అరవై ఏండ్ల కిందట ఒక బతుకుపాదులో అంటరాని అక్షరం పురుడు పోసుకుంది. చిరుప్రాయంలోనే తండ్రిని కోల్పోయి, ఆ అక్షరం విలవిలలాడింది. అక్షరం చుట్టూ ముసురుకున్న చీకట్లు. మాతృమూర్తి మహాసంకల్పంతో అడ్డంకులను లెక్కచేయకుండా, అన్నీ తానై అక్షరాన్ని లాలించింది. ముండ్లదారిలో ముందుకు దూసుకుపోయే గుండె నిబ్బరాన్ని నేర్పింది. నిరంతరకృషితో, తల్లి చల్లని దీవెనలతో అక్షరం కాస్తా పదమై పరిమళించింది. మొక్కవోని సంకల్పంతో ఆ పదం వాక్యమై, దేశికోత్తముల ఆశీస్సులతో తెలుగు కవితై, ప్రాదేశిక సృజనోత్తేజంతో తెలంగాణ కావ్యమై తేజరిల్లింది.
నిత్య స్ఫూర్తిదాయకమైన ఆ జీవనకావ్యం పేరు ఆచార్య బన్న అయిలయ్య. రంగంపేట మాలపల్లి నుంచి బయలుదేరి చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో, ఉన్నత విద్యా శోధనతో కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల పీఠాన్నిఅధిరోహించిన ధీశాలి బన్న అయిలయ్య. ఆచార్యునిగా, ప్రాచార్యునిగా, పీఠాధిపతిగా, కవిగా, విమర్శకునిగా, పరిశోధకునిగా, సంపాదకునిగా, బహుముఖీన ప్రతిభా సంపత్తితో సాగిన అయిలయ్య జీవన, సాహిత్య ప్రస్థానం ఎందరికో ఆదర్శం.
Acharya Banna Ailaiah | నిరుపేద కుటుంబంలో పుట్టిన అయిలయ్య ప్రతిష్ఠాత్మకమైన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షుడిగా సమున్నత స్థాయికి చేరుకోవడం వెనుక కఠోరమైన కృషి, దీక్షాదక్షతలు ఉన్నాయి. చెమట చుక్కలతో, కన్నీళ్లతో తడిసిన సంఘర్షణాత్మకమైన బాల్యం ఆయనది. తరగతి గదిలో విద్యార్థిగా, తరగతి బయట శ్రమజీవిగా అయిలయ్య ద్విపాత్రాభినయం చేశారు.
కూలీపనులకు వెళ్తూ, దుకాణాల్లో పనిచేస్తూనే నర్సంపేటలో ఇంటర్ డిగ్రీ, చదువుకొని ఉన్నత విద్యావంతుడయ్యారు అయిలయ్య. విద్యార్థి ఉద్యమాలతో మమేకమై విప్లవ రాజకీయాల వైపు మళ్లారు. ఒక మహావృక్షం తాను మొలకెత్తిన ప్రాంగణానికే నీడనిచ్చినట్టు అయిలయ్య తాను పరిశోధన చేసిన కాకతీయ విశ్వవిద్యాలయంలోనే అధ్యాపకుడై ఎంతో మంది విద్యార్థులకు భాషాసాహిత్యాలను బోధించారు. ఉత్తమోత్తమ గురువులకు శిష్యుడై, సత్ శిష్యకోటికి గురువయ్యారు.
మూడున్నర దశాబ్దాల పాటు భాషా సాహిత్యాల బోధనలో, పరిశోధనలో నిబద్ధతతో నిమగ్నమయ్యారు. పరిశోధక విద్యార్థులను ప్రాణమిత్రులుగా భావించి ఆదరించారు. విశ్వవిద్యాలయ ఆచార్యులకు కొంగుబంగారంగా, అధికారులకు తలలో నాలుకలా విలసిల్లారు. చాలావరకు సంప్రదాయ సాహిత్య పరిశోధనలకు, ఆ విలువలకు ఆలవాలమైన కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్య కాత్యాయిని విద్మహే ఆధునిక దృష్టిని కలిగించినట్టుగా, అస్తిత్వ ఉద్యమాల సాహిత్య పరిశోధనలకు, తదనుగుణమైన పాఠ్య ప్రణాళికకు అయిలయ్య పెద్దపీట వేశారు. దళిత, బహుజన, తెలంగాణ ఉద్యమ దృక్పథంతో సాహిత్యాన్ని మూల్యాంకనం చేసే తాజా పరిశోధనా పద్ధతులను విద్యార్థులకు బోధించారు. ప్రజాస్వామ్య బద్ధమైన ఉద్యమాల జాడలో సామాజిక, సాహిత్య కార్యకర్తగా తనవంతు పాత్రను పోషించారు. ఉత్తమ గురువుగానే కాకుండా ప్రభావశీలమైన కవిగా ఆయన విమర్శకుల మెప్పు పొందారు.
