అనగనగా ఓ అబ్బాయి. స్వాతంత్య్రానికి ఏడాది ముందే పుట్టాడు. తనది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం. టీచరుగా పనిచేసే తండ్రి, ఎనిమిది మంది పిల్లలున్న ఆ ఇంటి భారాన్ని గుంభనంగా భరించేవారు. త్యాగం, కష్టం, శ్రమ లాంటి విలువలతో పెరిగాడు. పదో తరగతి వరకు మాతృభాష మాధ్యమంలోనే చదివాడు. తనను సివిల్ సర్వెంట్గా చూడాలన్నది తండ్రి కల.
కానీ తను మాత్రం, ఇంజినీరింగ్ వైపు అడుగులు వేశాడు. అప్పుడప్పుడే కనిపిస్తున్న కంప్యూటర్తో దోస్తీ కట్టాడు. రకరకాల ఉద్యోగ ప్రయత్నాల తర్వాత భార్య ఇచ్చిన పదివేల రూపాయలతో ఓ కంపెనీ పెట్టాడు. ఇప్పుడు ఆ సంస్థ దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థగా ఎదిగింది. పద్మశ్రీ, పద్మవిభూషణ్ లాంటి బిరుదులు… ఏకంగా యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రే తన అల్లుడు అనే హోదా… సాఫ్ట్వేర్ చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన వ్యాపారస్తులలో ఒకరిగా గుర్తింపు అన్నీ తనకు ఉన్నాయి. ఈపాటికే అర్థమై ఉంటుంది. ఇదంతా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కథ అని. ఇప్పుడిక ఉపకథ. భార్య సుధామూర్తిలా తరచూ వేదికల మీద కనిపించని నారాయణమూర్తి, ఆమధ్య ఓ పాడ్కాస్టులో మాట్లాడుతూ వారానికి కనీసం 70 గంటలు పనిచేయడం ఇప్పటి యువత బాధ్యత అన్నారు. ఆ మాటలు సామాజిక మాధ్యమాల్లో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఇంతకీ ఎన్ని గంటల పనిగంటలు సబబు???
మోహన్దాస్ పాయ్ ఇన్ఫోసిస్ మాజీ సీఈవో. ఈమధ్య ఆయన నారాయణమూర్తితో ఓ పాడ్కాస్ట్ చేశారు. అందులో మూర్తి మాట్లాడుతూ- ‘ఇతర దేశాలతో పోలిస్తే భారతీయుల ఉత్పాదక శక్తి చాలా తక్కువ. ఆ లోపాన్ని అధిగమించకపోతే, మనం అభివృద్ధి సాధించలేం’ అనేశారు. అంతేకాదు ‘రెండో ప్రపంచ యుద్ధం తర్వాత కొన్నాళ్లపాటు జర్మనీ, జపాన్ దేశస్తులు అదనపు గంటలు పనిచేయడం వల్లే ఆయా దేశాలు నిలదొక్కుకున్నాయి’ అని వక్కాణించారు. సహజంగానే ఈ 70 గంటల మాటలు వైరల్ అయ్యాయి. కొంతమంది సమర్థన, మరికొందరి విభేదం వినిపించాయి.
ఈ చర్చకు బదులిస్తూ మూర్తి ‘పేదరికం అనే విషవలయం నుంచి తప్పించుకోవాలి అంటే కష్టపడి పనిచేయాల్సిందే అని మా తల్లిదండ్రులు చెప్పేవారు. అది ఆచరించిన తర్వాతే నేను 70 గంటల పనివారాన్ని సూచించాను. చాలా ఏళ్లుగా నేను వారానికి 85-90 గంటలు పనిచేస్తూనే వచ్చాను. పొద్దున 6.20 కల్లా ఆఫీసుకు వెళ్లి, రాత్రి 8:30 తర్వాతే బయటకు వచ్చేవాడిని’ అని చెప్పుకొచ్చారు. తన వ్యాఖ్యలను అభినందిస్తూ చాలా ఫోన్ కాల్స్ వచ్చాయనీ… చాలామంది మంచి వ్యక్తులూ, ప్రవాసులు తన వ్యాఖ్యలను సమర్థించారని అన్నారు.
