ఇంగ్లీష్లో COMETH THE HOUR… COMETH THE MAN అనే నానుడి ఉన్నది.
ఏ సమయానికి తగ్గ మనిషి ఆ సమయంలో ప్రవేశిస్తాడని.
ఈ ప్రస్తుత దేశ సంక్షుభిత పరిస్థితుల్లో కేసీఆర్ ఆ ఉదయించనున్న ఆశాకిరణం.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ప్రవేశానికి దసరాను ముహూర్తంగా నిర్ణయించడంతో దేశవ్యాప్తంగా కేసీఆర్పై చర్చ ప్రారంభమైంది. కేవలం పది లోక్సభ స్థానాలున్న తెలంగాణ నేతగా ఉన్న కేసీఆర్ జాతీయపార్టీ పెట్టి ఏం సాధిస్తాడని కొందరు పెదవి విరుస్తున్నారు. అసలు, హిందుత్వ నినాదంతో దుందుడుకుగా ఉన్న బీజేపీని తట్టుకోవడం సాధ్యమవుతుందా అనే నిట్టూర్పులు కూడా విదిలిస్తున్నారు. ఇలా, నిత్య నిరాశావాదులు ఎప్పట్లాగే వాదిస్తున్నప్పటికీ, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సర్వతోముఖాభివృద్ధి వ్యూహాలతో ముందుకువెళ్తూ తెలంగాణను దేశంలోనే ఒక రోల్మోడల్గా తీర్చిదిద్దిన కేసీఆర్ లక్ష్యసాధనను అంత తేలికగా తీసుకోరని ఆయనను ముందునుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న పలువురు మేధావులు, తలపండిన రాజకీయ నాయకులు పలు అంశాలను ఉదహరిస్తున్నారు.
ప్రస్తుత, దేశ రాజకీయ చిత్రపటంలో అతిపెద్ద పార్టీగా పేర్కొంటున్న ‘భారత జాతీయ కాంగ్రెస్’ నాయకత్వ లేమితో కొట్టుమిట్టాడుతున్నది. ఆ పార్టీకి ఒక దశ, దిశ లేకుండాపోయింది. ఇక కమ్యూనిస్టు పార్టీల పరిస్థితి విశ్లేషిస్తే.. ఆధునిక రాజకీయ ఎత్తుగడలను పాటించడంలో వెనుకబడుతూ, యువ ఓటర్లను ఆకర్షించడం పక్కనపెడితే, తమ సంప్రదాయ ఓటర్లను కూడా దూరం చేసుకుంటున్నాయి. ఇక జాతీయపార్టీలుగా చెప్పుకునే బీఎస్పీ, ఎస్పీల పరిస్థితి అంతంత మాత్రమే. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పటికీ, దేశాన్ని మతం మత్తులో దింపాలనే కుట్రలో భాగంగా ఒక్కో రాష్ట్రంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేందుకు ఆపరేషన్ లోటస్ను అమలు చేస్తున్నది బీజేపీ. ఇప్పటివరకు ఈ విధంగా పలు రాష్ర్టాల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చేసింది.
కేంద్రప్రభుత్వ కుట్రపూరిత విధానాలున్నప్పటికీ గత ఎనిమిదేండ్లుగా తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను జాతీయస్థాయిలో ఆచరణలోకి తేవడానికి దేశానికి కేసీఆర్ నాయకత్వమే సరైనదని దేశ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు.
ఇదేరకమైన కుట్రలకు తెలంగాణలో తెర లేపినప్పటికీ, ఇక్కడి బలమైన నాయకత్వం, శక్తివంతమైన ప్రజా మద్దతు, నాయకుల్లో ఐకమత్యం దృఢంగా ఉండటంతో పువ్వు పార్టీల కుతంత్రాలు సాగడం లేదు. పైగా, బీజేపీ నాయకత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక, విచ్ఛిన్నకర పోకడలను, తిరోగమన విధానాలను ఎప్పటికప్పుడు ఎండగట్టడంలో ముందున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ పౌరులకు సరికొత్త భావి భారత నాయకుడిగా మారాడు. మానవీయ కోణంలో, సంక్షేమ ప్రదాయిక, సామాజిక న్యాయ, ఆర్థికాభివృద్ధిని సాధించే అనేక ప్రజోపయోగ పథకాలను తెలంగాణలో దిగ్విజయంగా అమలుచేస్తున్నారు. తద్వారా దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ అవతరించింది. గత కొన్నేండ్లుగా, ఏ రంగంలో ఉత్తమ ఫలితాలను సాధించినా అవి తెలంగాణలో అమలవుతున్న పథకాలే కావడం దేశంలోని మేధో వర్గాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
నోట్ల రద్దు, జీఎస్టీ, ఆఖరికి పిల్లలు తాగే పాలపై కూడా పన్ను వేయడం లాంటి బీజేపీ విధానాలను ప్రజలు ఈసడించుకుంటున్నారు. గణనీయ లాభాల్లో ఉన్న ఎల్ఐసీని, నవ రత్నాలను ప్రైవేటైజ్ చేసి తమ అస్మదీయులకు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నిరుపేదలకు ఉపయోగపడే ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, సంక్షేమ పథకాలన్నింటినీ ఎత్తివేసి పేదలను మరింత నిరుపేదలుగా మార్చేసే నరేంద్ర మోదీ, షా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇలా, ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతున్నప్పుడు వారి దృష్టిని మళ్లించేందుకు హిజాబ్, ఇస్లామిక్ ఫోబియాను ముందుకుతెస్తున్నది బీజేపీ. అయితే బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను, కార్పొరేట్శక్తుల అనుకూల విధానాలు, తిరోగమన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకుడిగా కేసీఆర్ మాత్రమే జాతీయస్థాయిలో బలంగా కనిపిస్తున్నారు. తెలంగాణలో వ్యవసాయానుకూల రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయోత్పత్తుల సేకరణ పథకాలు అమలవుతున్నాయి. వీటితోపాటు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఐటీ, పారిశ్రామికీకరణ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం గణనీయమైన అభివృద్ధి సాధిస్తున్నది. మరే ఇతర రాష్ట్రంలో అమలుకాని విధంగా సంక్షేమ కార్యక్రమాలు, పల్లె, పట్టణప్రగతి కార్యక్రమాలు, నిర్మాణరంగంలో జరుగుతున్న అప్రతిహత అభివృద్ధిని కూడా జాతీయస్థాయిలో విశ్లేషకులు ఉదహరిస్తున్నారు.
అద్భుతమైన పథకాల సమర్థవంతమైన అమలుతో హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో దేశంలోని దాదాపు 15 రాష్ర్టాల నుంచి వచ్చిన వివిధ వృత్తులవారు, సేవారంగాల్లో ఉపాధిని పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వ కుట్రపూరిత విధానాలున్నప్పటికీ తెలంగాణలో గత ఎనిమిదేండ్లుగా మానవీయ కోణంలో అమలవుతున్న అభివృద్ధి పథకాలను జాతీయస్థాయిలో ఆచరణలోకి తేవడానికి దేశానికి కేసీఆర్ నాయకత్వమే సరైనదని దేశ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. చెడుపై సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకొనే పర్వదినం దసరా. ఈ రోజున జాతీయపార్టీని ప్రారంభించి దేశ రాజకీయాల్లో కీలకపాత్ర వహించేందుకు ముందుకురానున్న కేసీఆర్ దేశ ప్రజలకు ఒక ఆశాజ్యోతిగా కనిపిస్తున్నారు.
– తరుణ్