తెలంగాణ కథంటే ‘ఉద్యమ కథ’ అనే అపప్రథను తొలగించిన మూడోతరం కథా రచయిత కె.వి.నరేందర్. ‘నత్తి’ మీద రాసిన ‘ముత్యమంతా పలుకు’ అనే కథ మీద ఒక దినపత్రిక సంపాదకీయం రాసింది. ఒక కథ ఒక కుర్రాడిని మొత్తంగా మార్చేసి అతడు జీవితాన్ని గెలుచుకునేలా చేసిందంటే సాహిత్యానికున్న బలాన్ని అంచనా వేయవచ్చు. ఆ కథకుడెవరో కాదు, నవలాకారుడు, సామాజిక వ్యాసకర్త అయిన కె.వి.నరేందరే…
‘కాలం ఒక వేడుక కాదు. వేయి గాయాల గొంతుక. అది పాదముద్రల్ని కూడా మింగేసే సముద్రం. చితులు చల్లారినా స్మృతులు మరణించని ఓ నెత్తుటి జ్ఞాపకం. విషాదాల ఉషోదయాల్ని పెకిలిస్తూ వచ్చే ఓ కన్నీటి ఉప్పెన. తరాల మధ్య అంతరాలు చెరిపేసే మంత్రసాని. అందుకే నాకు కాలమంటే కల్లోల సమరం..’ అం టూ కాలాన్ని వస్త్రగాలం పడుతూ రాస్తున్న రచయిత కె.వి.నరేందర్.
తెలంగాణ గ్రామీణ జీవితాలను, మానవీయతను, ప్రపంచీకరణ విధ్వంసాన్ని చిత్రిస్తున్న కె.వి.నరేందర్ ‘సింగిల్ కాన్సెప్ట్’ (ఏకాంశం)తో అమ్మ గొప్పదనం మీద ‘అమ్మ’ కథలు; నాన్న త్యాగం మీద ‘నాన్న’ కథలు; సిటీ లైఫ్ మీద ‘సిటీ’ కథలు; సైనికుల కష్టా ల మీద ‘యుద్ధం’ కథలు; ఇల్లాలి విశిష్టతపై ‘నాతిచరామి’ కథలు; పోలీసులు, నక్సలైట్ల మధ్య నలిగిపోయిన కుటుంబాల మీద ‘పోరు’ కథలు; గ్రామీణ వృత్తి జీవితాల మీద ‘ఊరు’ కథలు; స్వచ్ఛభారత్ మీద ‘చీపురు’ కథల సంపుటాలను వెలువరించారు. ఇవేగాక విభిన్న వస్తు వైవిధ్యంతో ‘మనోగీతం’, ‘కాలుతున్న పూలతోట’, ‘బురదలో జాజిలి’్ల కథా సంపుటాలను కూడా విడుదల చేశారు.
కె.వి.నరేందర్ ప్రతి కథ సంచలనమైనదే. తెలుగులో తొలి ‘హిజ్రా’ కథ రాసింది కె.వి.నరేందరే. ‘దొరుంచుకు న్న దేవక్క’, ‘దొర మల్లా వచ్చిండు’, ‘బర్రె’, ‘డబ్బు సంచి’, ‘ఉసుళు’్ల, ‘సఫాయి’, ‘టాయిలెట్ ఎ లవ్స్టోరీ’,‘వేరుతొలిచే పురుగు’, ‘అలసిపోయా ను ప్రభూ’, ‘ఏడుడుగుల కింద’.. ఇలా నరేందర్ రాసిన ప్రతి కథ మన కాళ్లకింది భూమిని కదిలించేదే. అరుదైన కథా వస్తువులతో కథలు అల్లడం నరేందర్ ప్రత్యేకత. సహజమైన పాత్ర చిత్రణ, ఊహించని ముగింపుతో నరేందర్ కథలు శాశ్వతంగా గుర్తుండిపోతాయి.ఒక చిత్రకారుడు తన రంగుల కుంచెతో తెలంగాణ దృశ్యాలను వర్ణరంజితం చేసినట్లుగా, కె.వి.నరేందర్ అక్షరాలనే కుంచెలతో వర్తమాన తెలంగాణ జీవితంలోని అనేక శకలాలను కథలుగా మలుస్తున్నారు.
పదునైన శైలిలో సాగిపోయే కె.వి.కథలు తెలంగాణ భాషను ఒడిసి పట్టుకున్నాయి. తెలంగాణలో నిత్యజీవితంలో పల్లె ప్రజలు అలవోకగా మాటల్లో మాటగా ఉపయోగించే అనేక సామెతలు, పలుకుబడులు, జోడిపదాలు పుష్కలంగా తొంగిచూసి కథలకు జీవత్వాన్నద్దాయి. ప్రస్తుత సంక్షోభపూరిత సమాజంలో మనిషి జీవితం మీద ప్రభావాన్ని చూపుతున్న అనేక వ్యవస్థల్ని లోతైన చూపుతో, పరిశీలనతో కె.వి.నరేందర్ కథలు ఆవిష్కరిస్తాయి.
నరేందర్ కథంటే మనల్ని మనం తవ్వుకోవడం. మనతో మనం మాట్లాడుకోవడం. ఆధునిక తెలంగాణ కథకు దిక్సూచి లాంటి ఆయన కథలు సమాజం పడుతున్న పురిటి నొప్పులకు ప్రతీకలు.
‘బేబీ ఓ బేబీ’, ‘నల్ల సము ద్రం’, ‘శిథిల స్వర్గం’, ‘నేను నాయకురాలు నాగమ్మను మాట్లాడుతున్న’ లాంటి నవలలు రాసి తెలుగు సాహిత్య చరిత్రలో తనదైన ముద్ర వేశారు. ‘స్టోరీ ఈజ్ మై లైఫ్’ అని ప్రకటించుకున్న కె.వి. కలం నుంచి మరెన్నో కథలు వెలువడి వాటి నిం డా బతుకు పుటల్లోని సంక్షోభమంతా తడితడిగా రాయబడాలని ఆకాంక్ష.
డాక్టర్ వెల్దండి శ్రీధర్,
98669 77741