురాలి గురించి మధురమైన షేర్లను అశువుగా చెప్పుకొని ఆ బాధ నుంచి స్వాంతన చెందుతాడు. అలా మధురమైన భాషతో, భావంతో హృదయాన్ని తాకే కవిత్వమే గజల్.
గజల్ అనగా అరబ్బీ భాషలో రాగాలాపన అని అర్థం. చాలామంది అంగీకరించిన అర్థమేమిటంటే.. ఇంతులతో మంతనాలు. ప్రియురాలితో సల్లాపం (రహస్య సంభాషణ) అని అర్థం. పార్సీలో గజల్ అంటే మృగనయని (జింక కనులు కలది) అని అర్థం ఉంది. గజల్ ప్రక్రియ శిల్పాన్ని గజలియత్ అని అంటారు.
గజల్ నియమాల గురించి చెప్పుకొంటే.. రెండు పాదాలను మత్లా అంటారు. తర్వాత రాసే ప్రతి రెండు పాదాలను షేర్లు అని అంటారు. ఈ షేర్లు 5, 7, 9 వరకు ఉండవచ్చు. లేదా అంతకంటే ఎక్కువ అనగా.. 15 వరకూ ఉండవచ్చు. షేర్లోని మొదటి పాదాన్ని మిశ్రా అని అంటారు.
ప్రతి పాదాన్ని నాలుగు భాగాలుగా (పదాలుగా) విభజించుకోవాలి. ఈ పదాలలో మాత్రలన్నీ సమంగా ఉండాలి. ఇందులో మూడో పదాన్ని ఖాఫియా అని పిలుస్తారు. ప్రతి షేర్లోని మొదటి పాదంలో రదీఫ్, ఖాఫీయాలు ఉండవు. రెండో పాదంలో మాత్రమే ఉంటాయి. మత్లాలోని రెండు పాదాల్లో రదీఫ్, ఖాఫీయాలు ఉండాలి. ఖాఫీయాలోని చివరి అక్షరం లేదా చివరి అచ్చులను రవి అని అంటారు. రెండు మిశ్రాలు ఉంటూ భావైక్యత కలిగి ఉండాలి. ఈ ఖాఫీయాల వల్లనే మెరుపు, వ్యంగం, చమత్కారాలను గజల్ కలిగి ఉంటుంది.
రదీఫ్ అంటే మత్లాలోని రెండు పాదాల్లో చివర ఒకే పదం (ప్రాస) ఉండటం. రదీఫ్ ప్రతి షేర్ చివర రావడంతో గాన యోగ్యంగా, ఇంపుగా ఉంటుంది. రదీఫ్లో మాత్రలు తగ్గించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. గజల్లో ఏ షేర్కి ఆ షేర్ స్వతంత్రం. భావసాంద్రత ఉండాలి కానీ, వస్తువు ఒకటి కానవసరం లేదు. ఒకటే కూడా తీసుకోవచ్చు. కవి స్వేచ్ఛ, ఇష్టాన్ని బట్టి ఎలా అయినా ఉండొచ్చు.
షేర్లన్నింటిలో ఒకే భావం ఉంటే దాన్ని గజల్ ముసల్- సల్ అని అంటారు. గజల్కి అతి ముఖ్యమైనవి ఖాఫీయా, రదీఫ్లే. ప్రతి షేర్లో రెండో పాదంలో చివరి పదంగా మాత్రమే రదీఫ్ (ప్రాస) రావాలి. రదీఫ్ లేని గజల్స్ రాస్తే వాటిని గైర్ మురద్దీప్ గజల్ అని అంటారు. ప్రాస అక్షరానికి ముందు హల్లుపై ఒకే అచ్చు ఉండాలి. నాలుగో పదాన్ని రదీఫ్ అని పిలుస్తారు. ఈ రదీఫ్ మత్లాలో రెండు పాదాల్లోనూ, ప్రతి షేర్లో రెండో పాదంలోనూ ఉండాలి.
గజల్కు గణాలు, శీర్షికలు ఉండవు. గజల్లో అన్ని షేర్లు ఒకే అంశం మీద వచన కవిత్వంలా, ఒకే విషయంపై ఉండవు. రాయనవసరం లేదు కూడా. ఏ షేర్కు ఆ షేర్ స్వతంత్రంగా, అర్థవంతంగా ఉండాలి. పలు అంశాలపై ఒకే గజల్ను కూర్చవచ్చు. ఒకే అంశం మీద కూడా రాయవచ్చు. గజల్లో తఖల్లూస్ ఉంటుంది. చివరి షేర్లో ఇది ఎక్కువగా వస్తుంది. లేదా వేరే ఏ షేర్లోనైనా పెట్టుకోవచ్చు. చివర్లో కవి నామముద్ర (కవి పేరు)గానీ, కలం పేరు గానీ ఉంటుంది. దీన్నే తఖల్లూస్ అంటారు. దీనివల్ల గజల్ ఎవరు రాశారో తెలుస్తుంది.
