సిగలో ఒద్దికగా ఒదిగిపోయే పుష్పాలను ఆభరణాలుగా మలిచి మగువల మనసు దోచేస్తున్నారు సుప్రియా దొంతి. చిట్టిచిట్టి పూలను, లేలేత ఆకులను హారంలోనో, ఉంగరంలోనో పేర్చి, కూర్చి అందిస్తున్నారామె. ‘ప్రెస్డ్ ఫ్లవర్ జువెలరీ’ ట్రెండ్ను ఓ వ్యాపారంగా మలుచుకున్నారు సుప్రియ.
సుప్రియ దొంతి వృత్తిరీత్యా ప్రాజెక్ట్
మేనేజర్. ప్రవృత్తిపరంగా ప్రకృతి ప్రేమికురాలు. పచ్చదనాన్ని కాపాడుకోవాలనే తపన ఎక్కువ. ఆ అంతర్మథనంలోంచే ‘నేచర్ ఫ్యాషన్’ ఐడియా తట్టింది. ఫ్యాషన్ అంటే అందంగా కనిపించడం. ప్రకృతి అంటేనే సహజసౌందర్యం. కాలుష్యాల కారణంగా పాడైపోతున్న ప్రకృతిని ఎలాగైనా కాపాడుకోవాలనే ఆలోచన వచ్చింది సుప్రియకు. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టారు. పూబాలలను గ్లాస్ పెండెంట్స్ మధ్యలో గుదిగుచ్చి బ్రేస్లెట్లు, నెక్లెస్లు, ఉంగరాలు డిజైన్ చేయడం ప్రారంభించారు. బంధుమిత్రులు ‘వావ్! మాకూ కావాలి’ అంటూ తీసేసుకున్నారు. దీంతో తనమీద తనకు నమ్మకం పెరిగింది. ‘లీఫీ ఎఫైర్’ పేరుతో ఓ స్టార్టప్ స్థాపించారు సుప్రియ.
ఉద్యోగం వదిలేసి..
సుప్రియ గతంలో ‘ఆర్టీ ప్లాంట్స్’ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ చేశారు. ఔషధ గుణాలున్న మొక్కల సంరక్షణకు కృషిచేస్తున్న సంస్థ ఇది. ఈ వేదిక గురించి జనాలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆ సమయంలోనే సుప్రియకు రకరకాల మొక్కల గురించి తెలిసింది. తాను కూడా వివిధ పాఠశాలలకు వెళ్లి విద్యార్థులకు మొక్కలు, వాటి ఉపయోగాల గురించి వివరించేవారు. క్రమంగా మొక్కల మీద ఆసక్తి పెరిగింది.
ఆ తర్వాత ఇంకేవో కొలువులు చేసినా.. సంతృప్తికరంగా అనిపించలేదు. ఆ సమయంలోనే ‘లీఫీ ఎఫైర్’ వైపు అడుగులు వేశారు. పూల ఆభరణాలకు రూపమిచ్చారు. సుప్రసిద్ధ బిజినెస్ గేమ్ షో..‘షార్క్ ట్యాంక్ ఇండియా సీజన్ -1’లోనూ పాల్గొన్నారామె. మెంటర్స్కు తన ఐడియా వివరించారు. ఎందుకో ఇన్వెస్టర్లు ముందుకు రాలేదు. అయితేనేం, ప్రేక్షకుల ఆదరణ లభించింది. కానీ ‘లీఫీ ఎఫైర్’ బ్రాండ్ విలువ పెరిగింది.
దీంతో వెనక్కి తిరిగి చూసుకోలేదామె. ప్రెస్డ్ ఫ్లవర్ జువెలరీనే ‘బొటా నికల్ జువెలరీ’ అంటారు. ఇరవై వేలతో మొదలుపెట్టిన వ్యాపారం ఇప్పుడు దేశమంతా విస్తరించింది. రణ్వీర్ సింగ్, కరణ్ జొహార్, శ్రద్ధా శ్రీనాథ్ లాంటి బాలీవుడ్ సెలెబ్రిటీలు సుప్రియ జువెలరీని ఇష్టంగా ధరిస్తారు. మనసుకు నచ్చిన రంగంలో ప్రాణంపెట్టి పనిచేస్తే.. విజయం వరించితీరుతుంది. ఇందుకు, సుప్రియ ఉదాహరణ.