భర్తకు అండగా నిలిచే సుధామూర్తి ఈ వ్యాఖ్యల విషయంలోనూ భర్తను బలపరిచారు. వారానికి 70 గంటలు పనిచేసే అలవాటు తమ కుటుంబం అంతా ఉందని చెప్పారు. ఈ 70 పనిగంటల వ్యాఖ్య ఎవరో చేసి ఉంటే మాధ్యమాలు పెద్దగా పట్టించుకునేవి కావు. కానీ అన్నది ఇన్ఫోసిస్ మూర్తిగారు కావడంతో… చర్చ మొదలైంది. ఆఖరికి పార్లమెంటులో సైతం దీని గురించి ప్రస్తావన వచ్చింది. తెలుగు రాష్ర్టాలకు చెందిన పార్లమెంట్ సభ్యులు… ఈ 70 గంటల పనివారాన్ని ప్రభుత్వం ఓ నిబంధనగా మార్చే ఉద్దేశం ఏమన్నా ఉందా అని అడిగే దాకా వచ్చింది.
Narayana Murthy
కార్మిక చట్టం ఏమంటున్నది?
2022లో సవరించిన మన దేశ కార్మిక చట్టం ప్రకారం… సాధారణ పరిస్థితుల్లో వారానికి 48కి మించిన పని గంటలు ఉండకూడదు. భోజన విరామంతో కలిపి రోజుకు 9 గంటలు దాటకూడదు. అంటే ఉద్యోగి తినే సమయాన్ని అతని వ్యక్తిగత ఖాతాలోనే జమచేస్తారే కానీ కంపెనీ లెక్కల కిందకు రాదు. ఒకవేళ రోజుకు తొమ్మిది గంటల పనివేళలు దాటితే… అదనపు గంటలకు రెట్టింపు జీతం ఇవ్వాలి. మూర్తిగారు చెప్పిన 70 గంటలతో పోలిస్తే ఈ 48 గంటలు తక్కువగానే కనిపించవచ్చు.
కానీ చాలా దేశాలతో పోల్చుకుంటే ఇది ఎక్కువే. ఎంతో మంది ఆదర్శంగా చూసే అమెరికా, చైనాల్లో ఇది 40 గంటలు మాత్రమే. జర్మనీ, జపాన్, దక్షిణ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనూ ఇది 40 గంటలే. ఆస్ట్రేలియాలో అయితే 38 గంటలు. చాలా దేశాలు తమ పని గంటలను 40 గంటలకు తగ్గించుకోవడానికి ఓ ముఖ్య కారణం- కరోషి! అంటే జపాను భాషలో… ఎక్కువ పని చేయడం వల్ల సంభవించే మరణం! ఎక్కువ పని వల్ల కలిగే ఒత్తిడితో గుండెపోటు, పక్షవాతం, పోషకాహార లోపం లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ… ఇది ఒక్కోసారి ఆత్మహత్యలకు సైతం దారితీస్తున్నదని తేలింది. ఉదాహరణకు స్వీడన్లోనే ఓ ఏడాది 770 మంది అధిక పని వల్ల కలిగిన ఒత్తిడితో ఆత్మహత్య చేసుకున్నారని ఓ వార్త. చైనాలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని అక్కడి ప్రభుత్వమే ఒప్పుకొని, పనిగంటల్లో వెసులుబాటు కల్పించే చర్యలు మొదలుపెట్టింది.
పని గంటలు అంటే!
ఓ కార్మికుడు లేదా ఉద్యోగి పని చేసే ఉత్పాదక సమయాన్ని మాత్రమే పని గంటలుగా భావిస్తాం. కానీ, తను భోజనం చేసే సమయం, ఆఫీసుకు వెళ్లి వచ్చే ప్రయాణం ఈ లెక్కలోకి రాదు. నగరాల్లో ఆఫీసుకు వెళ్లాలి అంటే రానుపోను రెండు గంటలు పడుతుంది. ఇక మన దేశంలో కనిపించే మరో ప్రత్యేక విధానం… ఇంటికి వెళ్లిన తర్వాత కూడా ఆఫీసుకు సంబంధించిన బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడం. సాఫ్ట్వేర్ ఉద్యోగులు అయితే జూమ్ కాల్స్, మెయిల్స్ ద్వారా పగలూరాత్రి తేడా లేకుండా విధులకు అందుబాటులో ఉండాలి.
