డిజిటల్ యుగం మొదలయ్యాక టీవీలు, ఫోన్లు, ల్యాప్టాప్లు అంటూ స్క్రీన్ని చూసే సమయం కూడా పెరిగింది. దీనివల్ల కళ్ల మీద దుష్ప్రభావం పడుతుందన్న విషయం చర్చలోకి తరచూ వస్తున్నదే. అయితే ఈ స్క్రీన్ టైమ్ పెరగడం కారణంగా రక్తపోటు కూడా పెరుగుతున్నదని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. వాషింగ్టన్ డీసీలోని అమెరికన్ కాలేజీ ఆఫ్ కార్డియాలజీ తాజా పరిశోధనల ప్రకారం సగటున 6 గంటల కన్నా ఎక్కువ స్క్రీన్ టైమ్ ఉన్నవారిలో అంత కన్నా తక్కువగా స్క్రీన్ టైమ్ ఉండే వారితో పోల్చితే అధిక రక్తపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్టుగా తేలింది.
35 ఏండ్లు పైబడిన 382 మందిపై చేసిన పరిశోధనలో స్క్రీన్ టైమ్కి రక్తపోటుకు మధ్య ఉన్న ఈ సంబంధం తేటతెల్లమైంది. మద్యపానం, ధూమపానం లాంటి అలవాట్లు, నిద్ర, వ్యాయామం తదితర అంశాలు, రోజువారి జీవనశైలిని పరిగణనలోకి తీసుకొని పరిశోధన చేశారు. ఎక్కువ స్క్రీన్ టైమ్ వినియోగం… బీపీతోనే ఆగిపోకుండా రక్తంలో అధిక కొలెస్ట్రాల్ చేరడం, బాడీ మాస్ ఇండెక్స్ పెరగడం, నడుము చుట్టుకొలతలో మార్పులు తదితర సమస్యలకు దారి తీస్తుందని వెల్లడైంది.
ఇవన్నీ నేరుగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసేవే. స్క్రీన్ టైమ్ తక్కువగా ఉండేవారు నడక, జాగింగ్ లాంటి వ్యాయామ అంశాల మీద కొంత సమయాన్ని కేటాయిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు గమనించారు. అయితే స్కూల్లో, ఆఫీసుల్లో ఉపయోగించే స్క్రీన్ టైమ్ని ఈ పరిశోధనలో పరిగణనలోకి తీసుకోలేదు. మొత్తానికి ఆరోగ్యాన్ని దెబ్బతీసే జీవనశైలి అలవాట్లలో ఇప్పుడు స్క్రీన్ టైమ్ కూడా చేరిందని పరిశోధన తేల్చి చెబుతున్నది.