తెలంగాణ ప్రజలకు ఎవరు మిత్రులో, ఎవరు శత్రువులో చెబుతూ దోపిడీదార్లను హెచ్చరిస్తూ రాసిన కవితకు ఇప్పటికీ ప్రాసంగికత ఉంది. ‘దోపిడి చేసే ప్రాంతేతరులను దూరం దాకా తన్ని తరుముతం/ ప్రాంతం వాడే దోపిడి చేస్తే ప్రాణం తోనే పాతర వేస్తం/ దోస్తుగ ఉండే వారితో మేమును దోస్తే చేస్తం ప్రాణమిస్తం/ ఎంతకు అంత అన్న ధోరణితో చింత మాని బతుకును సాగిస్తం’ (నా గొడవ – పేజీ: 366)- ఈ విధంగా తెలంగాణ ప్రాంత స్వభావాన్ని, మనుషుల తీరును వెల్లడించటానికి చాలా సాధారణమైన మాటలకు కవిత్వ సొగసును సంతరింపజేయడం కాళోజీ సృజనాత్మక అభివ్యక్తికి నిదర్శనం. నిజాం రాచరిక పాలనను అంతమొందించిన తెలంగాణలో ఇతరులు పాగా వేసి దోపిడీ చేసే కుట్రలు చెల్లవని చెప్పడానికి కాళోజీ రాసిన కవిత ఇది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో దీనికి ఎంతో ప్రాచుర్యం లభించింది.
తెలుగు భాషాభిమానం మెండు
పలు భాషల్లో ప్రావీణ్యం ఉన్న కాళోజీకి తెలుగుభాషపై, ప్రత్యేకించి తెలంగాణ భాషపై ఎనలేని మమకారం ఉన్నది. ఆ మమకారం, ప్రేమ పలు కవితల్లో వ్యక్తమవుతుంది. నిజానికి తాను ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. ఇంట్లో మరాఠీ భాష మాట్లాడుతుండేవారు. అయినప్పటికీ నిజాం రాజ్యంలో తెలుగు భాష పట్ల, తెలుగు ప్రజల పట్ల చూపుతున్న నిరాదరణ గురించి 1942 లోనే బలమైన కవిత రాశారు కాళోజీ.
‘ఏ భాషరా నీది? యేమి వేషమురా ? ఈ భాష వేషమెవరికోసమురా! ఆంగ్లమందున మాటలాడ గలుగగనే ఇంతగా గుల్కెదవు? ఎందుకోసమురా, ఉర్దూ మాటలాడి యుబ్బు బ్బి పడుటకు కారణంబేమిటో కాస్త చెప్పుమురా! తెలుగు బిడ్డడవయ్యు తెల్గు రాదంచును సిగ్గు లేక ఇంక చెప్పుటందుకురా… అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు, సకిలించు ఆంధ్రుడా! చావవెందుకురా’. కాళోజీకి తెలుగు భాషపై గల మక్కువకు ఇది నిదర్శనం.
అయినప్పటికీ ప్రామాణిక భాష పేరుతో తెలంగాణ మాండలికాన్ని నిర్లక్ష్యం చేయడం ఆయనకు నచ్చలేదు. కనుకనే తెలంగాణా వాసిగా.. ‘రెండున్నర జిల్లాలదే/ దండి బాస అని అంటవ/ తక్కినోళ్ళ నోళ్ళయాస/ తొక్కిపెట్టవలెనంటవ’ అని నిలదీశారు.
తెలంగాణ ఏర్పాటు ఆత్మహత్యా సదృశమని, శాంతికీ, సమైక్యతకు భంగకరమని – ఆనాడు వచ్చిన వాదనలను కూడా తన కవిత్వం ద్వారా తిప్పికొట్టారు. రాష్ర్టాల ఏర్పాటుకు రాజ్యాంగం ఒప్పున్నది, పార్లమెంటు మెప్పున్నది అన్న విషయాన్ని స్పష్టంగా రాస్తూ తెలంగాణ ప్రజల ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష రాజ్యాంగ సమ్మతమైనదేనని తేల్చి చెప్పారు. ‘కోటిన్నర మేటి ప్రజల/ గొంతొక్కటి గోడొక్కటి/ తెలంగాణ వెలిసి నిలిచి/ ఫలించాలె భారతాన’ అంటూ తెలంగాణ ఆశయాలని ప్రతిఫలింపజేశారు. ‘తొమ్మిది జిల్లాల ప్రజలు/ చేసిన పాపంబేమిటి? తొమ్మిది జిల్లాల ప్రజల/ కోర్కెలో తప్పేమున్నది? రాజ్యాలను విభజిస్తే/ రాజ్యాంగానికి లోపమా?’ అంటూ నాటి పాలకుల్ని నిలదీశారు. (ఆనాడు తెలంగాణలో తొమ్మిది జిల్లాలే ఉండేవి). మరో కవితలో- తెలంగాణ వేరైతే దేశానికి ఆపత్తా? తెలంగాణ వేరైతే తెలుగు బాస మరుస్తరా? అంటూ సూటిగా ప్రశ్నించారు.
