దేవాలయ వ్యవస్థ ఆర్థికంగా పరిపుష్టిని సాధించాలంటే అనేక ఆదాయ మార్గాలుండాలి. అటువంటి ఆలయ ఆదాయానికి సంబంధించి, వివిధ గ్రామాల భట్లు కలిసి చేసిన ఒడంబడికకు సంబంధించినదే నల్లగొండ జిల్లాలోని వాడపల్లి శాసనం. ధార్మిక బుద్ధి కలిగిన భట్లు తమకు లభించిన ఆదాయం నుంచి కొంత దేవునికి సమర్పిస్తామని ప్రతిజ్ఞ చేసిన సందర్భంలో వేసిన శాసనం ఇది. ఈ శాసనకాలం శ.సం.1528 = క్రీ.శ.1608 ప్లవంగ నామ సంవత్సరం, ఫాల్గుణ బహుళ పంచమి గురువారం.
దేవరకొండ, కొండవీడు, నల్లగొండ, ఉండ్రుగొండ, కొండపల్లి, ఓరుగల్లు, అనంతగిరి, బెల్లంకొండ, వినుకొండ, నాగార్జున కొండ, తంగెడ, గురిజాల, కారెంపూడి, తుమురుగోడు, కేతవరం, పేరూరు, దేవలపల్లి, నాగులపాడు, వజ్రాబాదు (వాడపల్లి) సీమలోని సమస్త దేశాల భట్లు వాడపల్లిలోని కోమటివారి పెండ్లిండ్లకు వచ్చి నరసింహుని సన్నిధిలో ఉన్న మైలు వీరప్ప చేసి న విన్నపం ఏమంటే కోమటివారి ఇండ్లల్లో వారికి ఇచ్చే ఫంజి పకాయిలు శ్రీ లక్ష్మీనరసింహస్వామి నిత్యనైవేద్య దీపారాధనలకు సమర్పించమని కోరాడు.
అతని కోరికను మన్నించి అదే భాగ్యమని ఎదిరిచ్చి చేసిన పెండ్లికి వరహా, బియ్యం ఇస్తామని, గుత్తజుట్టి పెండ్లికి మాడ, తూమెడు బియ్యం ఇస్తామని సమస్త దేశాలకు పుణ్యంగా శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి సమర్పించారు. ఈ కట్టడిని మా సమస్త దేశాలవారితో పాటు కోమట్లు ఎవ్వరూ తప్పినా కాశీ లో గోవు, బ్రాహ్మణుని వధించిన పాపాన పోతారు. వారు కృష్ణాగర్భమందు తమ తల్లిదండ్రులను, గురువుల ను వధించిన పాపాన పోతారని శాపోక్తులు చెప్పబడినవి.
‘దాన పాలనయోర్మధ్యే దానాచ్ఛ్రేయోనుపాలనందానాత్స్వర్గమవాప్నోతి పాలనాదచ్యుతం పదం’ అని దానం చేయడం, దాని అనుపాలన చేయడం అనే రెండూ కూడా శ్రేయస్కరమైనవే. దానం చేయడం వల్ల స్వర్గం ప్రాప్తిస్తుంది. దాన పాలనం వలన అచ్యుతపదం లభిస్తుందని దానం విశిష్టత పేర్కొనబడింది. యిడుపులపాటి మాదిరాజు నరసయ్య రాసి న ధర్మశాసనం అని శాసనంలో పేర్కొన్నారు.
శాసనాన్ని విశ్లేషించుకున్నట్లయితే ఆలయ వ్యవస్థను చూసుకునే ఒక అధికారి గుడి ఆదాయం పెంచడానికి ఇవ్వగలిగే స్థాయి ఉన్నవారికి విన్న పం చేసి ఆలయ ఆదాయ మార్గాలను పెంచినట్లు
తెలుస్తున్నది.
– భిన్నూరి మనోహరి