‘కొందరికి తెనుగు గణంబుగా, కొందరికి సంస్కృతంబుగా, నేనందరి మెప్పింతు కృత్యులనయ్యె యెడలన్..’
– పోతన
పుస్తకాల్లోకి పనికి రాదన్నరు. నోరు తిరగడం లేదని మూతి తిప్పిండ్రు. కటిక వధ చేసినా కిక్కురమననివ్వలె. పల్లికిలించి పరాచికమాండిండ్రు. బఫూన్ గాళ్లతో పలికిస్తూ భరించమన్నరు. అంటరానిదిగా చేసి అణిగుండమన్నరు.‘ఆనిక్కాయ’ అంటూ ఎగతాళి చేస్తే ఉడుక్కున్న వైచిత్రి. సొంత గడ్డపైనే పరాయిదంటే సర్దుకున్న దుస్థితి. ఇప్పుడు తలుగు తెంచుకున్న తెగువతనం ఇది. అసలుసిసలు భాషా మాతకే తల్లితనంగా మారింది.
మొదటి నుంచి ఉద్యమ పంథానే తెలంగాణది, ‘భాషా దోషం’పై కూడా బహువిధాలుగా పోరాడిన చరిత్ర. తల్లి పొత్తిళ్లలో పరాయి బిడ్డగా మారిన దైన్యాన్ని ఎదుర్కొని, బరిగీసి తెగించి సాధించాల్సిన పరిస్థితి తనది. ఒక కడుపుల పుట్టినోళ్లు గుడా ఒక్కలాగుండరనే కనీస నీయతి మర్సి, ‘ఆడి పెత్తందార్లు’, ‘ఇడి యాస’ను బక్కపల్చనిది చేసి బజార్న నిలబెట్టినా భరించింది. ‘ఆనిక్కాయ’ భాష అని అవమానపరుస్తుంటే అమ్మ కౌగిట్లోనే గొంతు పెకలని బిడ్డగా గమ్మున్నుండాల్సిన పరిస్థితి ఉండగా, ‘అమ్మకపు’ కొట్లలోని వారి వికృతపు ‘సొర’కాయ చెలరేగుతుంటే చూస్తుండిపాయె. ఇద్దరు బిడ్డల్లో స్వతహాగా ‘సర్వ చందస్సోదహరణ వ్యాకరణాలున్న’ ఐశ్వర్యాన్ని తరలివచ్చిన తెలుగుకు కట్టబెట్టి.., అభిమానం పొందిన బిడ్డను అనాథగా, లిపి కూడా లేని చిలిపిగా అభివర్ణించిన అవమానపు చాయలెన్నో. ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ఉమ్మడి పాలనలో ఈ తల్లి యాసను ఈసడించిండ్రు.., మాటతీరు వక్రీకరించిండ్రు.., పుస్తకాల్లో పొసగనిదని ముద్రేసి..,కార్యాలయాల్లోనైతే కనీసం ప్రవేశమే లేనట్టుగా చిత్రీకరించిండ్రు.
రుద్దుడును బల్మీటికి భరించిన నా తల్లి భాషకు వందనం. అన్నీ ఉన్నా నిన్ను ఎవరు లేనిదాన్ని చేస్తే తట్టుకున్న ధైర్యానికి అభివందనం. అరువై ఏండ్ల అణచివేతలో ఎన్ని భరించావో.., ఎన్నెన్ని దిగమింగావో. ఒంటినిండా బలమున్నా, ఆసరాలేని అనాథగా రోజులు లెక్కబెట్టి బిక్కుబిక్కున గడిపావ్. కళ్లముందటే ‘గమ్మునుండవయ్యా’ అని గొంతులు పిసుకుతున్నా భరిస్తూ మూలన నక్కితివి. డబ్బు యావ తప్ప మరేమీ లేని ‘తెగబలిసిన గరీబు గాళ్లు’ సైన్మాల్లో ఒకటి అర సందర్భాల్లో నీ ప్రయోగం చేస్తే ఎంత మురిస్తివి. గుడ్డిలో మెల్లలా తాకుతున్నారని సంబురపడ్తివి. పుట్టిన నేలపైనే పరాయిగా మారిన బాధను దిగమింగుతూ, ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ‘మూకలను’ భరిస్తూ సాగిన సర్వ వ్యవహారీ సలాం నీకు.
తిరిగిన కాలం., వదిలిన మైకం. ఒక్కసారిగా వాళ్లు వీళ్లయ్యారు., వీళ్లు వాళ్లయ్యారు. ఆయన రాకతో యాసకే ప్రాస కూర్చి రాతలు మొదలుపెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమవేళ నీ యాసే శ్వాసగా, పలుకులే తేనెలుగా మార్చిన రోజులు ప్రపంచానికి కొత్త ఒరవడిని చూపిన దృశ్యాలు. అంతకాలం బిడియపడి మూలన నక్కిన నా తెలంగాణ పదాలన్నీ ఆయన నోటినుంచి మాటలుగా జాలువారుతుంటే శత్రువుల్లో బెరుకు మొదలయ్యే, పేపరోళ్లకు వణుకు షురువయ్యే. తొక్కిపెట్టిన తీరును తుడిచివేసేందుకు పడరాని పాట్లు మొదలువెట్టే. పదకోశాలు తెప్పించుకునే, హెడ్డింగుల్లో నిన్ను చొప్పించి ప్రజల్లోకి చొచ్చేందుకు వాళ్లు యత్నించే. ఒకటికి పదిసార్లు నీ యాసనే ఉచ్ఛరిస్తూ, పదికి వందసార్లు నీ సరళిలోనే సమస్యలను తెలియజేసేసరికి బలిమీటికి ‘మనతో కలిసిన తెలుగు’ భయకంపితమయ్యే.
