‘నీళ్లు, నిధులు, నియామకాలు.. ఈ మూడు అంశాల్లోనూ ఎంతో ప్రగతి సాధించి, దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ’ అని సగర్వంగా చెబుతారు టీఎస్పీఎస్సీ సభ్యురాలు తానోబా సుమిత్ర ఆనంద్. అంకితభావంతో సాధారణ గృహిణి సైతం ఉన్నత స్థానానికి చేరుకోగలదు అనడానికి ఆమె జీవితమే ఉదాహరణ. పట్టుదలతో సాధించిన పట్టా, పట్టుబట్టి తెచ్చుకున్న తెలంగాణ, ప్రతిష్ఠాత్మకమైన హోదా.. తన జీవితంలోని కీలక మలుపులను వివరిస్తున్నారు సుమిత్ర..
మాది మెదక్ జిల్లా పాపన్నపేట మండలం ఆరేపల్లి. నాన్న మాణిక్యరావు, అమ్మ విఠలాబాయి. నాన్న ఆదర్శ భావాలు కలిగిన వ్యక్తి. గ్రామంలో తనే మొదటి విద్యావంతుడు. మొదటి టీచర్ కూడా. అందరూ చదవాలి.. అందరూ ఎదగాలి అని తపించేవారు. నేను ఎనిమిదో తరగతిలో ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. మేం ఐదుగురం. నేను నాలుగోదాన్ని. కుటుంబ పరిస్థితుల వల్ల టెన్త్ తర్వాత చదవలేకపోయాను. కామారెడ్డి జిల్లా చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఆనంద్రావుతో నా పెండ్లి జరిగింది. విద్యార్థిదశలో ఆయన పీడీఎస్యూలో పనిచేశారు. వామపక్ష భావాలు కలిగిన వ్యక్తి. పెండ్లి చూపులకు వచ్చినప్పుడు ‘ఆదర్శ వివాహం నీకు ఇష్టమేనా?’ అని ప్రశ్నించారు. నాకు సరైన జీవితభాగస్వామి దొరికాడని సంతోషించాను.
మా అత్తగారి ఇంటికి దగ్గరలో లైబ్రరీ ఉండేది. పుస్తకాలు తెచ్చుకొని చదివేదాన్ని. అప్పుడే ‘కాలుతున్న పూలతోట’ నవల చదివాను. అది నన్ను బాగా ప్రభావితం చేసింది. అందులో ముగ్గురు అమ్మాయిలు సమాజంలో మార్పు కోసం అజ్ఞాతంలోకి వెళ్తారు. నాకూ అలా వెళ్లాలనేంత ఆవేశం వచ్చేది. ‘అజ్ఞాతంలోకి వెళ్లడం కంటే సమాజంలో ఉంటూనే మహిళల కోసం పోరాడటం మేలు’ అని హితవు పలికారు మావారు. దాదాపు రెండొందలమంది మహిళలు నాతో చేతులు కలిపారు. అక్షరాస్యత కోసం మా మహిళా మండలి ఆధ్వర్యంలో ‘అక్షర కిరణం’ అనే ఉద్యమం ప్రారంభించాం. సారా వ్యతిరేక పోరాటంలోనూ చురుగ్గా పాల్గొన్నాను.
సాయంకాల కళాశాలలో చేరి ఇంటర్, డిగ్రీ పూర్తి చేశాను. హైదరాబాద్లోని ఆంధ్ర సారస్వత పరిషత్లో తెలుగు పండిట్ ట్రైనింగ్ పూర్తి చేశాను. తెలుగు ఉపాధ్యాయురాలిగా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాను. మెదక్ జిల్లా బూర్గుపల్లిలో మొదటి పోస్టింగ్. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లాకు బదిలీ అయ్యింది. లింగంపల్లి, లింగంపేట గ్రామాల్లో పని చేశాను. టీపీటీఎఫ్లో చురుకైన పాత్ర పోషిస్తూ.. ఉపాధ్యాయుల సమస్యలపై పోరాడాను. నా అనుభవాలకు, ఆలోచనలకు అక్షర రూపమిస్తూ అనేక కవితలు రాశాను.
