రామాయణ, భారత, భాగవతాలు భారతీయులకు పవిత్ర గ్రంథాలు. భారత సాహిత్యానికే అవి పట్టుగొమ్మలు. భారతీయ జీవన విధానానికి దర్పణాలు. మానవ జీవన విధాన రూపకల్పనకు చక్కగా ఉపకరించే సమున్నత సాధనాలు. ఆదర్శ మానవ జీవితానికి దారి చూపే కరదీపిక రామాయణం. మూడు కుటుంబ జీవితాలను మన ముందుంచి, ఏది ఉత్తమ జీవితమో చెప్తూ, కుటుంబ బాంధవ్యాలను ఉదాహరణగా నిర్వచించి, ఎవరితో ఎలా మసలుకోవాలో సున్నితంగా సూచించే కావ్యమిది. అందుకే రామాయణానికి వైశిష్ట్యం కల్పించి, ఆరాధించారు.
వాల్మీకి రామాయణాన్ని ఆధారంగా చేసుకుని, ప్రాంతీయ భాషల్లో పలు రామాయణాలు వెలువడ్డాయి. తెలుగులో తొలి రామాయణం ‘భాస్కర రామాయణం’. ద్విపదగా, చంపూ పద్ధతిలో రూపొందిన మొదటి రామాయణమిది. అది జానపద ప్రభావం లేకుండా ఇంచుమించు మూల రామాయణ కథ ఆధారంగానే సాగింది.
రామాయణం సాహిత్య చరిత్రలో కుటుంబ, సామాజిక ఆదర్శాలద్వారా జీవితంలో విస్తృతమైన దృక్పథాన్ని ప్రవేశపెట్టిన మొదటి రచనలలో ఒకటిగా చెప్పవచ్చు. స్త్రీ పాత్రల గురించిన నిర్దిష్టమైన అధ్యయనంతో గుర్తించిన విలువలు లేదా ఆదర్శాలు ఏవి చెప్పకుండా వదలలేదు. ఇది మానవ ఆలోచనల భావోద్వే గం, ఉనికి సంపూర్ణతను ప్రదర్శిస్తుంది. భారతదేశమే కాకుండా ప్రపంచంపై దాని ప్రభావాన్ని విస్తృతం చేస్తుంది.
రామాయణమంతా సీత పాత్రే విస్తరించి ఉంటుంది. ‘సీతాయః చరిత మహత్’దీనికి నిదర్శనం. కథాంశం మార్చడానికి (మంథర); కథాంశ మలుపు (కౌసల్య, సుమిత్ర, కైకేయి), అనుబంధించడం (శబరి, అహల్య), ఏకపక్ష పాత్ర(ఊర్మిళ), ఇలా మనకు ఎన్నో స్త్రీపాత్రలు నిజజీవితపు సారూప్యతను కనిపించేలా చేస్తాయి.
స్త్రీ పాత్రల ఔచిత్యం: భాస్కర రామాయణంలో మొదట అహల్య వృత్తాంతంలో ప్రత్యేకత కనిపిస్తుంది. ఇంద్రుడు అహల్యను మోసగించి గౌతముడు లేని సమయాన కోరి వస్తాడు. తన కూతతో పొద్దు పొడిచిన సంకేతం ఇచ్చాడు. గౌతముడు అనుష్టానాలు నిర్వర్తించుకోవడానికి వెళ్తాడు. ఆ సమయం చూసుకొని ఇంద్రుడు ఆశ్రమంలో ప్రవేశిస్తాడు. దివ్యదృష్టి కలిగిన గౌతముడు అన్నీ తెలుసుకోవచ్చు. కానీ ‘బుద్ధారెడ్డి’ సామాన్య మానవుడి కల్పనలు కోడికూతతో తెల్లవారిందని భ్రమపడే విధంగా చిత్రించాడు. తిరిగి వచ్చిన గౌతముడు అహల్యను శపిస్తాడు. రంగనాథ రామాయణంలో ‘పడతి పాషాణమై పడి యుండు నీవు’ అని శపించినట్టు చెప్పారు.
మంథర: రాముడు చిన్నప్పుడు తన కాలువిరిచినందుకు ప్రతీకారం తీర్చుకునే స్వభావం కలదిగా ఈ పాత్రను బుద్ధారెడ్డి చిత్రిస్తాడు. యజ్ఞదత్తుడు మరణించినప్పుడు అతని తండ్రితో పాటు తల్లి కూడా ఎంతగానో విలపించిందని చెప్పడంలో ఆ పాత్రలో మాతృహృదయాన్ని వ్యక్తపరిచాడు.
