స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టెలివిజన్లు మన దినచర్యలో భాగమైపోయాయి. అయితే, ఈ స్క్రీన్లను కళ్లకు ఎంత దూరంలో ఉంచాలనే దానిపై చాలామందికి అవగాహన ఉండటం లేదు. వెలిగే తెరలను చాలా దగ్గరగా చూడటం వల్ల కంటి కండరాలు తీవ్రమైన ఒత్తిడికి లోనవుతాయి. ఈ సమస్యను నివారించడానికి అంతర్జాతీయ కంటి వైద్య నిపుణులు ‘1-2-10’ అనే సులభమైన సూత్రాన్ని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిల్లల్లో చిన్న వయసులోనే కంటి చూపు మందగించకుండా ఉండేందుకు ఇది సాయపడుతుందట. అలాగే పెద్దలు పాటిస్తే కళ్లను మరింత కాలం భద్రంగా ఉంచుకోవచ్చు.
దీని ప్రకారం స్క్రీన్ల దూరం ఇలా ఉండాలి
1 అడుగు (మొబైల్ ఫోన్లు): స్మార్ట్ఫోన్లు లేదా ట్యాబ్స్ని ఉపయోగించేటప్పుడు అవి మన కళ్లకు కనీసం 1 అడుగు (సుమారు 30 సెంటీమీటర్లు) దూరంలో ఉండేలా చూసుకోవాలి.
2 అడుగులు (ల్యాప్టాప్/ కంప్యూటర్): కార్యాలయాల్లో లేదా ఇంట్లో కంప్యూటర్, ల్యాప్టాప్ స్క్రీన్ల ముందు కూర్చున్నప్పుడు.. స్క్రీన్కు, కంటికి మధ్య కనీసం
2 అడుగుల (సుమారు 60 సెంటీమీటర్లు) దూరం ఉండాలి. అంటే దాదాపు మన చేతి పొడవు అంత దూరం పాటించాలి.
10 అడుగులు (టెలివిజన్): ఇంట్లో టీవీ చూసేటప్పుడు స్క్రీన్ పరిమాణాన్ని బట్టి కనీసం 10 అడుగుల దూరం నుంచి వీక్షించడం కంటికి సురక్షితం.
ఈ ‘1-2-10’ నియమాన్ని పాటించడం వల్ల కంటిపై పడే కాంతి తీవ్రత తగ్గి, చూపు మందగించకుండా ఉంటుంది. ఇంత ఈజీగా కళ్లను రక్షించుకోవచ్చు అంటే మీరు మాత్రం ట్రై చేయకుండా ఎందుకు ఉంటారు!