తెలంగాణ ఉద్యమంలో..
పండిట్ ట్రైనింగ్ సమయంలో నేను తెలంగాణ యాసలోనే మాట్లాడేదాన్ని. అది చూసి ఆంధ్ర ప్రాంత విద్యార్థినులు ఎగతాళి చేసేవారు. అప్పుడే నాకు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత అర్థమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి ఉద్యమం ప్రారంభించినప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. ముందువరుసలో ఉంటూ ఉద్యమ ఉధృతికి దోహదపడ్డాను. కామారెడ్డి కేంద్రంగా ఏర్పాటైన ‘తెలంగాణ భాషా వేదిక’ వ్యవస్థాపక అధ్యక్షురాలిగా పని చేశాను. అయాచితం నటేశ్వర శర్మ, రామ్మూర్తి లాంటి సాహితీ వేత్తలు భాషా వేదిక మీదికి వచ్చారు.
కేసీఆర్ను జలదృశ్యంలో కలిసి సంపూర్ణ మద్దతు పలికాను. కేసీఆర్ పోరాట పటిమకు పదాభివందనం చేస్తూ.. వంద పద్యాల అక్షర హారం అంకితమిచ్చాను. ఆ శతకాన్ని చూసి కేసీఆర్తో పాటు జయశంకర్ సార్ కూడా ముచ్చటపడ్డారు. మా పాప నామకరణోత్సవానికి కేసీఆర్ కుటుంబ సమేతంగా వచ్చారు. ‘మహతి’ అని తనే పేరు పెట్టారు. కామారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి వచ్చినప్పుడు మహతిని పిలిచి మాట్లాడారు కూడా. తెలంగాణ జాగృతి సంస్థను స్థాపించిన తర్వాత.. మొట్టమొదటి బతుకమ్మ సంబురాలను కల్వకుంట్ల కవిత చిన్న మల్లారెడ్డిలోనే జరుపుకొన్నారు. భారీ ఎత్తున సంబురాలు నిర్వహించాం.
నీళ్లు, నిధులు, నియామకాలు..
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాలపైనే జరిగింది. ఈ మూడు రంగాల పట్లా ముఖ్యమంత్రి అపారమైన శ్రద్ధ కనబరుస్తున్నారు. దాదాపు లక్ష ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువరించారు. నియామక ప్రక్రియ చాలా వేగంగా జరుగుతున్నది. తెలంగాణలోని గ్రామం నుంచి పట్టణం వరకు.. చెరువులు, కాలువల నుంచి నదులు, ప్రాజెక్టుల వరకు.. అన్నీ కేసీఆర్కు తెలుసు. తెలంగాణలో అభివృద్ధ్ధి లేదనేవారు నిజంగా తెలంగాణ ద్రోహులే. మన రాష్ట్రం నేడు దేశంలోనే నంబర్ వన్గా ఉంది. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. నేను చదివిన పుస్తకాలు, నేను పాల్గొన్న తెలంగాణ ఉద్యమం, నాలోని అంకితభావాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం.. ఈ మూడూ నన్ను అపారంగా ప్రభావితం చేసిన విషయాలు. నన్ను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యురాలిగా నియమించిన ముఖ్యమంత్రికి హృదయ పూర్వక కృతజ్ఞతలు.
మూగవోయినట్టి ముక్కోటి గొంతులు ముక్తకంఠమయ్యె ముక్తి గోరినింగినంటునట్లు నినదింపజేసింది కేవలమ్ము నీవే కేసీయారూ! తెగిన తీగలన్నీ తెగువతో బిగగట్టి అగ్నిలోని వీణకాకృతినిచ్చి ఉనికిలేని దాన్ని ఉన్నతంగా మలిచి కీర్తిపొందినావు కేసీయారూ!
(దాశరథి రచనకు సుమిత్ర ఆనంద్ అనుకరణ )
…? ఎస్కె మోహియోద్దీన్