‘బెదిరించిన బరితెగింపు గాళ్లకు ఆయన’ నోటి మాటలే సమాధానాలు కాగా, ఇక్కడి రాతలే శిలాశాసనాలయ్యాయి. తెలంగాణ సాహిత్యం ఇంత గొప్పదా అని పలు వేదికలపై ఆయన మునివేళ్లపై చదివిన పద్యాలు, పదాలతో కళ్లన్నీ తెరుచుకున్నాయి. రోజురోజుకు వేడెక్కిస్తున్న ఉద్యమంతో సిరా రంగు మారింది, రాత స్వభావం మార్చుకుంది. తప్పనిసరి పరిస్థితుల్లో కాగితంపై ముద్రణ మార్చాల్సి వచ్చింది.
రాష్ట్రం రావడానికి ముందు విద్యాసంస్థల్లో, పని ప్రదేశాల్లో (ఉద్యోగ స్థలాల్లో), ఆఖరికి ఆలయాల్లో కూడా పలకడానికి చిన్నచూపునకు గురైన పదాలు కేసీఆర్ ‘ప్రత్యేక’ నినాద రంగప్రవేశంతో తారుమారయ్యాయి. అవతలివారి తీరు మారింది. అధికారిక కార్యక్రమాల్లో, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి సభా, సమావేశాలు, భేటీలు ఏదైతేనేం తెలంగాణ పదాలతో ఆకట్టుకునేలా వివరించిన తీరే నా తెలంగాణ యాస పునర్జన్మకు మూలమైంది. లక్షల్లో హాజరైన జనాలను ఉద్దేశించి ఆయన చేసిన ప్రసంగాల్లో, కోట్లాదిగా ఉన్న యావత్ తెలుగు జాతికి చేసిన హితబోధలో కేసీఆర్ పదప్రయోగం కట్టిపడేసింది. ఒక్క దెబ్బకు వాళ్లంతా బోనాన్ని నెత్తికెత్తారు., బతుకమ్మను గుమ్మం దాటించారు.
నవ్వులాటలో తెలంగాణ యాసను ఇరికించి నిర్లక్ష్యంగా మలిచిన తీరు అవమానకరం. దానికి సైన్మాల్లో మత్తు మందిచ్చి పడుకోబెట్టారు.., అప్పుడప్పుడు అన్నట్టుగా బఫూన్ల తోనో.., ప్రతినాయకుడి నోటితోనే పలికించి కించపరిచారు. 24 ఫ్రేమ్స్లో 14 రీళ్లు ఒక్కెత్తయితే, పొడిపొడిగా, యథాలాపనగా వచ్చిపోయే నీ యాస పడిన గోస వర్ణనాతీతం. అదీ నిన్నేదో ఉద్ధరించడానికి కాక నైజాం కలెక్షన్లు కొల్లగొట్టడానికే తప్ప మరోటి కాకపాయె.
వెటకారపు మాటలకు, కక్కొచ్చే రోతకు కేరాఫ్గా ‘ఏంరో.. నేనైతే విలన్ను’ మంచిచెడు మానం మర్యాద అస్సలు పట్టించుకోనోన్ని..’ అనే బాపతు డైలాగులుగా బలవంతపు ప్రయోగాలు. ఇప్పుడు తెలంగాణ కథలతో, భాషతో సినిమాలు రావడం, హిట్లు కొట్టడం.. యావత్ సినీ పరిశ్రమను షేక్ చేస్తున్నాయి. అంతకన్నా ఇంకేం గావాలె.
ఏది ఏమైనా జీవి మనుగడకు మూలం భావ వ్యక్తీకరణ. సర్వకాలాల్లో సంబంధాలు సజీవాలుగా నిలిచేది భాషతోనే. మనుగడ కోసం జరిగే ప్రకృతి పోరాటంలో ప్రతి ప్రాణిది ఓ ప్రత్యేక శైలి. హావభావాలు వ్యక్తపర్చుకుంటూ.., కష్టసుఖాలు పంచుకుంటూ సాగడానికి ప్రతి ప్రాణికి ఓ భాష ఉంటుంది. మాటలు రాని జీవాలు సైగలతో సాగుతుంటే.., మాట్లాడే ఒకే ఒక ప్రాణి మనిషి మాటలతో వారధులను నిర్మించుకుంటాడు. ఎక్కడి భాష అక్కడిదే., ఎవరి ఒరవడి వారిదే. గెలిచి నిలిచిన తెలంగాణ యాసది అపార చరిత్ర. అమోఘ భవిత. ఘనకీర్తి ఎవరిదైనా కొలవాల్సిందే. అదే నేడు తెలంగాణలో అపార పారవశ్యంతో మెరుస్తూ, మురుస్తున్న నా తల్లి తెలంగాణ భాష. ముచ్చటగొలిపే పదప్రయోగంలో మైమరచిపోతూ పునీతమవుతున్న యాస. నిన్ను రాస్తే ఎంత హాయో.., నీ పలుకు వింటే ఎంత పారవశ్యమో. పాల కుండకు పట్టిన గేగు భాష.. ఉయ్యాల ఆటలో హుంకారపు శబ్దం తనంటా…
రాజేంద్ర ప్రసాద్ చేలిక
99858 35601