‘నేను నడిచి వచ్చిన పాదాల గుర్తుల్ని మనసు పొరల కింద దాచుకొని, అర్ధరాత్రి బరువుగా తోస్తే నా కండ్లు చెమ్మగిల్లేవి/నాకలం వర్షించేది’ అని అయిలయ్య సహజసిద్ధమైన తన సృజనస్ఫూర్తిని తెలియజేశారు. ‘కన్నీరు కలదేని ఎన్నయినా ఉన్నట్లే’ అని కాళోజీ అన్నట్టుగా అశ్రుధనమే అపూర్వ పెట్టుబడిగా అయిలయ్య అరుదైన కవితాసంపదలను పండించారు.
చెమ్మగిల్లిన కన్నులతో జీవితాన్ని, సమాజాన్ని తాత్త్వికంగా వ్యాఖ్యానిస్తూ అయిలయ్య వెలువరించిన ‘రహస్య చిత్రం’ కవితా సంపుటి విలక్షణమైనది. ‘రహస్య చిత్రం’లో కవి అద్భుత కవితా శిల్పాన్ని ఆవిష్కరించారు. ‘మనిషి చెట్టుకు పూసిన పూలు కన్నీళ్లయితే/ ఆ పూలన్నీ పండుగా మారితే అది గుండె’ అంటూ సమాజ ఉనికికి మూలసూత్రమైన మానవీయ స్పృహకు అయిలయ్య పరమ ఆర్ద్రంగా కవితా భాష్యం చెప్పారు. 80వ దశకంలో పెరిగిన నిర్బంధాలను, క్రూరమైన రాజ్య హింసను ధిక్కరించి, ప్రతిఘటనాత్మక చైతన్యాన్ని శక్తివంతంగా కవిత్వీకరించారు. ‘వెదురు పొదల మాటున తెగిపడ్డ పిడికిళ్లు / వేళ్లూనుకొని తుపాకులై మొలవాలి/ పోలీసు వాహనాల కింద పగిలిన గుండెలు మళ్లీ కొట్టుకోవాలి’ అని రాజ్యం అధికారికంగా సాగించే మారణకాండను నిరసించారు. ‘కలాల నాలుకలను తెగ్గోసి/జైలు ద్వారాలకు తోరణాలుగా వేలాడ దీస్తారు’ అని అయిలయ్య 30 ఏండ్ల కిందట చెప్పిన మాట ఈనాటి స్థితిగతులను గుర్తుచేస్తుంది. ‘దిక్కులేక దీనంగా రోడ్డు శిలువకు /బిగించిన బాలక్రీస్తులు/ చీకటి దుప్పటిని కప్పుకొని ఉన్నారు; ‘వయోలిన్ గొంతుకు/ నీ కర్ణ భేరిని అతికించు/ గతం తలపోస్తున్న ఆలాపన విను’; ‘తుంచిన పారాసెటమాల్ మాత్రలా చంద్రుడు’… ఇలాంటి అసాధారణ అభివ్యక్తీకరణ శైలి అయిలయ్య కవితల్లో దర్శనమిస్తుంది. ఆధునిక జీవితంలోని సంక్లిష్టతను, అనిశ్చితిని, విషాదాన్ని, మృత్యుతత్వాన్ని ‘రహస్య చిత్రం’ కవితా సంపుటిలో నవీన కవన శైలిలో అయిలయ్య చిత్రీంచారు. పేర్వారం జగన్నాథం అన్నట్లుగా అయిలయ్య కవిత్వంలో చిత్తశుద్ధితో కూడిన అంతర్మథనం కనిపిస్తుంది. అనతికాలంలోనే ఇలాంటి అధివాస్తవిక ధోరణి నుంచి బయటపడి, దళిత ఆత్మగౌరవ పోరాటపథంలో అయిలయ్య అచ్చమైన దళిత కవిగా రూపాంతరం చెందారు.
‘నిప్పు కణిక’ దళిత దీర్ఘకవితతో వర్తమాన సాహిత్యంలో రవ్వలు రాల్చారు అయిలయ్య. ‘ఎవడి హక్కుల పక్కరా ఈ నేల? / ఎవడి కాపలా కుక్కరా ఈ చరిత’ అంటూ ఆధిపత్య భావజాలానికి అక్షరాల మంటపెట్టారు. దళితుల చారిత్రక, సాంస్కృతిక విశిష్టతను ఈ దీర్ఘకవితలో ప్రతిభావంతంగా అయిలయ్య దృశ్యమానం చేశారు. ‘మా ఉనికి నాగరికత/మా అస్తిత్వం మానవత్వం’ అంటూ నాగరికత నిర్మాతలు ముమ్మాటికీ అణగారిన ప్రజలేనని అయిలయ్య తాత్త్విక బంధురంగా నిర్ధారించారు. దళితుల శ్రమ ఔన్నత్యానికి నీరాజనాలు పలికారు. వ్యవసాయ సంస్కృతికి మూల కారకులు దళితులేనని చాటిచెప్పారు.
