Spirit of India | శుక్లాంబరధరం విష్ణుం.. ముద్దొచ్చే బొజ్జ గణపతి. కౌసల్య సుప్రజారామ.. నిలువెత్తు వేంకటేశ్వరుడు. తల్లీనిన్ను దలంచి.. చిరునవ్వుల సరస్వతీదేవి. వందే వందారు మందారం ఇందిరానంద కందలమ్..సిరులతల్లి లక్ష్మీదేవి. నాగేంద్రహారాయ త్రిలోచనాయ.. శివాత్మకమైన మహా లింగం.
అంతేనా.. తథాగత బుద్ధుడు, కరుణామయుడైన క్రీస్తు, ప్రేమైక జీవులు రాధాకృష్ణులు.. ఇలా అనేకానేక రూపాలు మనల్ని ఆధ్యాత్మిక జగత్తువైపు లాక్కెళ్త్తాయి. దేనికదే అపురూపం. ప్రతి బొమ్మలోనూ జీవకళ, అంతులేని వింత కాంతి. వీటిని తయారుచేసింది ఏ భారతీయ సంస్థో కాదు. స్పానిష్ లగ్జరీ పోర్స్లిన్ బ్రాండ్.. లాడ్రో! స్పెయిన్ నుంచి వచ్చి మరీ మన దేవతల విగ్రహాలను విక్రయించడం వెనుక లాడ్రోకు పెద్ద వ్యూహమే ఉంది. ఇప్పటికే, లాడ్రో వ్యాపారంలో పదకొండు శాతం భారత్ నుంచే జరుగుతున్నది. ఆ వాటా ఇంకొంత పెంచాలన్నది ఆలోచన. పాశ్చాత్య శిల్పాలు, గృహాలంకరణ వస్తువులు కూడా విక్రయిస్తున్నా.. ‘స్పిరిట్ ఆఫ్ ఇండియా’ కలెక్షన్లో భాగమైన దేవతా మూర్తులకే గిరాకీ ఎక్కువ. వీటి ధరలు ఎనిమిదివేల రూపాయల నుంచి రెండున్నర కోట్ల వరకూ ఉంటాయి.
ఈ మధ్యే లిమిటెడ్ ఎడిషన్గా తీసుకొచ్చిన ‘కృష్ణార్జున-గీతా సందేశం’ విగ్రహాలు శరవేగంగా అమ్ముడవుతున్నాయి. ధర అక్షరాలా ముప్పై తొమ్మిది లక్షలు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి విగ్రహానికి లభిస్తున్న ఆదరణ ఆ విదేశీ సంస్థను ఆశ్చర్యానికి గురిచేసింది. దీంతో ధరను రూ. పద్దెనిమిదిన్నర లక్షల నుంచి అమాంతం ముప్పై లక్షలకు పెంచేశారు. ఆన్లైన్ విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయని చెబుతున్నారు తయారీదారులు. ఈ మధ్యే లాడ్రో ఢిల్లీలో సువిశాలమైన షోరూమ్ను ప్రారంభించింది. ‘భారత్లో విస్తరించాలనే ప్రయత్నంలో ఇది తొలి అడుగు’ అంటారు ఆ సంస్థ సీఈవో అనా రోడ్రిగ్స్. భారతీయ సంస్కృతికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతున్నది. ఆ అవగాహన వల్లే కావచ్చు.. స్పిరిట్ ఆఫ్ ఇండియా కలెక్షన్కు ఇక్కడి కంటే అమెరికాలోనే గిరాకీ ఎక్కువ’ అంటారు ఆమె.