ఇక వాట్సాప్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నిరంతరం ఆఫీస్ సందేశాలకు స్పందించాల్సిన పరిస్థితి. ఎప్పుడన్నా సెలవు తీసుకోవాలంటే, ఆ రోజుల్లో చేయాల్సిన పనులను ముందుగానే ముగించి వెళ్లాలి. ఇవన్నీ కూడా విధి నిర్వహణలో భాగంగా పరిగణిస్తే… చాలామంది జీవితాలు 70 గంటల పరిధిని దాటిపోతాయేమో! పాశ్చాత్య దేశాల్లో ఇలాంటి పరిస్థితి కనిపించదు. ఆఫీసు వేళల తర్వాత స్పందించడం, సెలవుల్లో కూడా అందుబాటులో ఉండటాన్ని అక్కడి ఉద్యోగులు ఇష్టపడరు.
ఉద్యోగుల వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టేందుకు యాజమాన్యాలు కూడా జంకుతాయి. ‘ఆఫీసు నుంచి బయటికి వెళ్లిన తర్వాత ఓ ఉద్యోగి తన ఫోన్ తీయకపోతే, అది బాధ్యతారాహిత్యం కిందకు రాదు’ అని ఫ్రాన్స్ ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. దీన్నే ‘రైట్ టు డిస్కనెక్ట్’ అంటున్నారు. ఈ పేరుతో చట్టాలు కూడా రూపొందుతున్నాయి.
నిజమైన పని గంటలు ఎలా ఉన్నాయి!
ఒక వ్యక్తితో వారానికి ఎన్ని గంటలు పనిచేయించుకోవచ్చో ప్రభుత్వం చెప్పే నిబంధనలు అటుంచుదాం. అసలు నిజంగా మన భారతీయులు ఎంత పని చేస్తున్నారో గమనిస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రపంచంలోనే ఎక్కువ పనిగంటలు నమోదయ్యే దేశాలలో మనది 7వ స్థానం. మనం వారానికి సగటున 47.7 గంటలు పనిచేస్తున్నామన్నది ఆ సంస్థ నివేదిక. అమెరికా, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలే కాదు… చైనా, సింగపూర్, జపాన్ లాంటి ఆసియా సోదరుల కంటే కూడా మనం ఎక్కువ పనిచేస్తున్నాం.
ఈ జాబితా గమనిస్తే కనిపించే మరో ఆశ్చర్యకరమైన విషయం… ఇందులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రథమ స్థానంలో ఉండటం. అక్కడ పనిచేసే కార్మికులలో ఎక్కువ శాతం భారతీయులే కావడం గమనార్హం! ఇక క్లాకిఫై అనే సంస్థ గణాంకాల ప్రకారం ఒక ఏడాదిలో భారతీయులు 2,480 గంటలు పనిచేస్తున్నారు. అమెరికా (1892), జపాన్ (1903), చైనా (2392) తదితర దేశాల కంటే ఇది చాలా ఎక్కువ. ఈ గణాంకాల నేపథ్యంలో వినిపించే మరో విశ్లేషణ ఏమిటంటే… ఒక దేశం ధనికంగా మారుతున్న కొద్దీ, అక్కడి పనిగంటలు తగ్గుముఖం పట్టడం! ఓ వ్యక్తి ఉత్పాదకత వల్ల తగినంత ఆదాయం సమకూరడమే ఇందుకు కారణం.
వివాదాస్పదమైన 996 విధానం
ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజుల పాటు పనిచేయడమే ఈ 996 విధానం. చైనాలో చాలా ఫ్యాక్టరీలు, సాఫ్ట్వేర్ సంస్థలు అనుసరించే ఈ విధానంతో అక్కడి ఉద్యోగులు నలిగిపోయారు. చిన్నవయసులో అకస్మాత్తుగా చనిపోవడం, ఒత్తిడితో ఆత్మహత్య చేసుకోవడం సహజంగా మారాయి. ఓ డెలివరీ సంస్థలో పనిచేసే ఉద్యోగి నిప్పంటించుకుని చనిపోయాడంటే, ఈ విరక్తి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అక్కడి సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఏకంగా 99 శాతం మంది తాము ఏదో ఒక ఆరోగ్య సమస్యను ఎదుర్కొంటున్నామని చెప్పారు.
ఇదంతా గమనిస్తున్న అక్కడి యువత ఓ రకమైన నైరాశ్యంలోకి జారిపోయి… అవసరానికి మించిన పని చేయకూడదు అని నిశ్చయించుకుంది. ఈ ట్రెండ్కి ‘Lie Flat’ అని పేరు. ఈ 996 విధానానికి అక్కడి పారిశ్రామికవేత్తలు మద్దతు పలకడం విశేషం. సహజం కూడా! ప్రముఖ వ్యాపారవేత్త జాక్మా, ఈ 996 విధానాన్ని యువత పాలిట వరంగా పేర్కొన్నారు. Pinduoduo లాంటి సంస్థలు ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా… ఈ 996 విధానాన్ని కఠినంగా అమలు చేస్తున్నట్టు తేలింది.