‘శరీరాల్ని యుద్ధభూములుగా, హృదయాల్ని సైనిక శిబిరాలుగా చేసి, ప్రజ్వలించి, దగ్ధమై కాంతిపుంజమై పొమ్మని’ నిప్పుకణిక దీర్ఘకవితతో అయిలయ్య ప్రేరేపిస్తున్నారని మద్దూరి నగేష్బాబు ఇచ్చిన కితాబు ఎంతో విలువైనది. కె.దామోదర్రావు అనువాదంతో ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ఒకేసారి ప్రచురితమైన ఈ ‘నిప్పుకణిక’ దళిత దీర్ఘ ద్విభాషా కవితను సాహిత్యంలో విలక్షణ ప్రయోగంగా పేర్కొనవచ్చు. కవిగా మంచి గుర్తింపు వస్తున్న తరుణంలో అయిలయ్య విమర్శ, పరిశోధన వైపు దృష్టి సారించారు. అనునిత్యం అధ్యయనం, అధ్యాపనాల్లో మునిగిపోవడం వల్ల, వృత్తిగతమైన, విద్యావిషయకమైన అవసరాలకు అనుగుణంగా చాలామంది ఆచార్యుల్లాగే అయిలయ్య కూడా సాహిత్య విమర్శ దిశగా సాగిపోయారు. ‘తెలుగు కవిత అభినవ దృక్పథం’, ‘సవ్వడి’, ‘సాహితీ కిరణాలు’, ‘సాహితీ వాహినీ’ వంటి వైవిధ్యమైన వ్యాస సంకలనాలతో విమర్శకునిగా అయిలయ్య సమకాలినుల మన్ననలు అందుకున్నారు.
మలిదశ తెలంగాణ ఉద్యమం తెలుగు భాషా సాహిత్య మూలాలను పునర్నిర్వచించింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాధాన్యత కోల్పోయిన తెలంగాణ సాహిత్య తీరుతెన్నులను ఈ ప్రాంత రచయితలు ఈనాడు ప్రత్యేకంగా అధ్యయనం చేసి అనేక కొత్త అంశాలను ప్రతిపాదిస్తున్నారు. ఈ బృహత్తర కార్యాచరణలో బన్న అయిలయ్య కూడా గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ సాహిత్య విమర్శ వికాసానికి విశేషంగా కృషిచేస్తున్నారు. ‘తెలంగాణ సాహిత్య సాంస్కృతిక చైతన్యం’, ‘తెలంగాణ సాహిత్య సంస్థలు’, తెలంగాణ పీఠికలు, ‘తెలంగాణ కథ -పరామర్శ’ లాంటి విమర్శ గ్రంథాలను ఆయన వెలువరించారు.
తెలుగు కథ కంటే భిన్నంగా తెలంగాణ కథల్లో ప్రతిఫలించిన ప్రాదేశిక లక్షణాలను, భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక స్థితిగతులను పరిశోధనాత్మకంగా విశ్లేషించారు అయిలయ్య. కాలువ మల్లయ్య కథలతో పెనవేసుకున్న తెలంగాణ జీవితాన్ని, ఉద్యమ ప్రభావాన్ని ఆయన ఎంతో దార్శనిక దృష్టితో విశదీకరించారు. తొలిదశ తెలంగాణ ఉద్యమ వెలుగుల్లో ప్రజాకవి కాళోజీ కవిత్వ స్వరూప స్వభావాలను సముచితంగా వివేచించారు. వేర్వేరు కాలాల్లో, రెండు విభిన్నమైన సామాజిక సమస్యల కేంద్రంగా వెలువడిన కన్యాశుల్కం, వరవిక్రయం నాటకాల్లోని రచనా వైవిధ్యాలను సూక్ష్మ పరిశీలనతో పరామర్శించారు. అయిలయ్య వందకిపైగా పరిశోధనా వ్యాసాలకు సారథ్యం వహించారు. మట్టిలో మాణిక్యాలను వెలికితీసి కవులుగా, రచయితలుగా తీర్చిదిద్దారు. పరిశోధకునిగా మాత్రమే కాకుండా సంపాదకుడిగా కూడా అయిలయ్య కృషి చేశారు. తెలుగు సాహిత్య పరిశోధనకు, విమర్శకు ఉపయోగపడే పలు గ్రంథాలను, సంకలనాలను తన సంపాదకత్వంలో ప్రచురించారు. పాఠశాల నుంచి కళాశాల స్థాయి వరకు తెలంగాణ సోయితో తెలుగు పాఠ్యగ్రంథాలను రూపొందించడంలో ఆయా పుస్తకాలకు సంపాదకుడిగా అయిలయ్య అత్యంత కీలకపాత్ర పోషించారు. చేపట్టిన సాహిత్య కార్యక్రమాలను అంకితభావంతో పూర్తిచేసిన నిత్య సాహిత్య చైతన్య స్ఫూర్తి ఆచార్య బన్న అయిలయ్య.
(ఈ నెల 28న వరంగల్ కాకతీయ విశ్వ విద్యాలయంలో జరగనున్న ఆచార్య బన్న అయిలయ్య సాహిత్య సమాలోచన సందర్భంగా)
(వ్యాసకర్త: ప్రభుత్వ సిటీ కళాశాల తెలుగు శాఖ అధ్యక్షులు)
-డా. కోయి కోటేశ్వర రావు
94404 80274