ఊర్మిళ : రంగనాథ రామాయణంలో ఊర్మిళాదేవి నిద్ర ఘట్టాన్ని వివరిస్తాడు. అరణ్యవాసానికి వెళ్లిన తన భర్త (రాముని వెంట లక్ష్మణుడు) వెళ్ళినప్పుడు, లక్ష్మణ కర్తవ్య నిర్వహణకోసం నిద్రాదేవి తనను ఆవహించడం, లక్ష్మణుడు తిరిగి రాగానే, నిద్రాదేవి వెళ్ళిపోవడం ఇందులో చెప్పబడింది.
సీత: సీతాదేవిని హిందూమతంలోని విశ్వాసాల ప్రతీకగా చూపబడింది. విష్ణువు అవతారమైన శ్రీరాముడి ధర్మపత్ని హిందూసమాజంలో స్త్రీ ప్రవర్తనకు, ఆలోచనకు సీతాచరిత్ర మార్గదర్శకంగా నిలిచింది. సకల గుణాలు కలిగిన సాధ్విగా, భారతీయులకు నిత్యం ఆరాధించే సుగుణాల రాశిగా పేరొందింది. రామాయణ కథంతా సీతనే ప్రధాన పాత్ర వహించింది.
అంజన: కిష్కింధ నివాసి కుంజరుడి కూతురు, కేసరి భార్య అంజన.ఈమెకు వాయుదేవుడి అంశతో హనుమంతుడు జన్మించాడు. రామాయణంలో ఈమె ప్రధాన పాత్ర వహించింది.
అనసూయ: అంటే అసూయ లేనిది అని అర్థం. కర్దమ ప్రజాపతి దేవహుతుల పుత్రిక, అత్రి మహర్షి భార్య. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో లీనమైం ది. ఆమె భక్తికి మెచ్చి అత్రి మహర్షి అష్టాక్షర మంత్రోపదేశం చేస్తాడు. మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది.
అరుంధతి: వశిష్ట మహర్షి ధర్మపత్ని. మహా పతివ్రత. బాలకాండలో ఈమె గురించి చెప్పబడింది.
కైకసి: సుమాలి, కేతుమతిల కుమార్తె. విశ్రవసుని భార్య. ఈమె రావణ, కుంభకర్ణ, విభీషణ, శూర్పణధిలకు తల్లి. గొప్ప శివభక్తురాలుగా ఈమెను చిత్రించారు.
కైకేయి: రామాయణంలో దశరథుని మూడవ భార్య. పుత్రకామేష్టి యాగం చేసిన తర్వాత యజ్ఞఫలం మూలంగా ఈమెకు భరతుడు జన్మిస్తాడు. తన దాసి అయిన మంథర మాటవిని, శ్రీరాముని 14 సంవత్సరాలు వనవాసానికి పంపమని, భరతునికి రాజ్యాభిషేకం జరిపించమని దశరథుని కోరుకుంటుంది. సీతారాముల వనవాసానికి ప్రధానకారకురాలైంది.
కౌసల్య : అయోధ్యా రాజ్యానికి మహారాణి. కోసల రాకుమారి. ఈమె శ్రీరాముని తల్లి. మహావిష్ణువునే పుత్రునిగా పొందే అదృష్టం,‘కౌసల్యా సుప్రజా రామా’ అని కీర్తింపబడింది.
సుమిత్ర: కాశీరాజ్యపు రాకుమారి. యజ్ఞఫలం మూలంగా లక్ష్మణుడు, శత్రుఘ్నుడు జన్మించారు, సౌమిత్రి అని లక్ష్మణునికి పే రు. రామాయణంలో సుమిత్ర పాత్ర చాలా కొంచెం కనిపిస్తుంది.
తాటకి: యక్షరాక్షసి. యక్షరాజైన సుకేతుడికి తపస్సు ఫలితంగా జన్మించిన పుత్రిక. విశ్వామిత్రుని యాగ రక్షణార్థం వచ్చిన రామలక్ష్మణులచే వధింపబడినది.
తార: కిష్కింధకాండలో వాలి భార్య గా చిత్రింపబడింది. అంగదుడు వీరి కు మారుడు. వాలి, సుగ్రీవుల వైరంలో తార హితోక్తులు ముఖ్యంగా చెప్పుకోదగినవి.
త్రిజట: ఇది ఒక కల్పిత పాత్ర. రావణుడు సీతను ఎత్తుకొని పోయి, లంకలో బంధించినప్పుడు, ఆమెకు రక్షణగా ఉంచి న రాక్షస స్త్రీలలో ఒకరు. ఈమె తన స్వప్న వృత్తాంతం సీతకు తెలుపడం ముఖ్యాంశంగా చెప్పవచ్చు.
