ఆంధ్ర సాహిత్యానికి అజరామరమైన సేవ చేసిన వాడు నన్నయ్య. విభిన్నమైన లిపిరూపాన్ని సంతరించుకున్న తెలుగువాఙ్మయచరిత్రను కొత్త పుంతలు తొక్కించిన వాడు నన్నయ. భారతీయ భాషలన్నీ హల్లుతో అంతమయ్యే భాషలు కాగా కేవలం ఒక్క తెలుగు భాష మాత్రమే అచ్చుతో అంతమయ్యే భాష. అందుకే తెలుగు భాషకు అజంత భాషగా పేరు వచ్చింది. ‘నికోల్ కాంటే’ అనే ఇటాలియన్ భాషావేత్త తెలుగు భాషను ‘ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అని పేర్కొన్నాడు . అంతేకాకుండా ఇటీవల కాలంలో ప్రాచీనభాషాహోదాను పొందిన భాషల్లో సంస్కృతము, తమిళం తర్వాత తెలుగుభాషది మూడోస్థానం. అంతటి ప్రాచీన తెలుగుభాషలో ఉత్కృష్ట కావ్యాన్ని రచించిన నన్నయ యావత్తు తెలుగుజాతికి అభినందనీయుడు, వందనీయుడు.
పదకొండవ శతాబ్దంలో రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవిగా బహుముఖ ప్రజ్ఞా పాటవాలను వెలయించిన నన్నయ, క్రీస్తుశకం 1022 నుంచి 1061 మధ్యకాలంలో జీవించినట్లుగా తెలుస్తుంది. నన్నయ తెలుగువాడు కాదని కన్నడిగుడు అనే ప్రచారం కూడా ఉన్నది. కానీ నన్నయకు తెలుగు భాష మీద ఉన్న పటుత్వము, అనేక శాసన ఆధారాలను పరిశీలిస్తే నన్నయ తెలుగు వాడేనని రూఢీ అవుతుంది.
ద్రవిడ భాషా కుటుంబానికి చెందిన ఆంధ్ర భాషకు అపారమైన సేవనందించినవాడు రాజరాజ నరేంద్రుడు. రాజమహేంద్రవరం రాజధానిగా 11వ శతాబ్దంలో ఆయన పరిపాలనలో ఉన్నదీ తెలుగుసీమ. రాజరాజే ఆంధ్ర మహాభారతాన్ని నన్నయచే రాయించినట్టు చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తున్నది. వాగనుశాసనుడు, విపుల శబ్దశాసనడు, ఆదికవి అన్న బిరుదులు కలిగిన నన్నయభట్టారకుడు ‘ఆంధ్రశబ్దచింతామణి’ అనే గ్రంథాన్ని తెలుగుకు మొదటి వ్యాకరణ గ్రంథంగా సంస్కృతంలోనే రాశాడు. ‘చాముండికా విలాసము’, ‘ఇంద్ర విజయము’ అనే కావ్యాలు కూడా నన్నయ రాసినట్టుగా తెలుస్తుంది. కానీ అవి ప్రస్తుతం అలభ్యం. మూడున్నర పర్వాల మహాభారతాన్ని ఆంధ్రీకరించిన నన్నయ్యకు రాజరాజ నరేంద్రుడే మొదటి శ్రోత. నారాయణభట్టు అను సహాధ్యాయి సహాయకారి.
మహాభారతము ఆంధ్రీకరణము పూర్తిగా స్వతంత్రానువాదమైనప్పటికీ ఆంధ్రమహాభారత ప్రారంభాన్ని మాత్రం సంస్కృ త శ్లోకం తోనే ప్రారంభించాడు నన్నయ్య.
శ్లో : శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షో ముఖాంగేశు యే లోకానాం
స్థితి మావహన్త్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయ మూర్తయః త్రీ పురుషా సంపూజితావస్సురైః
భూయాసుః పురుషోత్తమాంబుజ భవశ్రీకంధరాశ్రేయసే !!
ఇది గీర్వాణ భాషాభిమానమై ఉండవచ్చును, లేదా భారతమును సంస్కృతంలో రాసిన వ్యాసునిపై భక్తి భావం కావచ్చును. భాషాభగవదత్తవాదమును అనుసరించి సకల భాషలకు మాతృక సంస్కృతము అనే భావమూ కావచ్చు. ఈ శ్లోకంలో సృష్టి స్థితి లయలకు కారణభూతులై త్రిమూర్త్యాత్మకము, త్రిగుణాత్మకమైన శ్రీ లక్ష్మీ సరస్వతి పార్వతులకు , బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు సవినయంగా నమస్కరించి కావ్య రచనకుపక్రమించాడు నన్నయ. ఆంధ్రమహాభారత తత్వాన్ని నన్నయ అవతారికలోనే పేర్కొన్నాడు.
సీ . ధర్మ తత్వజ్ఞులు ధర్మశాస్త్రంబని
ఆధ్యాత్మ విధులు వేదాంతమనియు
నీతి విచక్షణుల్ నీతిశాస్త్రంబని
కవి వృషభులు మహాకావ్యమనియు
లాక్షణికులు సర్వలక్షణ సంగ్రహమని
ఐతిహాసికులితిహాసమనియు
పరమ పౌరాణికులు బహుపురాణ స
ముచ్ఛయంబని మహి కొనియాడుచుండ
ధర్మ మార్గాన్ని కోరుకునే వారికి ధర్మశాస్త్రంగాను, ఆధ్యాత్మిక తత్వాన్ని తెలియగోరువారికి వేదాంతముగాను, నీతి విచక్షణ కావలసిన వారికి నీతి శాస్త్రముగాను, మహాకవులకు కావ్యరాజముగాను, కావ్య లక్షణ సమన్వయం కోరువారికి లక్షణశాస్త్రముగాను, ఇతిహాసముగా చదువుకునే వారికి ఇతిహాస కావ్యముగాను, పౌరాణికులకు పురాణముల సముదాయముగా ఎవరు ఏ విధముగా ఫలితమును ఆశించిన ఆ విధమైన ఫలితమును ఇచ్చేదిగా వేదవ్యాసుడు రచించిన మహాభారతము అపారమైన ఫలితాన్ని ఇస్తుంది అని నన్నయ వ్యాఖ్యానించాడు.
