భక్తికి జాతి, కుల, మతాల అంతరాలు ఉండవు. భారతదేశంలో వివిధ భాషల్లో రచనలు చేసిన భక్త కవయిత్రులు ఎందరో ఉన్నారు. కవయిత్రుల భక్తి తత్పరతే భక్తి కావ్య రచనకు దోహదం చేసి, వారిని భక్తి కవయిత్రులుగా గుర్తింపునిచ్చింది. ఎంతోమంది కవయిత్రులు భక్తితో రచనలు చేయడమే కాకుండా వాటి ద్వారా తమ దైవచింతనను, భక్తి ప్రపత్తులను చాటుకున్నారు.
భక్తి సాహిత్యం వెలువరించిన కవయిత్రులలో ప్రథమ స్థానం మొల్లది. ఆమె రామ భక్తురాలు. ఆనాటి సమాజంలో స్త్రీలు రచన చేయరాదని నిరసనగళం వినిపిస్తుంటే పవిత్రమైన రామాయణం రచించడం సాహసమే. అందుకే ‘చెప్పమని రామచంద్రుడు చెప్పించిన పలుకు మీద చెప్పానని, ఇహపర సాధనం రామాయణం రచన’ అని, తప్పులెంచవద్దని కవులను వేడుకున్నది భక్త కవయిత్రి మొల్ల. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తురాలైన బాలవితంతువు తరిగొండ వెంగమాంబ. గురువు అనుగ్రహంతో భక్తి రచనలు చేశానని చెప్పుకున్నది. బాలవితంతువైన తనకు వెంకటేశ్వరుడే భర్త అని చెప్పుకొని పూలు గాజులు పెట్టుకుని తిరిగిన వెంగమాంబ ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది. భక్తి తన్మయత్వంలో ఆమె దేవాలయంలో హారతి సమర్పించేది. వెంగమాంబ ముత్యాల హారతి ఈనాటికీ చాలా ప్రసిద్ధి. శతకాలు, కావ్యాలు, యక్షగానాలు, కీర్తనలు అన్నీ భక్తి స్ఫోరకాలే. నేటికీ తిరుపతిలో తరిగొండ వెంగమాంబ వాఙ్మయ ప్రాజెక్టు, అన్నదాన సత్రం, వెంగమాంబ సమాధిని భక్తులు దర్శించి నివాళులర్పిస్తారు.
భక్తి సాహిత్యంలో కన్నడ రచయిత్రి అక్కమహాదేవి గొప్ప శివ భక్తురాలు. ఆమె జీవిత చరిత్ర భక్తులకు చాలా ఆదర్శప్రాయం. జైన మహరాజ్ కోరిక తీర్చని అక్కమహాదేవి దిగంబరంగా కేశపాశాలే ఆచ్ఛాదనగా శ్రీశైలం చేరింది. చెన్నమల్లికార్జునుని సాంగత్యం కోరింది. శివుడే నా ఆత్మ, నా ఆత్మయే శివుడని స్పష్టంగా చెప్పింది అక్కమహాదేవి. వచనాల గురించి ‘అక్క రాసిన స్ఫూర్తి ఒక్కటియే చాలామంది శివ శరణుల సూక్తుల సమానం’ అంటూ ఈ భక్త కవయిత్రిని ఆదరిస్తారు భక్తులు. తమిళ సాహిత్యంలో ఎందరో కవులు ఉన్నా భక్త కవయిత్రులుగా ప్రసిద్ధురాలు ఆండాళ్. మధుర భక్తితో పాశురం రచించిన విష్ణు భక్తురాలు. ఆండాళ్ తిరుప్పావైకి తెలుగులో చాలా అనువాదాలు వచ్చాయి. శృంగార ప్రబంధం రాసిన ముద్దు పళని ఆండాళ్ పాశురాలను తెనిగించడం విశేషం. భావకవి కృష్ణశాస్త్రి తిరుప్పావై అనువాదకులలో ఒకరు. పాశురాల రచనలతో తమిళ సాహిత్యాన్ని భక్తి రచనలలో సుసంపన్నం చేసింది ఆండాళ్.