మండోదరి: రామాయణంలో రావణుని భార్య. విశ్వకర్మ పుత్రుడైన మయబ్రహ్మ కుమార్తె. ఇంద్రజిత్తు ఈమె కుమారుడు. రావణుని పట్టమహిషి. బాహ్య సౌందర్యరాశి మాత్రమే కాదు, అంతర సౌందర్యం మిక్కిలి కొనియాడదగినది. నీతిని, ధర్మాన్ని, కర్తవ్యాన్ని ప్రభోదం చేయగల మనస్తత్వం కలది. అహల్య, తార, సీత, ద్రౌపదితో మండోదరి పంచకన్యగా ప్రసిద్ధి చెందింది.
శబరి: శ్రీరాముని భక్తురాలు. రాముని దర్శనానికై జీవితాంతం భక్తితో వేచి ఉండి, చివరికి రామదర్శనం పొందిన ధన్యజీవి. గిరిజన స్త్రీ అయిన శబరి వేదం తెలియనప్పటికీ యోగ సాధన, జ్ఞానం మోక్షం, పొందడానికి అందరూ అర్హులని నిరూపించిన కథ ‘శబరి కథ’.
శూర్పణఖ: రావణబ్రహ్మ సోదరి. రాముని వనవాసకాలంలో రామునిపై మోజుపడి, లక్ష్మణునిచే ముక్కు చెవులు కోయించుకుంటుంది. రామ రావణ యుద్ధానికి ఈమె ఒక కారణమని చెప్తారు.
సులోచన: ఇది ఒక కల్పిత పాత్ర ఇంద్రజిత్తు భార్య.
శ్రుతకీర్తి: కుశ ధ్వజుని కుమార్తె. శత్రఘ్నుని భార్య.
సరమ: విభీషణుని భార్య.
శాంత : దశరథుని మిత్రుడైన రామపాదుని కుమార్తె.
లంకిని : లంకకు కాపలాగా ఉన్న ఒక రాక్షసి.
ధాన్యమాలిని: రావణుని రెండవ భార్య. అతికాయుని తల్లి.
ఇలా రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మరచిపోయి ప్రవర్తిస్తే, మరికొన్ని పాత్రలు మానవత్వానికి ప్రతీకలైనాయి. ఇది మానవ ఆలోచన, భావోద్వేగం, ఉనికి సంపూర్ణతను ప్రదర్శిస్తుంది. సమాజంలో లేదా ఒక వర్గం వ్యక్తుల స్థితి ఆధారంగా కానీ మానవ స్వభావం ఆధారంగా ఎటువంటి పక్షపాత భావాలతో చిత్రించబడలేదు.
ఈ రామాయణ స్త్రీ పాత్రల ద్వారా మానవ స్వభావం పరిధిని ఒక సంగ్రహావలోకనం పొందడం జరుగుతుంది. ఏది తీసుకోవాలి లేదా తిరస్కరించాలనేది కథ ముందుకు సాగుతున్న కొద్దీ సంఘటనల ఫలితాన్ని బట్టి అవగతం అవుతుంది. రామాయణంలో చిత్రించిన పాత్రలు ప్రస్తుత సమాజంలో ఒక సాధారణ స్త్రీ జీవితానికి తన స్థానాన్ని తెలుసుకునే అంశంగా ఆలోచిస్తే ఈ పాత్రలు భారతీయ నేపథ్యానికి దూరంగా లేవు.
ఒకరి కుటుంబం, స్నేహితులతో పరస్పరం భాషించేటప్పుడు అది ప్రభావం చూపుతుంది. చుట్టూ ఉన్న సమాజంలో ఈ పాత్రలను ఒకదానితో ఒకటి పోల్చి అంచనా వేసినప్పుడు ఆధునిక మహిళ తప్పుల నుండి నేర్చుకోవడమే కాకుండా సరైన సమయంలో సరైన నిర్ణయా లు తీసుకోగలరు. సన్యాసులు, రాక్షసులు, దేవతలు పాత్రలు కేవలం ఆనందానికి మూ లం మాత్రమే కాదు, మానవ స్వభావాలలోని లోపాలు లేదా బలాలు పెద్ద సంస్కరణల వర్ణనలుగా చూసినప్పుడు, కథ సందేశాత్మకంగా మారుతుంది. ఈ విధంగా ఒకే సమయంలో నేర్చుకోవడం, ఆనందించడం, సొంత జీవితంలో సాకారం చేసుకోవడం గమనిస్తాం. మన సనాతన సంస్కృతిని నాడు నేడు రేపు ప్రతిబింబింప చేసి ప్రగతి బాటలు వేసేది రామాయణం .
– డాక్టర్ శ్రీభాష్యం అనూరాధ 87903 25502