తెలంగాణ మట్టిలో పుట్టిన ప్రతి కళారూపం అపురూపమైన చారిత్రక సాక్ష్యమే. ఒకప్పుడు అవమానికి గురైన మన యాస నేడు ప్రపంచవేదికలపై ప్రసంశలు అందుకుంటున్నది. తెలంగాణకు జానపదాలు గుండెకాయలాంటివి. దుఃఖమొచ్చినా పాటే, సంతోషమొచ్చినా పాటే. ఈ ప్రాంతానికి పాటమ్మతో ఉన్న సోపతి అలాంటిది. మట్టి నుంచి పుట్టిన మన జానపదాలు నేడు కొత్త ఉత్తేజాన్ని తెస్తున్నయి. ఈ మధ్యకాలంలో ‘బాసింగ బాసింగా బలాలే’ పాట మన గ్రామీణ వివాహ వేడుకల వైభవం, సంస్కృతిని కండ్లకు కట్టినట్లు చూపే ఒక అద్భుత కళాఖండం. ఈ పాట నేటి ఆధునిక తరానికి పల్లెటూరి మధురానుభూతులను పంచుతున్నది. ఇదొక వివాహ గీతం మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వానికి నిదర్శనం. పెండ్లి కుమారుని బాసింగం, వధువు ధరించే పూసల జడ, చేతులకు అలంకరించుకునే గాజు లు, పెండ్లి పీటల మీద జంట మధ్య సాగే సరసాలు, మంగళారతులు వంటి ఆచారాలను ఈ పాటలో ఎంతో సహజంగా, రసవత్తరంగా వర్ణించారు. ‘పోరని’, ‘సయ్యున్నాయే’, ‘ఎల్లిపాయ జాడ’, ‘ముడేసుడే’ వంటి పదాలు తెలంగాణ యాసలోని సొగసును, మట్టిలోని స్వచ్ఛతను తెలియజేశాయి.
తెలుగు జానపద సంగీత ప్రపంచంలో గ్రామీణ జీవనశైలి, స్వచ్ఛమైన ప్రేమను ప్రతిబింబించే పాటలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ కోవకు చెందినదే ‘సన్న సన్న బియ్యమే’ పాట. ఇది కేవలం ఒక పాట మాత్రమే కా దు, తెలంగాణ పల్లెల్లోని అమాయకత్వం, ఆత్మీయతకు నిదర్శనం. ఈ పాటను వింటుంటే, ఒక అందమైన పల్లె వాతావరణం కండ్ల ముందు కదలాడుతుంది. ‘మదనో నావయ్యారి’ అంటూ ప్రియుడిని ఉద్దేశించి పాడే తీరు శ్రోతల మనసును తాకుతుంది. మద్ది చెట్ల నీడన మొదలై, ‘గడి గడికి’ అల్లరి చేసే ఆ ప్రియుడి చేష్టలు, వారి మధ్య సాగే చిన్న చిన్న సరసాలు..ఇవన్నీ ఒక అందమైన ప్రేమ కథను కండ్లకు కట్టినట్లు వివరిస్తాయి.
తెలంగాణ మాండలికం నిరంతరం ఒక ప్రత్యేకమైన మట్టి వాసన, ఆత్మీయతను మోసుకొస్తున్నది. ‘మామిడి కోనల మీన’ పాటే ఇందుకు చకని ఉదాహరణ. అచ్చమైన తెలంగాణ పల్లె వాతావరణాన్ని, ప్రజల వ్యవహారిక భాషా సౌందర్యాన్ని ఈ గీతం కండ్లకు కట్టినట్లు చూపిస్తున్నది. జానపదాలు అంటే కేవలం పాటలు మాత్రమే కాదు. అవి మన మూలాలు, ఆచారాలను రాబోయే తరాలకు అందించే సాంస్కృతిక వారధులు.
-రాజు పిల్లనగోయిన