మహబూబ్నగర్ జిల్లాలోని వర్ధమానపురం లేదా వడ్డెమాను పూర్వం కందూరునాడులో ఉండేది. చాళుక్యులకు సామంతులుగా ఉన్న కందూరిచోడుల తర్వాత వర్ధమానపురాన్ని గోనవంశీయులు గోనబుద్ధారెడ్డి కూతురు కుప్పాంబిక పాలించారు. ఆమె మల్యాల గుండదండాధీశుని భార్య. గోన వంశీయుల తర్వాత వర్ధమానపుర రాజ్యం మల్యాల గుండదండాధీశునికి ఇవ్వబడింది.
వడ్డెమాను వెలుపల శిథిలమైన నాగేశ్వరాలయం శిలాస్తంభం మీద నాలుగువైపుల గుండన వేయించిన శాసనం ఉంది. మొత్తం 165 పంక్తులలో ఉన్న ఈ శాసనం తెలుగు సంస్కృత భాషల్లో, చక్రబంధ శ్లోకంతో కూడి ఉన్నది. శాసనకాలం శ.సం.1167 = క్రీ.శ. 1245. ఈ శాసనాన్ని మానవల్లి రామకృష్ణకవి వెలుగులోకి తెచ్చారు. ఈ శాసనం కాకతి గణపతిదేవ చక్రవర్తి ఓరుగల్లును పరిపాలిస్తున్న కాలంలో వేయించబడింది. ఇందులో కాకతి రెండవ ప్రోలరాజు, మహదేవరాజు, గణపతిదేవ చక్రవర్తులు వర్ణించబడ్డారు.
ఆ తర్వాత మల్యాల వంశవర్ణన ఉంది. ఇందులో దన్నసేనాని, అతని కొడుకు బాచసేనాని, అతని భార్య బాచాంబిక వర్ణన ఉన్నది. ఈ దంపతుల కుమారుడే (బాచ వరూధినీశ వర నందనుండు) గుండదండాధీశుడు. గణపతిదేవ చక్రవర్తిచేత వర్ధమానపుర పాలకుడిగా నియమించబడినాడు.
గుండదండాధీశుడు వర్ధమానపురంలో నాగేశ్వరాలయాన్ని నిర్మించి దేవుని అంగరంగభోగాలకు, ధూపదీప నైవేద్యాలకు పిన్నలట్టిపల్లి గ్రామాన్ని అగ్రహారంగా ఇస్తూ శాసనం వేయించినట్లు తెలుస్తున్నది.
వర్ధమానపురంలో శ్రీ నాగేశ్వర దేవునికి ప్రాకార గోపురోపేతమైన ఆయతనంబు (దేవాలయం) నిర్మించి, విశ్వావసు సంవత్సరం పుష్యబహుళ పంచాదశి (అమావాస్య) సూర్యగ్రహణ కాలంలో అంగరంగ భోగాలకు పిన్నలట్టి గ్రామాన్ని సర్వనమస్యంగా సమర్పించి, దాని రక్షణార్థం శాసనం వేయించినట్లు పేర్కొనబడింది.
నాగేశ్వరాలయంపై ఉన్న బంగారు శిఖరాన్ని చూస్తే ఆ శిఖరకోణాలు సూర్యుని రథగమనానికి అవరోధం కలుగుతుందనే భయం చేత బ్రహ్మ ఈ జగత్తులో ఉత్తరాయణ, దక్షిణాయణలను సృష్టించినట్లు, అట్లా చేయకపోతే సూర్యుడు ఎట్లా పయనిస్తాడని వర్ణితమై అంటే, ఈ ఆలయ శిఖరాలు ఎంత ఎత్తులో, ఎంత విశాలంగా ఉన్నాయో తెలుస్తున్నది.
ఈ శాసనాన్ని ఆత్రేయ గోత్రుడైన ఈశ్వరార్యుని పుత్రుడు మయూరసూరి రచించాడు. ఇతడు పదవాక్య ప్రమాణ ప్రమేయ విచిత్ర కవిత్వ తత్త్వజ్ఞుడుగా, అభినవ మయూరసూరిగా పిలువడినాడు. చిత్రకవితలో నిష్ణాతుడైన ఇతడు ఈ శాసనం చివర శార్దూల విక్రీడితాన్ని చక్రబంధంలో రచించి తన భాషా పాండిత్యాన్ని వెల్లడి చేసుకున్నాడు.
–డాక్టర్ భిన్నూరి మనోహరి
9347971177