రామాయణ, భారత, భాగవతాలు భారతీయులకు పవిత్ర గ్రంథాలు. భారత సాహిత్యానికే అవి పట్టుకొమ్మలు. భారతీయ జీవన విధానానికి దర్పణాలు. మానవ జీవన విధాన రూపకల్పనకు చక్కగా ఉపకరించే సమున్నత సాధనాలు.
ఆదర్శ మానవ జీవితానికి దారిచూపే కరదీపిక రామాయణం. మూడు కుటుంబ జీవితాలను మన ముందుంచి, ఏది ఉత్తమ జీవితమో చెప్తూ, కుటుంబ బాంధవ్యాలను ఉదాహరణగా నిర్వచించి, ఎవరితో ఎలా మసలుకోవాలో సున్నితంగా సూచించే కావ్యం ఇది. అందుకే రామాయణానికి వైశిష్ట్యం కల్పించి, ఆరాధించారు.
వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకొని, ప్రాంతీయ భాషల్లో పలు రామాయణాలు వెలువడ్డాయి. తెలుగులో తొలి రామాయణం ‘భాస్కర రామాయణం’. ద్విపదగా, చంపూ పద్ధతిలో రూపొందిన మొదటి రామాయణం. అది జానపద ప్రభావం లేక ఇంచుమించు మూల రామాయణ కథ ఆధారంగానే సాగింది.
రామాయణాన్ని సాహిత్య చరిత్రలో కుటుంబ, సామాజిక ఆదర్శాల ద్వారా జీవితంలో విస్తృతమైన దృక్పథాన్ని ప్రవేశపెట్టిన మొదటి రచనలలో ఒకటిగా చెప్పవచ్చు. స్త్రీ పాత్రల గురించిన నిర్దిష్టమైన అధ్యయనంతో గుర్తించబడిన విలువలు లేదా ఆదర్శాలు ఏవీ చెప్పకుండా వదలలేదని
చెప్పవచ్చు. మానవ ఆలోచనల భావోద్వేగం, ఉనికి సంపూర్ణతను ప్రదర్శిస్తుంది.
భారతదేశమే కాకుండా ప్రపంచంపై దాని ప్రభావాన్ని విస్తృతం చేస్తుంది. రామాయణమంతా సీత పాత్ర విస్తరిస్తుంది. ‘సీతాయః చరిత మహత్’ అనే వ్యక్తీకరణ దీనికి నిదర్శనం. కథాంశం మార్చడానికి (మంథర); కథాంశ మలుపు (కౌసల్య, సుమిత్ర, కైకేయి); అనుబంధించడం (శబరి, అహల్య); ఏకపక్ష పాత్ర (ఊర్మిళ); ఇలా మనకు ఎన్నో స్త్రీ పాత్రలు నిజ జీవితపు సారూప్యతను కనిపింపజేస్తాయి.
స్త్రీ పాత్రల ఔచిత్యం: భాస్కర రామాయణంలో మొదట అహల్య వృత్తాంతంలో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇంద్రుడు అహల్యను మోసగించి గౌతముడు లేని సమయాన కోరి వస్తాడు. తన కూతతో పొద్దు పొడిచిన సంకేతం ఇచ్చాడు. గౌతముడు అనుష్టానాలు నిర్వర్తించుకోవడానికి వెళ్తాడు. ఆ సమయం చూసుకొని ఇంద్రుడు ఆశ్రమంలో ప్రవేశిస్తాడు. దివ్య దృష్టి కలిగిన గౌతముడు అన్ని తెలుసుకోవచ్చు కానీ, ‘బుద్ధారెడ్డి’ సామాన్య మానవుడి కల్పనలు కోడికూతతో తెల్లవారిందని భ్రమపడే విధంగా చిత్రించాడు. తిరిగివచ్చిన గౌతముడు అహల్యను శపిస్తాడు. రంగనాథ రామాయణంలో ‘పడతి పాషాణమై పడి యుండు నీవు’ అని శపించినట్లు ఉన్నది.
‘మంథర’: ఈ పాత్రను బుద్ధారెడ్డి రాముడు చిన్నప్పుడు తన కాలు విరిచినందుకు ప్రతీకారం తీర్చుకునే స్వభావం కలదిగా చిత్రిస్తాడు. యజ్ఞదత్తుడు మరణించినప్పుడు అతని తండ్రితో పాటు తల్లికూడా ఎంతగానో విలపించిందని చెప్పడంలో ఆ పాత్రలో మాతృహృదయాన్ని వ్యక్తపరిచాడు.
