నాటికలు, కవిత్వం, కథ, నవలలు మొదలైన ప్రక్రియల్లో బోయ జంగయ్య రచనలు చేశారు. జంగయ్య నల్గొండ జిల్లా, రామన్న పేట తాలూకాలోని పంతంగి గ్రామంలో ఎల్లమ్మ, మల్లయ్య దంపతులకు 1942 అక్టోబరు1న జన్మించారు. వృత్తి రీత్యా ప్రభుత్వ ఖజానాలు, లెక్కల శాఖలో ఉద్యోగం చేస్తూ, ప్రవృత్తిరీత్యా విస్తృత సాహిత్య సృజన చేశారు.
బోయ జంగయ్య ఎన్ని ప్రక్రియల్లో రచనలు చేసినా, అతని ప్రతిభ కథలు రాయటంలో నవలలు రచించటంలో ఎక్కువగా ప్రకాశించింది. ఆయన కథలు మానవతావాదాన్ని చాటాయి. దళిత వాదాన్ని ప్రతిబింబించాయి. దళితవాదం లో కవిత్వం వచ్చినంత బలంగా వచన రచనలు రాలేదు. కానీ తెలంగాణ నుంచి దళిత వాదంతో వచన రచన చేసిన అతికొద్ది మందిలో బోయ జంగయ్య ఒకరు.
బోయ జంగయ్య బాలల కోసం అనేక పుస్తకాలు రాశారు. పిల్లల కోసం కథలు, గేయాలు, కవితలు, నాటికలు రాశారు. 2006లో వీరు రచించిన ‘మనవడు చెప్పిన కథలు’ బాగా గుర్తింపు పొందింది. 1999లో ‘గుజ్జనగూళ్ళు’, ‘పిల్లల కోసం ఆటలు-పాటలు’ పుస్తకాలు ప్రచురితమయ్యాయి. 2002లో ‘మాటల ఆటలు’, 2003లో ‘చిలకల పలుకులు’, 2004లో ‘మన నేతలు’, ‘టీవీ ముచ్చట్లు’, 2005లో ‘మనం మారాలి’ లాంటివి ప్రత్యేకంగా పిల్లల కోసం రాసినవే.
బోయ జంగయ్య సాంఘిక కథలు, నవలలు రాయడంలో నేర్పరి. ‘లోకం’, ‘గొర్రెలు’, ‘ఎచ్చరిక’, ‘దున్న రంగులు’,‘చీమలు’, ‘తెలంగాణ వెతలు’, ‘బోజ కథలు’, ‘బొమ్మలు’, ‘ఉప్పు నీరు’, ‘ఇప్పపూలు’, ‘ఆమె’, ‘అడవిపూలు’, ‘దాడి’ కథా సంపుటాలు; ‘దేశం కోసం’, ‘కొత్త బాటలు’, ‘ఆలోచించండి’ వంటి నాటికలు రాశారు. ‘నడుస్తున్న చరిత్ర’, ‘వెలుతురు’, ‘బోజ కవితలు’ అనే కవితా సంపుటాలు; ‘జాతర’, ‘జగడం’ వంటి నవలలు రాశారు.
జంగయ్య రాసిన ‘జాతర’ నవలను మైసూరు విశ్వవిద్యాలయం 1995లో బి.ఏ. ఉపవాచకంగా ఎంచుకున్నది. ‘గొర్రెలు’ పుస్తకాన్ని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఏ. తెలుగుకు ఉపవాచకంగా తీసుకున్నది. దీన్నే ఆంధ్రా విశ్వవిద్యాలయం కూడా ఉపవాచకంగా తీసుకోవడం విశేషం. ఆయన రాసిన ‘డా.అంబేడ్కర్’ అనే వచన కవిత 8వ తరగతి వాచకానికి పాఠ్యాంశంగా తీసుకున్నారు.
1963లో ‘కష్టసుఖాలు’ నాటికను తన తొలి పుస్తకంగా రచించిన వీరి కలం నుంచి అనేక రచనలు వెలువడ్డాయి. వీరి తొలికథ ‘జీవిత మలుపులు’. ఆ తర్వాత విస్తృతంగా విశిష్టమైన కథల్ని రాశారు. మనుషుల్లోని క్రూరత్వాన్ని ప్రతీకాత్మకంగా చెప్పడానికి జంతువుల కంటే వికృతంగా ప్రవర్తించే దోపిడీదారులను ఎండగడుతూ ‘గొర్రెలు’ కథ రాశారు. అంబేద్కర్, జగ్జీవన్రాం, గుర్రం జాషువ, కె.ఆర్.నారాయణన్ల జీవిత చరిత్రల్ని రాశారు. బాలల కోసం ప్రత్యేకించి ‘బడిలో చెప్పని పాఠాలు’, ‘గుజ్జనగూళ్ళు’, ‘ఆటలు-పాటలు’, ‘చిలకల పలుకులు’ మొదలైనవి రాశారు. 2016 మే 7న కన్నుమూసిన బోయ జంగయ్య ఈ తరం సాహితీకారులకు ఆదర్శం.
-డా. జొన్నకూటి ప్రమోద్ కుమార్, 94908 33108
(మే7న బోయ జంగయ్య వర్ధంతి)
ప్రకటనలు
ఆహ్వానం
పాలమూరు సాహితీ అవార్డు కోసం 2021లో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మూడేసి ప్రతులను 2022 మే 31లోపు పంపాల్సిందిగా మనవి. చిరునామా: డా.భీంపల్లి శ్రీకాంత్, ఇంటి నెం: 8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్నగర్-509 001.
-డాక్టర్. భీంపల్లి శ్రీకాంత్, 90328 44017
(పాలమూరు సాహితీ అవార్డు వ్యవస్థాపకులు, మహబూబ్నగర్)
సాహితీ అవార్డు
ఉమ్మడిశెట్టి లిటరరీ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనంతపురంలో 2022 మే 15న ఉదయం 10 గంటలకు అవార్డు ప్రదానోత్సవ సభ జరుగుతుంది. కవి యార్లగడ్డ రాఘవేంద్రరావుకు అవార్డు ప్రదానం చేస్తారు. డా.ఉమ్మడిశెట్టి రాధేయ అధ్యక్షతన జరుగు సభలో ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, తూంచెర్ల రాజారామ్, డా.కాళ్లకూరి శైలజ తదితరులు అతిథులుగా హాజరవుతారు. ఈ సభలో డా.తుర్లపాటి రాజేశ్వరి, ఆర్. వసుధారాణికి ప్రతిభా పురస్కారాల ప్రదానం, డా.రాధేయ గారి కవితా విమర్శ గ్రంథం ఆవిష్కరణ ఉంటుంది.
-డా.రాధేయ (అవార్డు వ్యవస్థాపకులు, అనంతపురం)