పెండ్లయి పదినెలలు నిండకముందే నవ దంపతులు విడాకులకు సిద్ధపడుతున్నారు. ‘నువ్వెంత? అంటే నువ్వెంత?’ అని కత్తులు నూరుతున్నారు. ఎందుకిలా జరుగుతున్నది? సమస్య ఎక్కడుంది? పరిష్కారమేంటి? నిపుణులు ఏమంటున్నారు? మీరే చదవండి.
కేస్స్టడీ-1
అతని పేరు ప్రకాశ్. హైదరాబాదీ. బెంగళూరులోని ఓ కార్పొరేట్ కంపెనీలో మేనేజర్గా చేస్తున్నాడు. ఐదేండ్ల క్రితం రమ్యతో వివాహమైంది. కాపురం అక్కడే పెట్టాడు. ఏడాదిలోపే మనస్పర్ధలు మొదలయ్యాయి. పెద్దలు జోక్యం చేసుకున్నా పరిస్థితి కుదుటపడలేదు. ఆ రోజు గడపదాటిన రమ్య ఇప్పటికీ ఇంటికి రాలేదు. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ద్వేషాన్ని చిమ్ముకుంటున్నారు. తప్పు తెలుసుకుని అతనే వస్తాడని ఆమె, ఆమే వస్తుందని అతను.. ఎవరికి వారు మంకుపట్టు పట్టారు. పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకున్నారు.
కేస్స్టడీ-2
ఆమె పేరు ప్రేమ. వివాహమై మూడేండ్లు గడిచింది. ఏడాదిన్నరగా పుట్టింట్లోనే ఉంది. మధ్యలో ఒకసారి తల్లిదండ్రులు బలవంతంగా అత్తగారింట్లో దింపి వచ్చారు. మళ్లీ వారం రోజులకే భర్తతో తగువులాడి పుట్టింటికి చేరింది. వేరే కాపురం పెట్టాలని ఆమె కోరిక. అమ్మానాన్నలకు ఒక్కడే కొడుకు కాబట్టి, కుదరదని చెప్పేశాడు మొగుడు. నేను కావాలనుకుంటే నాతో రా, లేకపోతే పుట్టింటికి వెళ్తానని బెదిరించేది. మూడుసార్లు ఆత్మహత్యకూ యత్నించింది.
కేస్స్టడీ-3
గత మార్చిలో వరుణ్తో స్వాతి పెండ్లయింది. అంతలోనే, అత్త్తామామలతో చిన్న గొడవ వచ్చింది. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. ఇలాంటివన్నీ సహజమేనని, సర్దుకు పోవాలని నచ్చచెప్పారు. ఆ ఓదార్పు స్వాతికి సంతృప్తిని ఇవ్వలేదు. ఈ విషయాలన్నీ ఓ స్నేహితురాలితో పంచుకుంది. ఒళ్లంతా నెగెటివ్ ధోరణిని నింపుకొన్న ఆ మహిళ లేని పోనివన్నీ నూరిపోసింది. అత్తామామలపై పగను అంటించింది. దీంతో, స్వాతి ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలోంచి చూడటం మొదలుపెట్టింది. చివరికి పుట్టింటికే పరిమితమైంది. పాత బంధాన్ని మరిచిపోలేదు, కొత్త బంధాన్ని స్వాగతించనూ లేదు… ఏడడుగులు, మూడు ముళ్ల సాక్షిగా రెండు మనసులు ఒక్కటవుతాయి. కానీ, అవగాహన లోపం, దుందుడుకు మనస్తత్వం, పట్టువిడుపులు తెలియని మూర్ఖత్వం కారణంగా.. దంపతులు శత్రువులుగా మారుతున్నారు. మూడో వ్యక్తి మాటలు నమ్ముతూ ఇద్దరి మధ్యా సంతోషాన్ని దూరం చేసుకుంటున్నారు. ఆమెకు నచ్చింది.. అతనికి నచ్చదు. అతడు సరే అన్నది ఆమె అంగీకరించదు. ప్రతి చిన్న విషయానికీ వాదించుకుంటారు. అదే పెద్ద గొడవకు దారి తీస్తుంది. బంధానికి బీటలుపడతాయి. తరచూ వచ్చే ఇలాంటి గొడవలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని దంపతులకు సలహా ఇస్తారు సైకాలజిస్టులు.