ఈ 996 పద్ధతితో అసలుకే మోసం వస్తున్నట్టు గ్రహించిన చైనా ప్రభుత్వం గత కొన్నేళ్లుగా, సదరు కంపెనీలను హెచ్చరించడం మొదలుపెట్టింది. అన్నట్టు ఓ ఉద్యోగి ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు 6 రోజుల పాటు కంపెనీలో ఉంటే 72 గంటల లెక్క తేలుతుంది. రోజుకు గంట చొప్పున భోజన, టీ విరామాలను ఇందులోంచి తీసేస్తే 72-6 = 66 పని గంటలు! అంటే నారాయణ మూర్తి సూచించిన 70 గంటలకు ఇంకా తక్కువే!
లాభాలు లేవని కాదు!
ఉద్యోగుల కోణం నుంచి చూస్తే ఈ 70 పని గంటల సలహా కాస్త కటువుగా ఉండవచ్చు. అలాగని అది నిర్హేతుకం కాకపోవచ్చు. మరీ ముఖ్యంగా నారాయణమూర్తి లాంటి వ్యక్తి నుంచి వచ్చినప్పుడు, దాని లాభాలను గమనించకుండా కొట్టిపారేయలేం. ఆయన చెప్పినట్టు జపాన్, జర్మనీలు దేశాన్ని పునర్నిర్మించుకునే దశలో చాలా ఎక్కువ గంటలే పనిచేశాయి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక స్థానానికి ఎదుగుతున్న దశలో, మన దేశ యువత నుంచి కూడా అలాంటి పనిని ఆశించడంలో తప్పులేదు.
చదువు పూర్తయి కుటుంబ బాధ్యతల్ని ఇంకా తలకెత్తుకోని దశలో ఉన్న యువకులు, కాలక్షేపం చేసే కంటే పని మీద శ్రద్ధ పెడితే… కొంతకాలానికి మంచి స్థాయికి చేరుకుంటారు. ఇక సొంత స్టార్టప్ ఆరంభించేవారు, ఓ కంపెనీ ఆరంభం నుంచి పనిచేసేవారు… దాన్ని విజయవంతం చేసేందుకు ఎన్ని గంటలు వెచ్చించినా సరిపోదు. ఎక్కువ పని గంటల వల్ల కొత్తకొత్త నైపుణ్యాలు అలవడే అవకాశం ఉంటుంది, పనిలో ఉండే ప్రతీ సవాలూ అర్థమవుతుంది, ఆర్థికంగానూ లాభాలు ఉంటాయి, యాజమాన్యం దృష్టిలో ఉంటారు! తమను తాము ఎలాగైనా నిరూపించుకోవాలి అనుకునేవారికి, కంపెనీ సీఈవోలకి 70 గంటల పనివారం ఓ మంచి అవకాశమే!
అమ్మల మీద ప్రభావం!
ఉద్యోగాలలో స్త్రీ పురుష సమానత్వం గురించి ఎంత చెప్పుకొన్నా… క్షేత్ర స్థాయిలో ఉన్న సవాళ్లు వేరు. మగవారు రోజుకు 18 గంటలు ఆఫీసులో గడిపినా, ఇంటి మీద అంత ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చు కానీ పిల్లలున్న మహిళల సంగతి అలా కాదు. ఉద్యోగంతోపాటు ఇంటినీ, పిల్లలనూ చూసుకోవాల్సిన పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ఇప్పటికే కెరీర్ కొనసాగించే తల్లుల పట్ల కనిపించని వివక్ష ఉందని ఎన్నో నివేదికలు తేల్చాయి.
ఉద్యోగావకాశాల దగ్గర నుంచి పదోన్నతుల వరకు వారిని కాస్త తక్కువగా ఎంచుతారని ఇవి స్పష్టం చేస్తున్నాయి. వీటికి మదర్ హుడ్ పెనాల్టీ, మెటర్నల్ వాల్ లాంటి పేర్లు సైతం పెట్టారు. ఇక వారానికి 70 గంటలు పనిచేయాలనే అనధికారిక నిబంధన వీరి మీద చూపించే ప్రభావం అంత సానుకూలం కాదన్నది విశ్లేషకుల అంచనా!
