తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాలనాపగ్గాలు చేపట్టి సుమారు ఎనిమిదేండ్లు పూర్తికావస్తున్నది. ఈ తరుణంలో బుధవారం హైదరాబాద్ నగరంలోని ‘హైటెక్స్’లో జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీ.. పార్టీ నాయకత్వానికి, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తూనే, మరోపక్క చక్కని ఆత్మపరిశీలనకు అవకాశం కల్పిస్తుందని ఆశించవచ్చు.
కేసీఆర్ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించడం ప్లీనరీలో లాంఛనంగా జరిగే ప్రక్రియ. అయితే ఈసారి ఇందుకు భిన్నంగా, ప్రస్తుతం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు నిర్వహిస్తున్న మంత్రి కేటీఆర్కు పార్టీ పగ్గాలు పూర్తిగా అప్పజెప్పి, యువనాయకత్వంలో పార్టీని మరింత పటిష్ఠం చేయాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు సమాచారం. ఈ ఊహాపోహలకు ఎలాంటి ప్రాతిపదిక లేదు. తన మనసులోని మాటను తానే స్వయంగా బయట పెట్టేదాకా ఏ విషయం మూడో కంటికి కూడా తెలిసే అవకాశం లేనటువంటి రాజకీయ చాణక్యం కేసీఆర్ సొంతం. పరిపాలనలో కావచ్చు, పార్టీ నడిపే తీరులో కావచ్చు ఆయనది ఒక అరుదైన విలక్షణ శైలి.
రెండు దశాబ్దాల టీఆర్ఎస్ ప్రస్థానంలో చోటుచేసుకున్న అనేక పరిణామాలను ఓసారి సింహావలోకనం చేసుకుంటే ఎన్ని బాలారిష్టాల నడుమ ఈ పార్టీ బతికి బట్టకట్టిందీ అవగతమవుతుంది. సాధించిందేమీ లేకపోవడంతో అసలు ఉద్యమాల పట్లనే ప్రజలకు ఏవగింపు కలిగిన పరిస్థితుల్లో కేసీఆర్ రంగప్రవేశం చేసి సుదీర్ఘ శాంతియుత పోరాటానికి బాటలు వేశారు. స్వల్ప సంఘటనలు మినహాయిస్తే, పుష్కరకాలం పైచిలుకు సాగిన తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ఎక్కడా అపశ్రుతు లు దొర్లిన దాఖలా లేకుండా జాగ్రత్తపడ్డారు. సదా వినూత్నంగా ఆలోచించే కేసీఆర్ తత్వం, తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని ఏ దశలోనూ దెబ్బ తినకుండా కాపాడింది. ఆయన చేసిన ప్రసంగాలు, వ్యాఖ్యలు ఎప్పటికప్పుడు ఉద్యమ తీవ్రత తగ్గుముఖం పట్టకుండా చేశాయి. కేసీఆర్ అనుసరించిన వ్యూహాల్లో పార్టీ ప్లీనరీలు ఒక భాగం. ఉద్యమ తీవ్రతలో హెచ్చు తగ్గులు ఉండవచ్చేమో కానీ, త్రికరణశుద్ధిగా సాగించే ఉద్యమాలు, ఆందోళనలు వైఫల్యం చెందే ప్రశ్నే ఉండదని కేసీఆర్ నమ్మకం. ఈ పరిణామ క్రమంలో టీఆర్ఎస్ ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందు లు, మోసిన నిందలు అన్నీ ఇన్నీ కావు. అయినా కేసీఆర్ ప్రతి మలుపును గెలుపు దిశగా మళ్లించి, పార్టీకి ఎప్పటికప్పుడు నూతన జవసత్వాలు అందించారు. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొని ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డారు. మొత్తమ్మీద ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణను సాధించి పెట్టారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ పగ్గాలు చేపట్టిన వెంటనే ఉద్యమ కాలంలో తన మెదడులో సుళ్ళు తిరుగుతున్న ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చే పనికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర విభజన జరిగిన వెంటనే తెలంగాణ చీకటి కూపం అవుతుందని రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించినవారు చేసిన ఎద్దేవాలను గుర్తు పెట్టుకొని, పట్టుదలగా పనిచేసి, అనేక ఏండ్లుగా జనాలు అలవాటుపడిన కరెంటు కోతల ఇబ్బందులను మంత్రదండంతో మాయం చేసినట్టు దూరం చేశారు. హైదరాబాద్లోనూ, ఇతరత్రా తెలంగాణలోనూ స్థిరపడిన ప్రాంతీయేతరులు తమ భవితవ్యంపై పెంచుకున్న భయాందోళనలను అనతికాలంలోనే దూరం చేశారు. పలు వినూత్న పథకాలను అమలుచేస్తూ బంగారు తెలంగాణ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. విపక్షాలు విమర్శించక ఏం చేస్తాయని సరిపెట్టుకోవచ్చు, సర్దిచెప్పుకోవచ్చు. కానీ ఆ నిరసనలు వెలువడుతున్నది ఎక్కడినుంచి అన్నది టీఆర్ఎస్ గమనించాలి. విపక్షాల గొంతుకలో నుంచా, ప్రజలు కూడా అలాగే అనుకుంటున్నారా అనేది జాగ్రత్తగా పరిశీలించాలి. అన్నింటినీ బేరీజు వేసి తెలంగాణ బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. ఆ దిశగా ప్లీనరీ అందుకు తగిన వేదిక కాగలదని ఆశిద్దాం.
భండారు శ్రీనివాసరావు, 98491 30595