రకరకాల ఫిర్యాదులు
మాటసాయం కోసం, పరిష్కారం కోసం.. కౌన్సెలింగ్ సెంటర్కు వస్తున్న దంపతులు తమ జీవిత భాగస్వామికి సంబంధించి చేస్తున్న ఫిర్యాదులలో అతి ముఖ్యమైంది.. అపనమ్మకం! భర్తకు ఎవరితోనో సంబంధం ఉందని భార్య, భార్యకు ఎవరో అజ్ఞాత స్నేహితుడు ఉన్నాడని భర్త కౌన్సెలర్ల ముందు గోడు వెళ్లబోసుకుంటారు. నిజానికి, ఎనభైశాతం కేసులలో అవన్నీ అపోహలే. ఎలాంటి ఆధారాలూ ఉండవు. అత్తమామలతో కలిసి ఉండలేనంటూ భర్తతో గొడవపడే అమ్మాయిల సంఖ్యా తక్కువేం కాదు. భర్త కెరీర్కు భార్య, భార్య కెరీర్కు భర్త.. మద్దతు ఇవ్వకపోవడమూ ఇబ్బందికర విషయమే. కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామిని వదులుకోడానికైనా సిద్ధపడుతున్నారు కానీ, కెరీర్ విషయంలో మాత్రం రాజీ పడటం లేదు. ‘చెప్పుడు మాటలకు విలువ ఇవ్వొద్దు. క్షణికావేశంలో ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. మనసు విప్పాలి. ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. కోపంలోనో, అపార్థంతోనో నోరు జారొద్దు. మాటలు తూటాలై భాగస్వామిని బాధిస్తాయి. అతని కన్నవారిని ఆమె, ఆమె తల్లిదండ్రులను అతను గౌరవించాలి. గతాన్ని తవ్వుతూ కూర్చుంటే భవిష్యత్తు నాశనం అవుతుంది’ అని సలహా ఇస్తారు మానసిక నిపుణులు.
రిలేషన్షిప్ వర్కవుట్స్ ముఖ్యం
ఇతరుల మనసు తెలుసుకోవాలని అనుకునే ముందు.. మీ మనసు లోతు మీరు తెలుసుకోవాలి. ఎదుటి వ్యక్తి ఆలోచనల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ మొత్తం ప్రక్రియ పేరే.. రిలేషన్షిప్ వర్కవుట్స్. సాంకేతిక యుగంలో ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ను అప్డేట్ చేసుకుంటాం. అలానే దంపతులు కూడా జీవితంలో ఎదురయ్యే టాస్క్లని అర్థం చేసుకొని అపార్థాలకు దూరంగా ముందుకు సాగాలి. దాంపత్య జీవితంలో గొడవలు సహజం. వాటిలో మూడో వ్యక్తి జోక్యం మంచిది కాదు.
– డాక్టర్ జీసీ కవిత కౌన్సెలింగ్ సైకాలజిస్టు
కలిసి సాగాలి..
పెళ్లి హనీమూన్ కాదు. అదో పెద్ద బాధ్యత. నేనెందుకు? నువ్వెందుకు? అనే స్కోర్ కార్డు పెట్టుకుంటారు కొందరు. అది సరైన పద్ధతి కాదు. దీనివల్ల పోటీ వాతావరణం ఏర్పడుతుంది. ఒకరి అభిప్రాయాల్ని ఒకరు అంగీకరించాలి. ఒకరి ప్రైవసీని ఒకరు గౌరవించాలి. ఇద్దరికీ ఉన్న ఆసక్తులు తెలుసుకోవాలి. ఇద్దరికీ షటిల్ ఇష్టమైతే కలిసి ఆడాలి. ఇద్దరికీ బిర్యానీ ఇష్టమైతే.. కలిసి తినాలి. అది ఇద్దరి మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది.
– పాణ్యం కవిత కౌన్సెలింగ్ సైకాలజిస్టు
…? కిరణ్కుమార్ ఇడుమాల