రాక రాక వచ్చిన చుట్టంతో కడుపులో ఉన్న ఎతనంతా చెప్పుకున్నంత సాదాసీదాగా సూటిగా కథ చెప్పడం దేవేంద్ర ప్రత్యేకత. కొందరి కథలు చదువుతుంటే ఏవో ఊహలోకాల్లోకి వెళ్లినట్టుగా, పరిచయం లేని జీవితాలను చూసినట్టుగా అనిపిస్తుంది. కాని దేవేంద్ర కథలు చదువుతుంటే అనుభవాలను పంచుకున్నట్టుగానే అనిపిస్తుంది. చిన్నతనంలోనే చదువును ఆపేసి పెండ్లి
చేసుకొని పట్నం వెళ్లిన ఆమె ప్రొఫెసర్ స్థాయికి ఎదగడం, ప్రైవేట్గా చదువుతూ డాక్టరేట్ పూర్తి చేయడం వెనుక వున్న ఒక సంఘర్షణ, జీవితంతో ఆమె చేసిన పోరాటం కథల్లో కనిపిస్తుంది.
ఈ 11 కథల్లో విభిన్న అంశాలు, విభిన్న జీవితాలమీద కథలున్నాయి. అంశం ఏదైనా అంతర్లీనంగా కథాసారం జీవితాన్ని గెలుచుకోవడమే.
రచయిత్రి అధ్యాపక వృత్తిలో ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీతో, తెలంగాణ ఉద్యమంతో అవినాభావ సంబం ధం ఉంది. అందుకే తన కథల్లో ఎక్కువగా ఆ నేపథ్యాన్ని తీసుకుంది. ‘కొత్త పల్లి’ కథ ఎంసీఏ చదివిన ఓ నవీన్ కథ. తండ్రి చిన్నప్పుడే చనిపోతే తల్లి కష్టపడి అప్పుచేసి చదివించింది. ఎదిగిన నవీన్ ఉద్యోగం చేస్తూ చెల్లెలి ఆరోగ్యం కోసం తల్లికి ఆసరాగా నిలబడే కథ. సంకల్పం కథ నాగరాజు అనే దళిత యువకునిది. చదువొక్కటే మనల్ని ఉన్నతులను చేయగలదన్న వాస్తవాన్ని చెప్పిన కథ. తండ్రి చనిపోవడంతో మేనమామ సహకారంతో చదువుకొన్న నాగరాజు.. తాను మాత్రమే కాదు తనలా ఊరంతా ఎదగాలని తనకున్న భూమిలో లైబ్రరీని నెల కొల్పాలని నిర్ణయించుకుంటాడు. నేటియువతకు స్ఫూర్తినిచ్చే కథ ఇది. ‘నారుమడి’ కథ కూడా తన చదువును గ్రామంలోని పేదరైతులకు ఉపయోగించాలనే తపన ఉన్నయువకుడు తిరుపతి కథ. అగ్రికల్చర్ డిగ్రీ చదువుతూ తన జ్ఞానాన్ని గ్రామంలోని రైతులకోసం, సేంద్రియ సాగుకోసం వినియోగించాలని నిర్ణయించుకుంటాడు తిరుపతి. నవీన్, నాగరాజు, తిరుపతి బహుజన కులాలలోంచి ఎదిగినవారు. వీరి జీవితం వడ్డించిన విస్తరేం కాదు. చాలా కష్టపడి చదువుకుని జీవితాన్ని గెలుచుకున్నారు. సమాజానికి ఈస్ఫూర్తి ఎంతో అవసరం.
సుదర్శన చక్రం ఒక సామిల్ వ్యాపారి ఒడుదొడుకుల జీవితం గురించి చెబుతుంది. కథ ఆ ఒక్కమనిషిదే అయినా ఇది అందరికీ స్ఫూర్తినిచ్చే కథ. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఎదురైనా, కళ్లముందు కన్న కూతురు, అల్లుడు చనిపోయినా, ఆర్థికంగా దిగజారినా, చివరికి ఒక సామిల్లులో జీతం ఉన్నా గుండెనిండా దుఃఖాన్ని బిగబట్టుకొని ధైర్యంగా ముందుకు నడిచి మళ్లీ పూర్వవైభవాన్ని సాధించుకున్న సుదర్శనం జీవితం అందరికీ ఒక పాఠం. ఒక నవలంత జీవితాన్ని కథలో చెప్పారు రచయిత్రి.
కులవృత్తుల్లో ఆడవారి భాగస్వామ్యం ఉన్నా వాళ్ళు ఎక్కువగా కొన్ని పనులకే పరిమితం అవుతారు. ‘వెండిగిన్నె’ కథలో అవుసుల సునంద మాత్రం అలాకాదు. తండ్రి కళను తాను నేర్చుకొని తీరొక్క నగలు చేస్తూ జీవితం గడిపింది. కుటుంబాన్ని నిలిపింది. తన కొడుకు తరం వచ్చేసరికి కులవృత్తి కడుపు నింపలేదని తెలుసుకొని.. బాగా అలోచించి దాచుకున్న నగల్ని అమ్మేయాలనుకుంది. అలా అమ్ముతున్నప్పుడు ఆమె పడే బాధ మనల్ని కలిచివేస్తది.
చదువుకుని జీవితంలో స్థిరపడాలన్న ఆలోచనతో ఉన్న ఇప్పటి కోడలు తరానికి, నా చెప్పు చేతల్లో సంసారం ఉండాలన్న అప్పటి అత్త తరానికి ఉన్న అంతరాలను చెప్పిన కథ ‘వసుధ’. అటు భార్యని ఇటు తల్లిని ఏమనలేక నలిగిపోయే రవి.. మధ్యతరగతి భర్తలకు ప్రతీకగా కనిపిస్తాడు. పంతాలకు పోయి చిన్న సమస్యను పెద్దగా మార్చి జీవితాన్ని అల్లకల్లోలం చేసుకోవద్దని చెప్పిన తీరు అలోచనాత్మకంగా బాగుంది. ‘రంగయ్య’ కథ.. కరోనా వైరస్ మానవ సంబంధాలను ఎంత దెబ్బతీసిందో తెలుపుతుంది. ఒకప్పుడు పల్లెలకు విద్యాగంధం అద్దింది బట్టు పంతుళ్లు, కాన్గీరు బడులే. గురుపౌర్ణమి రోజున ఓ గురువు కోసం శిష్యులు చేసిన ప్రయత్నం ‘కాన్గీరు బడి’ కథ. అప్పటి ఏకోపాధ్యాయ బడులు ఎలా నడిచేవో తెలిపి మన బాల్యాన్ని, మరిచిపోయిన మన గురువులను గుర్తు చేసిన కథ ఇది.
ఇది దేవేంద్ర మొదటి కథల సంపుటి. ఆమెకు రాయాల్సినంత జీవితం ఉంది. రాయాలనే తపన ఉంది. రాసే నేర్పు పరిశీలన ఉంది. ఆలోచనలకు పదునుపెట్టి మరింత అద్యయనం చేస్తే మరిన్ని మంచి కథలు రాయగలదు. ముందుముందు మరింత లోతుగా జీవితాల్లోని విభిన్న సంఘర్షణలను చిత్రిస్తుందని ఆశిస్తూ…..
-పెద్దింటి అశోక్ కుమార్
94416 72428