కవిత్వంలో సరళమైన శైలి
కాళోజీ కవిత్వంలో సంక్లిష్టత లేదు. పదాడంబరం, భాషా పటాటోపం లేదు. ఇతివృత్తం ఏదైనా సరళంగా, సూటిగా, సుబోధకంగా వ్యక్తం చేయడం కాళోజీ కవితా రచనా సంవిధానం. కాళోజీ ఫౌండేషన్ వారు వెలువరించిన ‘నా గొడవ’ బృహత్తర సంకలనంలో ఆయన కవిత్వమంతా ఒక్కచోట చేర్చారు. దాదాపు 450 పేజీలున్న పుస్తకమిది. దీనిలో 1953లో మొదటిసారిగా అచ్చయిన ‘నా గొడవ’ సంపుటిలోని కవితల నుంచి 1966-67లలో సాధారణ ఎన్నికలను దృష్టి లో పెట్టుకొని రాసిన ’పరాభవ వసంతం’, ’పరాభవ శిశిరం’ మొదలైన వాటితో పాటు 1962లో భారత, చైనా యుద్ధ సమయంలో రాసిన గేయాలు, 1975-1977 మధ్య రాసిన కవితలు, 1969 తెలంగాణ ఉద్యమ సమయంలో రాసి న కవితలు ఉన్నాయి. వీటిలో స్పష్టం గా తనదైన దృష్టితో అనేక అంశాల మీద కవితలు రాశారు కాళోజీ. రాజకీయాలలో ప్రజల పాత్ర గురించి చెబుతూ ‘ప్రజాకీయాలు’ అనే కవిత రాశారు. ‘ప్రజలు ప్రజలు మేటి ప్రజలు! ప్రజాస్వామ్యమందు ప్రజలు! మౌనంగ ఉన్నారేం? మరణాంతర స్థితి మాదిరి? ప్రజాస్వామ్య జీవనది పట్టు తప్పలేదు కదా? అనవరతము జాగరణము అనివార్యము/ ప్రజలకను ప్రజాస్వామ్య మూల మంత్ర పారమేల మరచెను ప్రజ?’ అంటూ ప్రజలే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ఉద్బోధించారు. దేశంలో ఇవాల్టి పరిస్థితులకు కూడా వర్తించే కవిత ఇది. ప్రజల చైతన్యమే ప్రజాస్వామ్యానికి రక్ష అని కాళోజీ ఆనాడు చేసిన బోధనకు ఎంత విలువ ఉన్నదో అర్థమవుతుంది. ఓటర్ల బాధ్యతను కూడా ఓ కవితలో గుర్తు చేస్తారు కాళోజీ.
‘ఓటిచ్చునప్పుడే ఉండాలి బుద్ధి/ ఎన్నుకొని తల బాదుకొన్న నేమగును?/ తర్వాత ఏడ్చినను తప్పదనుభవము’ అని వివేకంతో ఓటుహక్కును వినియోగించుకోవాలని చెప్పిన కవిత నేటి ఓటర్లకు మంచి పాఠం.
ఈ విధంగా నిత్యమూ, నిరంతరమూ ప్రజల పక్షం నిలుస్తూ కవిత్వం రాశారు కాళోజీ. అధికారంలో ఉన్న వారిమీద ప్రశ్నల అస్ర్తాలను సంధించారు. ఎమర్జెన్సీలోనూ పాలకుల అన్యాయాలను, దుర్మార్గాలను నిరసిస్తూ కవిత్వం రాయడానికి జంకలేదు. భీతి ఎరుగని కవి కనుకనే కాళోజీని లూయీ అరగాతో పోల్చారు శ్రీశ్రీ. ‘యుద్ధంలో ఫ్రాన్స్ కవులంతా చెల్లాచెదురుగా పారిపోతే లూయీ అరగాన్ ఒక్కడే దేశంలో నిలబడి మహా ప్రజా విశ్వాసాన్ని వెల్లడించే గీతాలు రాశాడు. కాళోజీ లూయీ అరగాన్ వంటివాడు. తెలంగాణ మూగజీవాల హృదయాల్ని ప్రతిబింబింపజేశాడు’ అని శ్రీశ్రీ ప్రశంసలు అందుకున్నారు కాళోజీ.
‘పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిదే’ అని సగర్వంగా ప్రకటించారు కాళోజీ. ఈ విధంగా ప్రజల కోసం, దేశం కోసం పనిచేసేవారు ఎలా ఉండాలో తన జీవితమే ఉదాహరణగా నిలవడం కాళోజీ కవితా వైశిష్ట్యం. కాళోజీ మాటకీ, చేతకీ, రాతకీ అంతరం లేదు. చెప్పిందే చేశారు. చెప్పిన మాటకు కట్టుబడి బతుకంతా నిస్వార్థంగా బతికారు. ఎలాంటి పదవులు ఆశించలేదు. సాధారణంగా జీవిస్తూనే అసాధారణమైన రీతిన జనం మదిలో నిలిచిపోయిన ప్రజల మనిషి. ప్రజల భాషలో కవిత్వం చెప్పి వారి భాషకు పట్టం గట్టిన ఋషి. కాళోజీ ఏడు దశాబ్దాల రచనా వ్యాసంగం, తెలంగాణ పౌరహక్కుల ఉద్యమాలతో సాంస్కృతికోద్యమాలతో ముడిపడి సాగింది.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ప్రజల పక్షాన నిలిచి కవిత్వం రాయటం, అదీ ప్రజల భాషలో రాయటం ఎంత అవసరమో కాళోజీ కవిత్వం, జీవితం తెలియజెబుతాయి. కనుకనే కాళోజీది తెలుగునాట, తెలంగాణ నేల మీద విశిష్ట వ్యక్తిత్వం. జీవితమంతా గాంధేయవాదిగా ఉంటూనే అన్యాయాలనీ, వివక్షనీ ప్రశ్నించిన కాళోజీ ఈతరం కవులకు స్ఫూర్తి. ప్రజాస్వామ్యాన్ని ఆకాంక్షించే శక్తులకు దీప్తి. ప్రజల కోసం ప్రజల భాషలో కవిత్వం రాసే వారికి నిరంతర ప్రేరణ.
– డాక్టర్ చింతల రాకేశ్ భవాని , 92466 07551