ఓ కార్పొరేట్ సంస్థను గానీ, పరిశ్రమను గానీ ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ర్టానికి తరలించాలంటే ఎంత శ్రమ! యంత్రాలు, పరికరాలు అన్నీ భద్రంగా కొత్తచోటుకు చేరుకోవాలి. ఒక కుటుంబం బదిలీ మీద మరోచోటుకు వెళ్లాలన్నా కష్టమే. పిల్లల చదువుల నుంచి అన్ని అవసరాలకూ కొత్త వసతులు వెతకాలి. ఈ ‘రీలొకేషన్’ సజావుగా సాగేందుకు తగిన సేవలు అందించే సంస్థలు ఉంటాయనే సంగతి చాలామందికి తెలియదు.
ఈ రంగంలో చాలా ఏండ్ల నుంచి సేవలు అందిస్తున్నది పీఎమ్ రీలొకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (పీఎమ్ఆర్) సంస్థ. 2006లో రాజీవ్ భార్గవ్ దీనిని స్థాపించారు. ఇప్పుడు ఆయన కూతురు ఆకాంక్ష సంస్థ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఆమె నాయకత్వంలో సంస్థ 40 రెట్లు ఎదిగింది.
ఈ ఏడాది పీఎమ్ఆర్ సంస్థ రూ.350 కోట్ల టర్నోవర్ సాధిస్తుందని అంచనా! సంస్థ సేవలు సజావుగా సాగేందుకు దేశవ్యాప్తంగా 13 చోట్ల గోదాములు కూడా ఏర్పాటు చేసుకున్నారు. రీలొకేషన్ సేవలను విదేశాలకూ విస్తరిస్తున్నారు. ఇటీవల జరిగిన జీ20 సదస్సు కోసం వేర్వేరు ప్రదేశాల నుంచి భారీ వస్తువులను తరలించాల్సి రావడం, ఓ కొత్త అనుభవమే కాదు… అరుదైన అవకాశం కూడా అంటున్నారు ఆకాంక్ష!