ఊర్మిళ: రంగనాథ రామాయణంలో ఊర్మిళాదేవి నిద్ర ఘట్టాన్ని వివరిస్తాడు. అరణ్యవాసానికి వెళ్లిన తన భర్త (రాముని వెంట లక్ష్మణుడు) వెళ్లినప్పుడు, లక్ష్మణ కర్తవ్య నిర్వహణ కోసం నిద్రాదేవి తనను ఆవహించడం, లక్ష్మణుడు తిరిగి రాగానే, నిద్రాదేవి వెళ్లిపోవడం దీనిలో చెప్పబడింది.
సీత: సీతాదేవిని హిందూ మతంలోనే విశ్వాసాల ప్రతీకగా చూపబడింది. విష్ణువు అవతారమైన శ్రీరాముని ధర్మపత్ని హిందూ సమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతా చరిత్ర మార్గదర్శకంగా నిలిచిపోయింది. సకల గుణాలు కలిగిన సాధ్విగా, భారతీయులకు నిత్యం ఆరాధించే సుగుణాల రాశిగా పేరొందింది. రామాయణ కథంతా సీతే ప్రధాన పాత్ర వహించింది.
అంజన: కిష్కింధ నివాసి, కుంజరుడి కూతురు, కేసరి భార్య అంజన. ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించాడు. రామాయణంలో ఈమె ప్రధాన పాత్ర వహించింది.
అనసూయ: అంటే అసూయ లేనిదని అర్థం. కర్ధమ ప్రజాపతి, దేవహుతుల పుత్రిక, అత్రి మహిర్షి భార్య. వినయ, వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతి సేవలో లీనమై ఉన్నట్టు పతి భక్తికి మెచ్చి అత్రి మహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది.
అరుంధతి: వశిష్ట మహర్షి ధర్మపత్ని మహా పతివ్రత. బాలకాండలో ఈమె గురించి చెప్పబడింది.
కైకసి: సుమాలి, కేతుమతిల కుమార్తె. విశ్రవసుని భార్య. రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణకలకు తల్లి. గొప్ప శివభక్తురాలుగా చిత్రించారు.
కైకేయి: రామాయణంలో దశరథుని మూడో భార్య. పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత యజ్ఞ ఫలం మూలంగా ఈమెకు భరతుడు జన్మిస్తాడు.
తన దాసి అయిన మంథర మాట విని, శ్రీరాముడిని 14 ఏండ్లు వన వాసానికి పంపమని, భరతునికి రాజ్యాభిషేకం జరిపించమని దశరథుని కోరుకుంటుంది. సీతారాముల వనవాసానికి ప్రధాన కారకురాలైంది.
కౌసల్య: అయోధ్య రాజ్యానికి మహారాణి. కోసల రాకుమారి. ఈమె శ్రీరాముని తల్లి. మహా విష్ణువునే పుత్రునిగా పొందే అదృష్టం పొందింది. ‘కౌసల్యా సుప్రజా రామా’ అని కీర్తించబడింది.
సుమిత్ర: కాశీరాజ్యపు రాకుమారి. యజ్ఞఫలం మూలంగా లక్ష్మణుడు, శత్రుజ్ఞుడు జన్మించారు. సౌమిత్రి అని లక్ష్మణునికి పేరు. రామాయణంలో సుమిత్ర పాత్ర చాలా కొంచెమే కనిపిస్తుంది.
తాటకి: యక్ష రాక్షసి. యక్షరాజైన సుకేతుడికి తపస్సు ఫలితంగా జన్మించిన పుత్రిక. విశ్వామిత్రుని యాగరక్షణార్థం వచ్చిన రామలక్ష్మణులచే వధించబడింది.
తార: కిష్కింధకాండలో వాలి భార్యగా చిత్రింపబడుతుంది. అంగదుడు వీరి కుమారుడు. వాలి, సుగ్రీవుల వైరంలో తా ర హితోక్తులు ముఖ్యంగా చెప్పుకోదగినవి.
త్రిజట: ఇదొక కల్పిత పాత్ర. రావణుడు సీతను ఎత్తుకొని పోయి, లంకలో బంధించినప్పుడు, ఆమెకు రక్షణగా ఉంచిన రాక్షస స్త్రీల లో ఒకతె. ఈమె తన స్వప్న వృత్తాంతం సీతకు తెలపడం ముఖ్యాంశంగా చెప్పవచ్చు.