ఈ 70 పనిగంటల చర్చ అంత తేలికగా ముగిసేది కాదు. ఉద్యోగులతోపాటు వైద్య నిపుణులు కూడా దీని పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ‘నీకంటూ ఓ సామాజిక జీవితం ఉండదు. కుటుంబంతో గడిపేందుకు, వ్యాయామం చేసేందుకు, సేద తీరేందుకు సమయం ఉండదు. ఇక ఇంటికి వచ్చాక కూడా గమనించుకోవాల్సిన కాల్స్, మెయిల్స్ గురించి చెప్పనక్కర్లేదు. మరి చిన్న వయసులోనే గుండెపోట్లు రావడంలో ఆశ్చర్యం ఏముంది?’ అంటారు దీపక్ కృష్ణమూర్తి అనే హృద్రోగ నిపుణులు. ‘నారాయణమూర్తిగారు 70 గంటలు అన్న ఉద్దేశం వేరు.
40 గంటలు కంపెనీ కోసం పనిచేయాలి, 30 గంటలు మనల్ని మనం మెరుగుపర్చుకునేందుకు పనిచేయాలి’ అని విశ్లేషించారు టెక్ మహింద్రా మాజీ సీఈవో సి.పి. గుర్నాని. ఏదేమైనా, ఓ వ్యక్తి ఒత్తిడితో కాకుండా నిబద్ధతతో, వారానికి 70 గంటలు సంతోషంగా పనిచేయాలి అంటే… తన ఎదుగుదల కూడా ఉంటుందన్న భరోసా ఉండాలి. మధ్యమధ్యలో విరామం తీసుకునేందుకు, సేద తీరేందుకు తగిన సౌకర్యాలు ఉండాలి. అదనపు పని గంటలకు ఆర్థికంగా ప్రతిఫలం ఉండాలి. పని ఒత్తిడి నుంచి సేద తీరేందుకు తగినన్ని సెలవులు అందించాలి.
ఇవన్నీ కనుక ఓ సంస్థ అందించగలిగితే 70 గంటల పని చేసేందుకు యువత సిద్ధంగానే ఉంటుంది. ఓ సీఈవో తన సంస్థ కోసం పనిచేయడం వేరు. అది తన ప్రాణం, తన భవిష్యత్తు, తన కసి. కానీ ఓ ఉద్యోగి తన వ్యక్తిగత సుఖసంతోషాలను పణంగా పెట్టి, విలువైన వయసును కరిగించి తను పనిచేసే కంపెనీ కోసం 70 గంటలకు మించి పనిచేయాలి అంటే… అందుకు తగిన వాతావరణం, ప్రతిఫలం సంస్థ నుంచి ఆశించడంలో తప్పు లేదు. అన్నిటికీ మించి ఎంతసేపు పని చేశాం అనే ప్రశ్న కంటే ఎంత నైపుణ్యంగా, సమర్థంగా పనిచేశాం అనేదే పని విలువను నిర్ణయిస్తుంది!
ఉత్పాదక శక్తి తక్కువే!
ఒక వ్యక్తి ఉత్పత్తి చేసే వస్తువుల లేదా అందించే సేవల విలువను Workforce Productivity అంటారు. మన దేశంలో సగటు ఉత్పాదక శక్తి తక్కువగా ఉందన్నది నారాయణమూర్తి గారి మాట. నిజానికి ఈ ఉత్పాదక శక్తి చాలా విషయాల మీద ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా ఆ దేశపు ఆర్థిక వ్యవస్థే ఆ విలువను నిర్ణయిస్తుంది. తక్కువ జనాభా, ఎక్కువ వనరులు ఉన్న నార్వే, స్విట్జర్లాండ్లో అది ఎక్కువగా ఉంటుంది.
ఎంత శ్రమించినా తక్కువ ప్రతిఫలం లభించే దేశాలలో సహజంగానే అది తక్కువగా ఉంటుంది. ఉదాహరణకు చైనాలో ఒక ఐఫోన్ తయారుచేసేందుకు అయ్యే ఖర్చు కేవలం పది డాలర్లే అనే వార్త ఈమధ్య కాలంలో సంచలనం సృష్టించింది. అదే ఐఫోన్ను అమ్మడం వల్ల అమెరికా కొన్ని వందల డాలర్లు సంపాదిస్తుంది. ఉత్పత్తి విలువ తక్కువ ఉన్నచోట జీతాలు కూడా తక్కువగానే ఉంటాయి. చాలా సాఫ్ట్వేర్ సంస్థలు, తమ సేవలను ఔట్సోర్సింగ్ చేయడానికి ముఖ్య కారణం ఇదే!
