తెలుగులో కావ్యం రచించిన మొట్టమొదటి కవయిత్రి మొల్ల. ఆమె ‘రామాయణం’ను రచించింది. అది చాలా చిన్నది. సంగ్రహంగా ఉంది. కాబట్టి భాస్కరుని రామాయణం వలె ఇది వాల్మీకి రామాయణానికి అనువాదం కాదు. ఆమె స్వతంత్రంగా రచించిన కావ్యం. పోతన వలెనే మొల్ల కూడా ఏకశిలానగర వాసి. ఏకాంబ్రనాథుడు తన ‘ప్రతాపరుద్ర చరిత్ర’లో మొల్ల రెండవ ప్రతాపరుద్రుని కాలంలో ఉన్నట్లుగా, వచనంలో రామాయణాన్ని రచించి ప్రతాపరుద్రునికి అంకితం ఇవ్వబోతే ఒక నిమ్న సమూహాన్నుంచి స్త్రీ రాసిన కావ్యాన్ని అంకితంగా తీసుకోవద్దని ఆస్థానంలో పండితులు అడ్డగించారని తెలిపాడు. కానీ చారిత్రకంగా చూస్తే మొల్ల పోతనకు సమకాలికురాలిగా కంటే సర్వజ్ఞసింగభూపాలునికి సమకాలికంగా కనిపిస్తుంది.
మొల్లకు పోతన అంటే గౌరవం కూడా అనాలి. కావ్య పీఠికలో రామభక్తుడైన పోతన.. ‘పలికెడిది భాగవతమట, పలికించెడివాడు రామభద్రుండట, ఇక నే పల్కిన భవహరమగు’నని చెప్పుకొన్నట్లుగానే.., మొల్ల కూడా.. ‘చెప్పమని రామచంద్రుడు సెప్పించిన పలుకుమీద చెప్పెద, నేనెల్లప్పుడు నిహపరసాధన మిప్పుణ్య చరిత్ర తప్పులెంచకుడు కవుల్’ అని చెప్పుకొన్నది. పోతన తన కావ్యాన్ని నరాంకితం చేయకుండా రాజులను నిరసించినట్లుగానే.., మొల్ల కూడా నిరసిస్తూ ఇట్లా అన్నది.. ‘రామ నరపాలకుని స్తుతి చేయు జిహ్వకున్ చిల్లర రాజలోకమును జేకొని మెచ్చగా నిచ్ఛపుట్టునే..’అన్నది. అట్లా ఇద్దరిదీ ధనలాభం కోరని రామభక్తి మార్గం. మొల్ల ఇక్కడ ‘చిల్లర’అన్న అచ్చమైన తెలంగాణ పదాన్ని వాడింది. ఇది ఆమెను తెలంగాణ కవయిత్రి అని తెలియపరుస్తున్నది.
మొల్ల తన తండ్రి ‘గురులింగ జంగమార్చన పరుడు’ అని, ‘శివభక్తి రతుడు’ అని చెప్పుకొన్నదాన్ని బట్టి ఆమె వీరశైవ కుటుంబంలో పుట్టిందని తెలుస్తున్నది. వీరశైవ కుటుంబంలో పుట్టింది కాబట్టే కుమ్మరి కులంలో పుట్టిన మొల్లకు విద్యాపాండిత్యం అలవడింది. వీరశైవంలో స్త్రీ విద్యకు, జ్ఞాన సముపార్జనకు అడ్డంకులు లేవు.
మొల్ల ఏకశిలానగర వాసి అని ఏకామ్రనాథుడు చెప్తున్నా, ఆధునిక పండితులు ఆమె నెల్లూరు వాసి అని అంటున్నారు. అంతేగాక ఆతుకూరు అనే గ్రామం నెల్లూరు జిల్లాలో ఉందని సమర్థిస్తున్నారు. ఆతుకూరు అనే పేరు గల గ్రామాలు తెలంగాణలో కూడా ఉన్నాయి. కాబట్టి గ్రామనామంతో ఆమె తెలంగాణ కవయిత్రి కాదనడం సమంజసం కాదు.
