వజ్ర వైడూర్యాలు, మణిమాణిక్యాలు పొదిగిన ఆభరణాలను ధరించే స్తోమత ఎంత మందికి ఉంటుంది? ప్రకృతి ప్రసాదించే రంగురంగుల విత్తనాలను నగలకు జోడిస్తే.. జాతి రత్నాలైనా చిన్నబోవాల్సిందే. సంగీతాదేవి మనసులో మెరిసిన ఆ ఆలోచన మహిళా లోకాన్ని మురిపిస్తున్నది. బీహార్, జాముయ్ జిల్లాలోని ఓ మారుమూల పల్లె ఆమెది. బాల్యంలో కొండాకోనలు తిరిగి.. రకరకాల విత్తనాలు సేకరించేది. అట్ట ముక్కలతో ఆభరణాలు చేసి.. వాటికి అతికించేది. మెడలో అలంకరించుకుని మురిసిపోయేది. మళ్లీ పాతికేండ్ల తర్వాత.. ఆ కళ తనకు అక్కరకొచ్చింది. ఇంటికి పెద్ద దిక్కు అయిన మామయ్య మరణం తర్వాత, భర్త ఒంటిచేతి సంపాదనతో ఇల్లు గడవడం కష్టమైంది. దీంతో అదనపు ఆదాయం కోసం విత్తన ఆభరణాలను తయారుచేయడం మొదలుపెట్టింది సంగీత. ధర చవక.
ఇరవై రూపాయలతో మొదలవుతాయి. అత్యంత ఖరీదైన ఆభరణమైనా వెయ్యి రూపాయల లోపే. దీంతో జనం ఎగబడి కొనడం మొదలుపెట్టారు. తన దగ్గర ఇప్పుడు పదిహేనుమంది మహిళలు పనిచేస్తున్నారు. గూగుల్, రోల్స్రాయిస్, కోకాకోలా తదితర సంస్థలు పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగంగా సంగీతాదేవి దగ్గర నగలు కొంటున్నాయి. ‘మేం చెట్లను నరికి విత్తనాలు సేకరించడం లేదు. గాలికి పడినవాటినే ఏరుకుంటున్నాం. ఆభరణాల్లో పొదిగిన విత్తనాలు ఏదో ఒకరోజు మట్టిలో కలిసిపోయి మొక్కలు అవుతాయి. చెట్లుగా ఎదుగుతాయి’ అంటుందామె. ఇప్పటికే తను పాతిక డిజైన్లను మార్కెట్కు పరిచయం చేసింది. మరికొన్ని అందించే ప్రయత్నంలో ఉంది. శివలింగ, వైజయంతి, సిందూర, అశోక వృక్షాల విత్తనాలు సంగీత పాలిట విలువైన రాళ్లు.