మండోదరి: రామాయణంలో రావణుని భార్య. విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. ఇంద్రజిత్తు ఈమె కుమారుడు. రావణుని పట్టమహిషి. బాహ్య సౌందర్యరాశి మాత్రమే కాదు, అంతః సౌందర్యం మిక్కిలి కొనియాడదగినది. నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రబోధం చేయగల మనస్తత్వం కలది. మండోదరి, అహల్య, తార, సీత, ద్రౌపది పంచ కన్యలుగా ప్రసిద్ధి చెందారు.
శబరి: శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచి ఉండి, చివరికి రామదర్శనం పొందిన ధన్యజీవి. గిరిజన స్త్రీ అయిన శబరి వేదం తెలియనప్పటికీ యోగ సాధన చేసింది. జ్ఞానం మోక్షం, పొందడానికి అందరూ అర్హులని నిరూపించినదే ‘శబరి కథ’.
శూర్పణఖ: రావణబ్రహ్మ సోదరి. రాముని వనవాస కాలంలో రామునిపై మోజుపడి, లక్ష్మణునిచే ముక్కు చెవులు కోయించుకుంటుంది. రామ రావణ యుద్ధానికి ఈమె ఒక కారణమని చెప్తారు.
సులోచన: ఇంద్రజిత్తుని భార్య.
శ్రుతకీర్తి: కుశ ద్వజుని కుమార్తె.
శత్రుజ్ఞుని భార్య.
సరమ: విభీషణుడి భార్య.
శాంత: దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.
లంకిణి: లంకకు కాపలాగా ఉన్న రాక్షసి.
ధాన్యమాలిని: రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.
ఇలా రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరిచిపోయి ప్రవర్తిస్తే, మరికొన్ని పాత్రలు మానవత్వానికి ప్రతీకలైనాయి. ఇది మానవ ఆలోచన, భావోద్వేగం, ఉనికి సంపూర్ణతను ప్రదర్శిస్తుంది. సమాజంలో లేదా ఒక వర్గం వ్యక్తుల స్థితి ఆధారంగా కానీ మానవ స్వభావం ఆధారంగా ఎటువంటి పక్షపాత భావాలతో చిత్రించబడలేదు.
ఈ రామాయణ స్త్రీ పాత్రల ద్వారా మానవ స్వభావ పరిధిని ఒక సంగ్రహావలోకనం పొందడం జరుగుతుంది. ఏది తీసుకోవాలి లేదా తిరస్కరించాలనేది కథ ముందుకు సాగుతున్న కొద్ది సంఘటనల ఫలితాన్ని బట్టి అవగతమవుతుంది. రామాయణంలో చిత్రీకరించబడిన పాత్రలు ప్రస్తుత సమాజంలో ఒక సాధారణ స్త్రీ జీవితానికి ఒక సాధారణ స్థానాన్ని తెలుసుకునే అంశం గా ఆలోచిస్తే ఈ పాత్రలు భారతీయ నేపథ్యానికి దూరంగా లేవు.
ఒకరి కుటుంబం, స్నేహితులతో పరస్పరం భాషించేటప్పుడు అది ప్రభావం చూపుతుంది. చుట్టూ ఉన్న సమాజంలో ఈ పాత్రలను ఒకదానితో ఒకటి పోల్చి అంచనా వేసినప్పుడు ఆధునిక మహిళల తప్పుల నుంచి నేర్చుకోవడమే కాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోగలరు. రాక్షసులు, సన్యాసులు, దేవతల పాత్రలు కేవలం ఆనందానికి మూలం మాత్రమే కాదు, మానవ స్వభావాలలోని లోపాలు లేదా బలాల పెద్ద సంస్కరణల వర్ణనలుగా చూసినప్పుడు, కథ సందేశాత్మకంగా మారుతుంది. ఈ విధంగా ఒకే సమయంలో నేర్చుకోవడం, ఆనందించడం, సొంత జీవితంలో సాకారం చేసుకోవడం గమనిస్తాం. మన సనాతన సంస్కృతిని నాడు, నేడు రేపు ప్రతిబింబింపజేసి ప్రగతి బాటలు వేసేది రామాయణం అని నిస్సందేహంగా చెప్పవచ్చు.
– డాక్టర్ శ్రీభాష్యం అనురాధ 87903 25502