మరాఠీ కవయిత్రి జనాబాయి దళిత బాలిక, భక్త కవయిత్రి. బాల్యంలో జ్ఞానదేవ, నామదేవుల భక్తి రచనలతో ప్రభావితమయ్యింది. నామదేవుని ఇంటి పనిమనిషిగా చేరిన బాలిక జనాబాయి భక్తి తత్పరత ఆమెను పాండురంగని భక్తురాలిగా మార్చింది. మరాఠీ భాషలోని అభంగ రచనలలో జనాబాయి అద్వైత భక్తిని ప్రతిబింబింపజేసింది. జనాబాయి అభంగ రచనలు, భజనలు, సంకీర్తనలు చాలా ప్రాచుర్యం పొందాయి. సక్కుబాయి, సూక్తిబాయి భక్త కవయిత్రులగా పేరెన్నిక గన్నవారే. గౌరీబాయి గుజరాతి కవయిత్రి. బాలవితంతువైన గౌరీబాయి జీవిత కాలమంతా భక్తి, ఙ్ఞాన వైరాగ్యంతో గడిపింది. గుజరాత్లో వైష్ణవ ధర్మ ప్రచారకులలో గౌరీబాయి స్థానం విశిష్టమైనది. ‘కీర్తన మాల’ అనే గ్రంథంలో శ్రీకృష్ణ లీలలు, కొన్ని శివ స్తోత్రములు కూడా ఉన్నాయి. భక్తి గీతాలు గుజరాతీ ప్రజలకు నిత్య పారాయణంగా ఉన్నాయి.
కశ్మీర కవయిత్రిగా పేరుగాంచిన లల్లాదేవి అవ్వ లల్ల అని పిలువబడి, కశ్మీర సాహిత్యంలో భక్తి కవయిత్రిగా ప్రసిద్ధి పొందింది. ఒక సాధువు ప్రవచన ప్రభావానికి బాల్యంలోనే లోనైంది లల్ల. వివాహమైనా కూడా ఆధ్యాత్మిక తత్వం వైపు మరలి అత్తగారి ఆగ్రహానికి గురైంది. జీవితం మీద విరక్తితో సర్వసంగ పరిత్యాగం చేయ నిశ్చయించి, ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. భక్తి పారవశ్యంలో గురువుల వెంట తిరుగుతూ కులమతాలకు అతీతంగా, సన్యాసినిగా హిందూ ముస్లింల అభిమానాన్ని చూరగొన్నది. లల్ల చెప్పే వాక్యాలు ‘లల్లవాక్’ అనే పేరున కశ్మీర్లో ఎందరో భక్తులు ప్రబోధం చేస్తూ ఆమెను కీర్తిస్తారు.
రాజస్థాన్ కవయిత్రి మీరా బాల్యం నుంచే శ్రీకృష్ణుని భక్తురాలు. తండ్రి గొప్ప కృష్ణ భక్తుడు. వారి ఇంటికి సాధువులు, భక్తులు వచ్చేవారు. వారి భక్తి ప్రవచనాలు మీరాపై చాలా ప్రభావం చూపాయి. మీరా వైవాహిక బంధం భర్త మరణంతో పరిసమాప్తమైంది. ఐహిక సుఖాలకు దూరమై భక్తి భావంతో పరవశించిపోయి ‘గిరిధర గోపాలుడే నా వాడు’ అంటూ కృష్ణ సంకీర్తనే జీవితమని భావించింది.
భక్తి కీర్తనలు పాడ వద్దనే కుటుంబ సభ్యుల ఆరళ్ళు భరించలేక ఇల్లు విడిచి వెళ్ళిపోయింది. బృందావనం, మధుర, ద్వారకలలో జీవితం గడిపింది. మీరా భక్తి మార్గం అందరిని ఆకర్షించింది. ‘గోవిందుడే నా ఆత్మ అన్యమెరుగను’ అంటూ పరవశించి పాడే మీరా భజనలు భక్తుల నాలుకలపై ఆనంద నాట్యం చేస్తాయి. తెలుగువారెందరికో మీరా భజనలు కంఠస్థం.
కుంతల కుమారి ఒరియా కవయిత్రి. విద్యపై ఆసక్తితో ఢిల్లీ వెళ్లి సంస్కృతం నేర్చుకున్నది. కుంతల కుమారిపై వైష్ణవ భక్తి ప్రభావం చాలా ఎక్కువ. ఎన్నో భక్తి రచనలు చేసింది. కృష్ణుని ఈమె వర్ణించడం ఒక విశేషం. కృష్ణుడు దీనుల జఠర జ్వాలగా, వితంతువుల కన్నీటి ధారగా కనిపిస్తాడు ఈ భక్త కవయిత్రికి. రాధాకృష్ణుల ప్రణయాన్ని ‘ప్రేమ చింతామణి’ అని నాటకంగా రాసింది.
సహజంగా పుట్టుకతోనే భక్తి భావాలు పెనవేసుకోగలిగి భక్త కవయిత్రులైన వారు కొందరైతే, పరిస్థితుల ప్రభావం, కుటుంబ పరిస్థితులు కొందరిని భక్త కవయిత్రులుగా మార్చాయి.
డాక్టర్ ముక్తేవి భారతి
99896 40324