మొల్ల తన రామాయణాన్ని అయోధ్యనగర వర్ణనతో ఆరంభించింది. నగర వర్ణనతో ప్రారంభించింది కాబట్టి ఆమె ప్రబంధయుగానికి చెందిన వ్యక్తి అని ఆధునిక విమర్శకుల అభిప్రాయం. కానీ భాస్కరుడు, తిక్కన కూడా నగర వర్ణనలతోనే కావ్యారంభం చేశారు. కాబట్టి ఒక్క నగర వర్ణనను పట్టుకొని ఆమె 16వ శతాబ్దం నాటి కవయిత్రి అనడం కన్నా, పోతన లాగానే రామభక్తురాలైన ఆమె 15వ శతాబ్దం ఆరంభంలో ఉన్నదని చెప్పడమే సరైన వాదం. మొల్ల చాలా వినయవంతురాలు. ఆత్మవిశ్వాసం కలది. ‘ఛందో విలక్షణములు కావ్య సంపద ప్రక్రియలు, నిఘంటువుల క్రమాలు’ ఏవీ తను చదువుకోలేదని గోపవరంలోని శ్రీకంఠమల్లేశుని వరం చేత కవిత్వం చెప్పగలిగానని మొల్ల అంటుంది. ఇక్కడ కూడా ఆమె మొదట శైవురాలే అనే విషయం తెలుస్తుంది. మొల్ల పెద్దగా చదువుకోలేదని రామభక్తి చేత ప్రేరణను పొంది రామాయణాన్ని తన సహజ కవితా ప్రతిభతో రచించిందని చెప్పవచ్చు.
‘మొల్ల రామాయణం’ సంగ్రహంగా కథ చెప్పడమే ప్రధానంగా నడిచింది. పద్యాలు ప్రసన్న మధురంగా ఉన్నాయి. సీత హనుమంతునితో శ్రీరామునికి పంపే సందేశ ఘట్టం హృదయాలను కదిలించే విధంగా ఉంది. అక్కడక్కడ ప్రబంధ వర్ణనలు ఉన్నాయి. ఆ వర్ణనలు సరళ సులభమైన శైలిలో నడిచాయి. మొల్ల ‘చంపూ మార్గం’లో తన రామాయణాన్ని స్త్రీ సహజమైన మృధుమధుర శైలిలో రచించింది. అందుకే కావచ్చును ఎంతో మంది రాసిన రామాయణాలు కాలం కాలిదెబ్బలకు నశించినా ‘మొల్ల రామాయణం’ మాత్రం ఈనాటికీ నిలిచి ఉంది.
పిల్లలమఱ్రి పినవీరన క్రీ.శ.1480 ప్రాంతం వాడు. ఈయన శ్రీనాథునికి సమకాలికుడు. ‘వాణి నా రాణి’ అని ధైర్యంగా చెప్పుకున్న కవి పినవీరన. ఈయన ‘శృంగార శాకుంతలం’, ‘జైమినీ భారతం’ కావ్యాలను రచించాడు. అవేగాక ‘అవతార దర్పణం’, ‘నారదీయం’, ‘మానసోల్లాసం’, ‘మాఘ మహత్యం’ అనే కావ్యాలను రచించినట్లు చెప్పినా అవి అలభ్యం. సంస్కృతంలో కాళిదాసు రచించిన ‘అభిజ్ఞాన శాకుంతలం’ నాటకం కథను కొంతవరకు, మహాభాగవతంలోని ‘శకుంతల’ కథను కొంతవరకు తీసుకొని పినవీరన ‘శాకుంతలం’ రచించాడు. దీనికి శ్రీనాథుని ‘శృంగార నైషధం’ లాగానే ‘శృంగార శాకుంతలం’ అనే పేరు ఏర్పడింది.
-ముదిగంటి సుజాతారెడ్డి
99634 31606