ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో ఉన్న ఫ్రంట్కు, కాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ గతవారం ఒక లేఖలో ప్రస్తావించిన బీజేపీ వ్యతిరేక వేదికకు మధ్య గల అతి కీలకమైన వ్యత్యాసాన్ని చాలామంది గ్రహించటం లేదు. కేసీఆర్ ప్రతిపాదన కేవలం ప్రతిపక్షాలకు అధికార సాధనకు సంబంధించినది కాదు. అధికారంతో పాటు, దేశ సర్వతో ముఖాభివృద్ధికి గత 75 ఏండ్లలో లేని అజెండాను ప్రజల భాగస్వామ్యంతో తయారుచేయటం గురించినది. ఇందుకు భిన్నంగా సోనియా ఆలోచన ఎప్పటి వలె కొన్ని పార్టీలను కూడదీసి అధికార సంపాదనకు పరిమితమైనది.
కేసీఆర్ పదేపదే చేస్తున్న వాదన ఏమిటి? సుసంపన్నమైన వనరులు, కష్టించే ప్రజలు ఉండి కూడా 75 ఏండ్ల స్వాతంత్య్రం తర్వాత అనేక రంగాలు కునారిల్లుతూ, సగం మందికి పైగా ప్రజలు ఇంత దుస్థితిలో మగ్గటానికి బాధ్యులు ఎవరు? మన కళ్ల ఎదుట కన్పిస్తున్న వారిలో అందరూ ఏదో ఒక దశలో పాలించినవారే. వారు తమ పాలనా కాలంలో చేసిందేమిటి, చేయనిదేమిటి? చివరికి అందరికి 75 ఏండ్ల పాలనలు సామాన్యుని దృష్టిలో ఒక వైఫల్యంగా ఎందుకు మిగిలాయి? మనతో పాటే స్వాతంత్య్రం పొందిన అనేక ఇతర దేశాల కన్న వెనుకబడి పోవటానికి కారణమేమిటి? పాలకులు ఆర్థికాభివృద్ధి సూచీలు, ఆర్థికవ్యవస్థ సైజుల గురించి చాటుకొని గర్విస్తుండగా, ఆకలిబాధ సూచీలు, మానవాభివృద్ధి సూచీలు, అవినీతి సూచీలు, ధనిక-పేద తారతమ్యాల పెరుగుదల సూచీలు, నిరక్షరాస్యత- అనారోగ్య సూచీలు, నిరుద్యోగ సూచీలు మొదలైన వాటిలో మనం పొరుగున గల చిన్న దేశాల కన్న, కొన్ని ఆఫ్రికన్ దేశాల కన్న దిగువకు ఎందువల్ల పతనమవుతున్నాం? ఇవి చాలవన్నట్లు సామాజిక రుగ్మతలు ఎందుకు గతంలో కన్న మరింత పెచ్చరిల్లుతున్నాయి? కుల, మత వివక్షలు సమాజాన్ని ఎందుకిట్లా విచ్ఛిన్నపరుస్తున్నాయి.
తన 75 ఏండ్ల స్వాతంత్య్ర కాలంలో అందరి పాలనలను, వైఫల్యాలను చూసిన ఈ దేశం ఇప్పుడీ ప్రశ్నలకు సమాధానాలను కోరుతున్నది. సమాధానాల కన్నా ముఖ్యం గా పరిష్కారాలను కోరుతున్నది. పరిష్కారాలు చూపగల అజెండా ఏమిటో స్పష్టమైన రీతిలో కావాలంటున్నది. దానిని ఆచరించగల కొత్త శక్తులు ముందుకురావాలని కోరుకుంటున్నది. ఇది ఇంతకాలం జరిగినట్లుగా, వేర్వేరు పార్టీల మధ్య అధికార మార్పిడుల రంగుల రాట్నం వ్యవహారం కాదు. ప్రజలకు ఎప్పటికప్పుడు వేర్వేరు పేర్లతో కలలను సృష్టించి ఆ కలలను అంతలోనే చిదిమివేయటం కాదు.
పాలకులు మాత్రం మారారు. పాత వైఫల్యాలు కొనసాగాయి. ఇదీ 75 ఏండ్ల తర్వాత మన మహత్తర భారతదేశపు పరిస్థితి. ఇది మారాలన్నది కేసీఆర్ చెప్తున్న మాట. అదే ఒక స్థాయిలో నాయకులకు, మేధావులకు, మరొకస్థాయిలో సాధారణ ప్రజలకు వివరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ పని మరింత పద్ధతి ప్రకారం చేసేందుకు ఆయన సన్నాహాల్లో ఉన్నట్లు తోస్తున్నది.