గజల్లో భావవ్యక్తీకరణలో చమత్కారం ముఖ్యం. గజల్లో ప్రేమ, విరహం, తాత్వికం ముఖ్య వస్తువులు. గజల్కు భక్తిభావం అస్సలు పొసగదు. ఒకసారి వాడిన పదం మళ్లీ వాడకుండా, రాకుండా చూసుకోవడమే గజల్కు సౌందర్యాన్ని తెస్తుంది. చమత్కారం గజల్కు హృదయం లాంటిది. గజల్ ఛందస్సు బహార్లలో ఉంటుంది. బహార్లను మీటర్ (వృత్తం) అని అంటారు. పార్సీ, అరబ్బీ భాషలలో గజల్స్ను బహార్లలోనే రాస్తారు. తెలుగులో మాత్రాఛందస్సులో గజల్స్ ఎక్కువమంది రాస్తున్నారు. బహార్లలో చాలా తక్కువ మంది కవులు రాస్తున్నారు.
నా గజల్ లహరి
నా మదిలో పల్లవించు భావగీతి నువేకదా!
నవ్వులనే పూయించెడి ప్రేమగీతి నువేకదా!
అనురాగం అల్లుకున్న పరాజిత ఎవ్వరోయి..
చెలరేగిన ఊసులలో భావమంత నువేకదా!
ఆదుకునే హృదయాన అనురాగం పరిమళించె,
జాలి గొలుపు మనసులోన గానమంత నువేకదా!
ముసిముసిగా నవ్వుకుంది
జాబిలమ్మ కొంటెగాను!
చిలిపిపూలు అల్లుకున్న వెన్నెలంతా నువేకదా!
నా పాటకు పురిగొల్పిన పదబంధం నీ చూపే!
‘సునీ’ ఎదల నిలిచిపోవు ప్రేమంతా నువేకదా!
గజల్ ఐదు గతులను పరిశీలిస్తే..
1. తిస్రగతి: ఇది 3+3 3+3 3+3 3+3 ఉంటుంది. ఒకవేళ భావం కుదరకపోతే 2+4తో కూడా రాయవచ్చు.
2. చతురస్ర గతి: దీన్ని 4+4 4+4 4+4 4+4తో రాయవచ్చు.
3. మిశ్రగతి: 3+4 3+4 3+4 3+4
4. ఖండగతి: 5+5 5+5 5+5 5+5
5. సంకీర్ణగతి: 4+5 4+5 4+5 ఉండి, చివరి పదంలో ఏడు మాత్రలు ఉండాలి.
పైన చెప్పిన ఐదు గతులుగా కాకుండా…
గతి: 6+6 6+6 6+6 6+6 ఇలా కూడా మాత్రలను తీసుకొని గజల్స్ ప్రారంభించవచ్చు. ఇలా గజల్ శిల్పాన్ని చెక్కాలంటే ఎంతో నైపుణ్యం కావాలి. రదీఫ్, ఖాఫీయా నియమాలను పాటిస్తూ, చమత్కారాన్ని జోడిస్తూ నిర్మిస్తే గజల్ ఒక సజీవత్వం ఉట్టిపడే శిల్పంలా ఉంటుంది.
ముఖ్యంగా గజల్ రాయాలనుకున్నప్పుడు ఖాఫీయాలను రూపొందించుకోవాలి. గజల్ రాయాలనే ఇష్టం, పట్టుదల ఉంటే ఈ నియమాలను పాటిస్తూ, మంచి సౌందర్యాత్మకమైన గజల్స్ను ఆవిష్కరించవచ్చు. కొత్తగా గజల్స్ రాసే కవులందరూ ఈ నియమాలు పాటిస్తూ చక్కటి గజల్స్ను ఆవిష్కరించవచ్చు.
చాలామంది సీనియర్ గజల్ కవులతో పాటు కొత్త కవులు గజల్స్ రాస్తున్నారు. గజల్ కవులు ప్రస్తుతం వందల సంఖ్యల్లో ఉన్నారు. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగవచ్చు. ఈ గజల్ ప్రక్రియ తెలుగులో పరిఢవిల్లాలని ఎందరో కృషి చేస్తున్నారు. వారి కృషి ఎంతో అభినందనీయం.
సునీత నెల్లుట్ల