సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే!
శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే !!
ఆశ్వయుజ శుధ్ధ పాడ్యమి నుం చి మహర్నవమి వరకూ తొమ్మిది రోజులపాటు సద్దుల బతుకమ్మ, గౌరీ పండుగ, సౌభాగ్య వ్రతం అని వాడుకలో ఉన్న నవరాత్రి వ్రతమే ఆంధ్ర ప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో ఘనంగా జరుపుకొనే బతుకమ్మ పండుగ. గుం టూరు జిల్లా పల్నాడు ప్రాంతాల్లో కొన్ని గ్రామాలలో సద్దుల బతుకమ్మ పండుగను శ్రద్ధాభక్తులతో జరుపుకొంటారు.
ఆంధ్రప్రదేశ్లోని మాచెర్ల, కంభంపాడు, కారెంపూడి గ్రామాల్లో ఈ తొమ్మిది రోజులు బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆశ్వయుజ మాసం సంవత్సర మధ్యమం కాబట్టి ఎక్కువ వేడి, ఎక్కువ శీతలం కాకుం డా మంచి ఆహ్లాదకరమైన కాలం. వర్షాలతో నిండిన చెరువులు తొణికిసలాడు తూ ప్రకృతి రమణీయంగా ఉంటుంది. పండిన పంట భారం చేత వంగి నమస్కరిస్తున్నట్లు ఉంటుంది. జొన్న చేలు, పచ్చగా పెరిగే పైరు సంపద, విరబూసిన చెట్లతో ప్రకృతి సౌందర్యవంతంగా విలసిల్లుతుంది.
సద్దుల బతుకమ్మ రోజున కోడికూసే సమయానికి స్త్రీలు నిద్రలేచి పరిసరాలన్నీ తిరిగి రకరకాల పూలు సేకరించి, గోరు వెచ్చని జీడిగింజల నూనె తలకు రాసుకుని అభ్యంగన స్నానం చేసి, నూతన వస్ర్తాలు ధరించి, అలికి ముగ్గులు వేసిన ఇంట్లో చాపవేసి బతుకమ్మను పేర్చి, గుమ్మడి పూవు అండాశయాన్ని తుంచి పసిడి గౌరమ్మను ఏర్పాటు చేస్తారు. పసుపుతో ముద్దగౌరమ్మను చేసి పెట్టి అగరవత్తులు వెలిగించి పసుపుకుంకాలతో అలంకరించి పగలంతా అలాగే ఉంచుతారు.
సంధ్యా సమయంలో పిల్లలు, పెద్దలు, స్త్రీలు అందరూ నూతన వస్ర్తాలతో అలంకరించుకొని బతుకమ్మలను చేతబట్టుకొని చెరువు కట్టకో కాలువగట్టుకో, దేవాలయానికో వెళ్లి బతుకమ్మలను మధ్యలో ఉంచి మహిళలు వాటిచుట్టూ తిరుగుతూ చప్పట్లు చరుస్తూ గొంతెత్తి విన్నపాలను పాటరూపంలో వినిపిస్తూ గౌరమ్మను స్తుతిస్తారు. ఒకరు పాట పాడగా వలయాకారంలో తిరుగుతూ ఆ పాటను అనుసరిస్తూ పాడతారు.
ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ సంబరాలను ఉత్సాహంతో సంతోషంగా చేసుకుంటారు. పెళ్లయిన ఆడ పడుచులను ఈ సంబరాలకోసం పుట్టింటికి తీసుకొస్తారు. కొత్తగా పెళ్లయిన ఆడపిల్లలకు అత్తగారింటినుంచి కాగితపు పూలతో చేసిన బతుకమ్మను వాయినంగా పంపుతారు. పుట్టింటి పిలుపు ఎపుడు వస్తుందా అని ఎదురు చూసే ఆడపిల్లలు తమ అన్న వచ్చి తీసుకొని వెళ్ళాలని ఎదురుచూస్తూ ఇలా పాడుతూ ప్రార్థిస్తారు.
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నా నోము పండింది ఉయ్యాలో
మా అన్నలొచ్చారు ఉయ్యాలో
గొబ్బిళ్లు పుష్యమాసంలో పల్లెటూర్లో ప్రత్యేక ఆకర్షణ. గొబ్బెమ్మలను గోవుపేడ ముద్దతో గుండ్రంగా చేసి, ఒక పెద్దది, రెండు చిన్నవి, లేక ఒక పెద్దది నాలుగు చిన్నవి మూడు లేక ఐదు ముద్దలను పసుపు రాసి కుంకుమ అలంకరించి, సిధ్ధం చేసుకుని శుభ్రం చేసి, రంగవల్లులు తీర్చి దిద్దిన ముంగిట్లో లేక మైదానంలో ఈ గొబ్బిళ్ళు ఏర్పాటు చేసి వాటిపై బంతి లేక చామంతి పూలను అందంగా పేర్చి, సంధ్యాసమయంలో నూతన వస్ర్తాలు, పట్టుపావడాలతో బాలికలు గొబ్బిపూజ చేసి చక్కని గీతాలు పాడుతూ గొబ్బెమ్మల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఆ పార్వతీదేవికి విన్నపాలు చేసుకుంటారు.
సుబ్బీ గొబ్బెమ్మా! సుబ్బీ గొబ్బెమ్మా!
తామరపూవంటి తండ్రీనివ్వవే
తుమ్మ పూవంటి తల్లీనివ్వవే
సంపంగి పూవంటి సోదరునివ్వవే
చామంతి పూల వంటి చెల్లెలినివ్వవే
మందారమంటీ మరదలినివ్వవే
సుఖశాంతుల గూడీ కుటుంబమివ్వవే….
ప్రశాంతమైన జీవనం ఆప్యాయత అనురాగాలు పంచే కుటుంబ సభ్యులతో బాంధవ్యాలు కోరుకుంటూ పాటలు పాడతారు. వచ్చిన బాలికలందరూ తలా ఒకపాట పాడినంతవరకూ ప్రదక్షిణలు చేస్తూనే వంత పాడతారు. గొబ్బెమ్మలు, బతుకమ్మలు నామధేయం ఏదైనా మనల్ని కాచి కాపాడే గౌరమ్మ రూపమే. ఆ జగన్మాతకు మనం భక్తితో సమర్పించే ప్రణతుల సమాహారమే చివరగా హారతులిచ్చి …
‘నిత్య సుమంగళి నిత్య కల్యాణి భక్త జనుల మా కల్పవల్లివై ..కమలాసనవై కరుణ నిండగా కనకవృష్టి కురిపించే తల్లి…సౌభాగ్య లక్ష్మీ రావమ్మా!…’
అంటూ మీ అనుగ్రహం మాకు కలిగించు.. తల్లీ అని మొక్కుతారు.
డా. దేవులపల్లి
పద్మజ