కేసీఆర్ ప్రసంగాలను, మాటలను మేధావులు, జర్నలిస్టులు, ఇతరులు ఎంత జాగ్రత్తగా చదువుతున్నారో ఎంతవరకు రొటీన్ అధికార రాజకీయం అనుకుంటున్నారో తెలియదు. పూర్తిగా చదివి లోతుగా కాకున్నా, ఒకమేరకు అర్థం చేసుకున్నా, ఆయన చేస్తున్న ఫ్రంట్ ప్రతిపాదనకు, సోనియాగాంధీ అధికార సాధనా బీజేపీ వ్యతిరేక వేదికకు మధ్యగల కీలకమైన వ్యత్యాసం ఏమిటో బోధపడటం కష్టం కాదు. దీని అర్థం కాంగ్రెస్ నాయకురాలు రూపొందించజూస్తున్న వేదికకు విలువలేదని ఎంతమాత్రం కాదు. దేశం ఈ రోజున ఎదుర్కొంటున్న ప్రమాదకర పరిస్థితులను నిలువరించవలసిన అగత్యంపై భిన్నాభిప్రాయానికి తావులేదు. వాస్తవానికి ఆ విషయమై కూడా ఈ రోజున కేసీఆర్ అంత స్పష్టంగా, సాహసంగా దేశానికి వివరిస్తున్న నాయకులు అరుదుగా ఉన్నారనే గుర్తింపు ఇప్పటికే వచ్చింది.
కనుక, సోనియా ప్రతిపాదించే వేదిక అవసరాన్ని గుర్తిస్తూనే ఇక్కడ ఒక కీలకమైన వ్యత్యాసాన్ని మనం అర్థం చేసుకోవలసి ఉన్నది. తక్షణ సమస్యలు, తక్షణ రాజకీయ అవసరాలకు సంబంధించి భిన్నాభిప్రాయాలకు తావుండనక్కరలేదు. కానీ కేసీఆర్వి వర్తమానంతో పాటు గత 75 ఏండ్ల చరిత్రను, దేశ సుదీర్ఘ భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుంటున్న ఆలోచనలు. ఆయన ఈ మాట వివిధ రాష్ర్టాల ముఖ్యమంత్రులను, ఇతర నాయకులను, వేర్వేరు రంగాల ప్రముఖులను, నిపుణులను కలిసినప్పుడల్లా చెప్తూ వస్తున్నదే. ఇతరత్రా ప్రసంగాల్లో, తన పార్టీ సమావేశాల్లో వివరిస్తున్నదే. అధికారం గురించి కాక, దేశంలో, సమాజంలో మౌలిక మార్పుల విషయమై ఆలోచించాలని అంటూ వస్తున్నారాయన. ఆ మాట అందరికి నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రతి సందర్భంలో అది నొక్కిచెప్తూ, అందుకోసం తన జీవితాన్ని అంకితం చేసి పనిచేయగలనంటున్నారు.
సోనియాగాంధీ తదితరుల ఆలోచనలలో ఇటువంటి మౌలికతలు, దీర్ఘకాలిక దృష్టిలేదని వేరుగా చెప్పనక్కరలేదు. వారి ప్రయత్నాలు ఒకవేళ ఫలిస్తే సమస్య తాత్కాలికంగా పరిష్కారం కావచ్చు. కానీ బీజేపీ, మతతత్వం అనే సమస్యలు పోయేవి కావు. అదట్లా ఉంచి, ఒక అధికారపక్షాన్ని అధికారంలోంచి పడగొట్టేందుకు వివిధ ఫ్రంట్లు గతంలోనూ ఏర్పాటయ్యాయి. కాంగ్రెస్కు, బీజేపీకి వ్యతిరేకంగా. అటువంటిది రాష్ర్టాలలోనూ జరిగింది. కొన్నిసార్లు అవి నెరవేరాయి కూడా. కానీ కేవలం అధికారం విషయంలో. అంతే తప్ప విధానాలు, పరిపాలన, రాజకీయ- ఆర్థిక- సామాజిక స్థితిగతులు, ప్రజల జీవితాలలో మౌలిక మార్పులు ఏమీ రాలేదు. పాలకులు మాత్రం మారారు. పాత వైఫల్యాలు కొనసాగాయి. ఇదీ 75 ఏండ్ల తర్వాత మన మహత్తర భారతదేశపు పరిస్థితి. ఇది మారాలన్నది కేసీఆర్ చెప్తున్న మాట. అదే ఒక స్థాయిలో నాయకులకు, మేధావులకు, మరొకస్థాయిలో సాధారణ ప్రజలకు వివరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఆ పని మరింత పద్ధతి ప్రకారం, విస్తృతంగా చేసేందుకు ఆయన సన్నాహాల్లో ఉన్నట్లు తోస్తున్నది. ఇది ఎంత సాకారమైతే దేశానికి అంత మేలు జరుగుతుంది.
టంకశాల అశోక్