తమిళనాట ఓ విఫల యత్నం
గత ఏడాది ఏప్రిల్లో తమిళనాడు ప్రభుత్వం ఓ వివాదాస్పద చట్టానికి రూపకల్పన చేసింది. రోజువారీ పనివేళలను 8 గంటల నుంచి 12 గంటలకు పెంచడం ఈ చట్టం ఉద్దేశం. ఇలా చేయడం వల్ల యువతకు ఎక్కువ ఉపాధి లభిస్తుందనీ, రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులు వస్తాయనీ చెప్పుకొచ్చింది ఆ ప్రభుత్వం. శాసనసభలో అధికార పార్టీకి మంచి మెజారిటీ ఉండటం వల్ల, మూజువాణి ఓటుతో ఆ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. ఈ విషయం వార్తల్లో రాగానే, కార్మిక వర్గాలు భగ్గుమన్నాయి. అసలే అరకొర జీతాలు, అదనపు సౌకర్యాలేవీ లేని ఉద్యోగాలు. ఈ నేపథ్యంలో పనిచేసే ఫ్యాక్టరీ కార్మికుల సగం రోజును పనిగంటలుగా మార్చడం ఏమిటంటూ… నిరసన వ్యక్తమైంది. దాంతో మూడు రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
లే ఆఫ్స్ సంగతేంటి?
తనకు నచ్చిన కంపెనీలో భవిష్యత్తు ఉంటుందనే భరోసా, ఎదిగే అవకాశం ఉంటుందనే ఆశ ఓ వ్యక్తిని ఎన్ని గంటలపాటైనా పనిచేయిస్తాయి. కానీ, సాఫ్ట్వేర్ రంగంలో ఆ నమ్మకం సన్నగిల్లుతున్నదనే భయం ఉంది. గతేడాది ప్రపంచవ్యాప్తంగా 2.6 లక్షల మందిని తొలగించారు. ఇన్నేసి తొలగింపులకు ముఖ్య కారణం నష్టాలు మాత్రమే కాదు. సంస్థలో అవసరానికి మించి ఉద్యోగులు ఉన్నారనే భావన, కృత్రిమ మేధతో రాబోయే రోజుల్లో మనుషుల అవసరం తగ్గుతుందనే అనుమానం… ఈ లే ఆఫ్స్కి ప్రధాన కారణం. 2023లో ఇన్ఫోసిస్ సైతం 24,182 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికినట్టు ప్రముఖ వార్తా సంస్థలు పేర్కొన్నాయి.
పని రోజులు తగ్గించే ప్రయత్నాలు
ఓ పక్క వారానికి 70 రోజులు పనిచేయాలని నారాయణమూర్తి లాంటి కార్పొరేట్ నాయకులు కోరుకుంటూ ఉంటే… మరోవైపు తమ దేశంలో పనిగంటలు, పనిదినాలు తగ్గాలని వేర్వేరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. పోటీతత్వం, కఠినమైన పని వాతావరణంతో విసుగెత్తిన జపాన్ ప్రజలు… నైరాశ్యంలో మునిగిపోతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ప్రభుత్వం అక్కడి ఉద్యోగులకు నాలుగు రోజుల పనివారాన్ని అమలు చేసే ప్రయత్నంలో ఉంది.
అంతేకాదు! పనిచేసే వాతావరణంలో జిమ్ లాంటి సౌకర్యాలు కల్పించాలని అటు యాజమాన్యాలనీ, సెలవులను కచ్చితంగా వినియోగించుకోమని ఇటు ఉద్యోగులను కోరుతున్నది. జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్స్ తదితర దేశాల్లో వారానికి సగటు పనిగంటలు 35 కంటే తక్కువగా ఉన్నాయి. ఉత్తర అట్లాంటిక్, ఉత్తర ఐరోపాలోని కొన్ని దేశాల్లోని ప్రజల్లో సంతోషపు స్థాయి ఎక్కువని హ్యాపీనెస్ ఇండెక్స్ లాంటి నివేదికలు చెబుతున్నాయి. అందుకు ఒక ముఖ్యకారణం… వారి వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీయని విధంగా పనిగంటలు, పని వాతావరణం ఉండటమే అని చెబుతారు.
…? కె.ఎల్. సూర్య