కవిత్వలక్షణాలను పరిశీలిస్తే తన రచనకు ప్రధానంగా మూ డు లక్షణాలు ఉంటాయని నన్నయ్య స్వయంగా సూచించాడు. అందులో ఒకటి ప్రసన్న కథాకలితార్థయుక్తి, రెండవది అక్షర రమ్యత, మూడవది నానారుచిరార్థ సూక్తి నిధిత్వము.
ఉ : సారమతిం కవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో నారసి మేలునానితరు లక్షరరమ్యత నాదరింప నానారుచిరార్థసూక్తినిధి నన్నయ భట్టుతెనుంగునన్ మహా భారతసంహితారచనబంధురుడయ్యెజగద్ధితంబుగన్!
విలక్షణమైన కావ్య లక్షణాలను ప్రతిక్షేపించి జగత్ప్రసిద్ధమైన కావ్య రచనకు పూనుకుంటానని ఆత్మవిశ్వాసాన్ని ప్రారంభంలోనే ప్రకటించాడు. నన్నయ చెప్పిన ఒక్కొక్క లక్షణాన్ని సునిశితంగా పరిశీలిస్తే కొన్ని మచ్చుతునకలు..చం:నుతజల పూరితంబులగు నూతులు నూరిటికంటే సూనృతవ్రత!ఒక బావిమేలు మరి బావులు నూరిటికంటే ఒక్క సక్రతువదిమేలు తత్క్రతు శతకంబుకంటె సుతుండు మేలు తత్సుతశతకంబుకంటే నొకసూనృత వాక్యముమేలు సూడగన్ !
ఈ పద్యంలో నన్నయ సాధించిన అద్భుతమైన సూక్తి సత్య వాక్యము కంటే అపరమైనది మరొకటి లేదు అని. ఆలయము లు , బావులు, ఉద్యానవనములు, పేదలను ఆదుకోవటం మొదలైనవి సప్తసంతానములుగా చెప్తారు. ఇవన్నీ ఇచ్చే ఫలితములు ఒక్కసత్య వాక్యమువలన కలుగుతాయి అని భవిష్యతరాలకు చక్కని సందేశాన్ని ఇచ్చాడు.
అక్షర రమ్యత :-
కావ్య రచనకు అక్షర రమ్యత అనేది ఒక విలక్షణ లక్షణం. రసరమ్యమైన అక్షరముల కూర్పు ఎక్కడ ఎప్పుడు ఎలా ఉపయోగించాలో తెలిసిన నేర్పరి నన్నయ. పాండవులలో అగ్రగణ్యుడు, ధర్మాత్ముడు అయిన యుధిష్ఠురుని పరిపాలన గురించి తెలియజేసే మదమాతంగ తురంగ కాంచన లసన్మాణిక్య గాణిక్య సంపద లోలింగొని వచ్చి అనే పద్యంలో చక్కని అక్షత రమ్యత్వాన్ని ప్రయోగించాడు నన్నయ్య.
ప్రసన్నకథాకలితార్థయుక్తి :-
నన్నయ్య కవితాలక్షణములలో సుకుమారమైనది సుందరమైనది ప్రసన్నకథాకలితార్థయుక్తి. కథాకథన విధానాన్ని బట్టి పాత్రలు, సన్నివేశములు సంఘటనలు కనుల ముందు ప్రత్యక్షమై పాఠకుని తదాత్మీకరణకు గురి చేయునట్లుగా చెప్పటమే ఈ లక్షణం.
లక్షణాలంకార వ్యాకరణఛందో లక్షణ సమన్వితమై, ప్రతిభావ్యుత్పత్తి ప్రయోజన సహిత కావ్యరాజమై తెలుగు భాషకు తలమానికమైన ఆంధ్ర మహాభారత మహోత్కృష్ట గ్రంథమునందు నన్నయ అనుసరించిన సౌరభపద ప్రయోగము తర్వాత కాలంలో చాలామంది కవులు అనుసరించా రు. తెలుగుభాషకు పరిపూర్ణమైన లిపి రూపొందక మునుపే రాయబడిన మహాకావ్యమైనప్పటికీ విశ్వనాథ సత్యనారాయణ పేర్కొన్న ట్లు ఋషివంటి నన్నయభట్టారకుని కావ్య శైలి ఒక రసరమ్యలాహిరి. ఇది యదార్థం.
నానా రుచిరార్ధ సూక్తి నిధిత్వం
నన్నయ మహాభారత కావ్యరచనలో అనేక విధాలుగా పాఠకున్ని ప్రభావితం చేసేవి, ప్రజలకు రుచించేవి,అర్థవంతమైన సూక్తులతో కూడిన విషయాలను ఎన్నో ఉటంకించాడు. రుచిరార్ధ సూక్తి అంటే పాఠకుని ప్రభావితునిగా చేసి, మనోవికాసాన్ని కలిగించేవి అని అర్థం. ఇలాంటి ఎన్నో సూక్తులతో కూడిన సందేశాలు ఆంధ్రమహాభారతంలో కనబడతాయి.
మహతితేజశ్రీ
76619 38945