‘మానవ సేవే మాధవ సేవ’ అనడం కాదు ఆచరణగా జీవిస్తున్నది సిస్టర్ లిసీ జోసెఫ్. సంపన్న కుటుంబంలో పుట్టి పేదలకు సేవ చేయాలనుకుంది. నన్గా మారడం కోసం కేరళను వీడి హైదరాబాద్ వచ్చింది. సిస్టర్స్ ఆఫ్ ఛారిటీలో చేరి బస్తీ పేదల్ని కూడగట్టింది. చదువు చెప్పింది. జీవన నైపుణ్యాలు నేర్పింది. డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్ పెట్టి.. పనిమనుషులకు సంఘమనే కవచం తొడిగింది. వారికి కనీస వేతనం, జీవన భద్రత హక్కులు సాధించింది. దశాబ్దాలుగా పీడితుల పక్షాన నిలుస్తున్న లిసీ జోసెఫ్ ‘జిందగీ’తో పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే!
కేరళలో సంపన్న నంబూద్రి కుటుంబంలో పుట్టాను. మా తాతగారు వ్యాపారి. నాన్నకు 100 ఎకరాల భూమి ఉండేది. నాన్న, పెద్దన్నయ్య కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. భూపోరాటాలు నడిపారు. మా భూములు కూడా పేదలకు పంచారు. మా అక్క క్రైస్తవ మిషనరీలో చేరి, హైదరాబాద్ వచ్చింది. మా స్కూల్లో ‘దేవుని పట్ల ప్రేమను సేవ ద్వారా ప్రకటించాలి’ అని టీచర్లు చెప్పారు. అందుకే మిషనరీలో చేరి సేవ చేయాలనుకున్నాను.
అప్పుడు ఆంధ్రప్రదేశ్లో వరదలు వచ్చాయి. అందుకే హైదరాబాద్ ఎంచుకున్నాను. ఇంట్లో ఒప్పుకోలేదు. మా అక్కకు తెలియకుండా ‘సిస్టర్స్ ఆఫ్ ఛారిటీ’కి లేఖ రాశాను. నాకు పద్దెనిమిది సంవత్సరాలు నిండలేదు. కాబట్టి తీసుకోవడానికి అంగీకరించలేదు. రెండేండ్లు సిస్టర్స్ జీవితం ఎలా ఉంటుంది? వాళ్లు ఏ పనులు చేస్తారో దగ్గరగా చూసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత నచ్చితే చేరమన్నారు.
ఓ అమ్మ కథ
ఇక్కడే ఉండి ఇంటర్మీడియెట్ చదివాను. తర్వాత సిస్టర్ (నన్)గా ఉండేందుకు నిర్ణయించుకున్నాను. బ్యాచిలర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివాను. తర్వాత ముంబయి వెళ్లి అక్కడి బస్తీల్లో పేదపిల్లలకు ట్యూషన్లు చెప్పాను. మూడేండ్ల తర్వాత హైదరాబాద్ వచ్చాను. బస్తీల్లో పాఠశాలలు నడుపుతూ సోషల్ వర్క్లో మాస్టర్ డిగ్రీలో చేరాను. ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా వారానికి రెండు రోజులు బస్తీల్లో పనిచేసేవాళ్లం. ఒకసారి అంబర్పేట్ కృష్ణానగర్లో కళ్లలోకి సబ్బు పోయి మూడేండ్ల అమ్మాయి ఏడుస్తున్నది.
ఓ ఆరేండ్ల అమ్మాయి ఆ పిల్లకు స్నానం చేయించలేక ఇబ్బందిపడుతున్నది. వీళ్ల పక్కన మరో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. వాళ్లంతా ఒక ఇంటి బిడ్డలు. ‘మీ అమ్మ లేదా?’ అని అడిగితే… ‘బంగ్లాలో పనికి పోయింది’ అన్నారు. పిల్లల చదువు కాదు, కనీసం వాళ్లను పట్టించుకునే వాళ్లు లేరు. ‘ఏ తప్పూ చేయని పిల్లలకు ఎందుకీ శిక్ష?’ అనిపించింది. సరైన తిండి, చదువు వాళ్ల హక్కు.
అది కల్పించడం పెద్దవాళ్ల బాధ్యత. వాళ్లమ్మను కలిసి అడిగితే.. ఇంటి కిరాయి, కరెంటు, నీళ్ల బిల్లులకు పైసలు చాలడం లేదన్నది. రిక్షా తొక్కే తన భర్త సంపాదనంతా తాగుడుకే పోతుందని బాధపడింది. నాలుగు ఇళ్లల్లో పని చేసినా అయిదు వేళ్లు నోట్లోకి పోని అలాంటి తల్లులు ఎందరో! వాళ్లను సంఘటితం చేయాలనుకున్నాను. సంఘం పెడదామంటే భయపడ్డారు. కనీస వేతనం సాధిస్తే సమస్యలు పోతాయన్నా ఎవరూ ముందుకు రాలేదు.
ఓ పద్మ వ్యథ
అదే ఏరియాలో ఉండేది పద్మ. నాలుగైదు ఇళ్లల్లో పని చేసేది. పనికి పెట్టుకున్నవాళ్లు నగలు దొంగిలించిందని ఆమెపై నింద మోపారు. పోలీసులు పద్మను పట్టుకుపోయారు. చిత్ర హింసలు పెట్టారు. ఆమె కాళ్లలో రక్తం గడ్డ కట్టి చచ్చుబడ్డాయి. ఇన్స్పెక్టర్ను అడిగితే పట్టించుకోలేదు.
డీసీపీ అనురాధ గారిని కలిశాను. దర్యాప్తులో ఆ యజమానురాలి భర్తే ఆ నగలు అమ్ముకున్నాడని తేలింది. పద్మకు పదివేల పరిహారం ఇచ్చారు. ఆ ఇన్స్పెక్టర్ను సస్పెండ్ చేశారు. సంఘం లేకపోతే ఇలాంటి నిందలు, తప్పుడు కేసులబారిన పెడతారని వాళ్లకు చెప్పాను. అప్పుడు మేలుకున్నారు. ధైర్యంగా ముందుకు వచ్చారు. అలా ‘డొమెస్టిక్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ ప్రారంభమైంది.
ముందడుగు
‘మా పిల్లల కోసం ఏదైనా చేయండి. వీళ్ల బతుకులు ఆగం కావొద్దు’ అని ఆ పనివాళ్లు అడిగారు. ఆ చిన్నారుల కోసం బస్తీల్లో బడులు పెట్టాం. అదే సమయంలో సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజీలో లెక్చరర్గా చేరాను. స్టూడెంట్స్తో ఇళ్లకు దగ్గర్లో ఉండే ఇంటి పనివాళ్లను గుర్తించి, ఒక గ్రూప్గా ఏర్పడేలా చేయమని చెప్పాం. వాళ్లకు మీటింగులు పెట్టి పొదుపు, చదువు, ఆరోగ్యం, హక్కుల గురించి చెప్పాం.
అలా పనిచేస్తున్న రోజుల్లో.. మారేడుపల్లి బస్తీలో ఓ చోటా లీడర్ ‘నువ్వు మళ్లీ మా బస్తీకి వస్తే ఇక్కడే కట్టేసి, నిప్పు పెట్టి చంపేస్తా’ అని బెదిరించాడు. బస్తీలో వృద్ధులకు పెన్షన్లు ఇప్పించేందుకు మామూలు వసూళ్లు చేస్తుంటాడు అతను. ప్రభుత్వ పథకాలకు ఎలా దరఖాస్తు చేయాలో మేం చెప్పేవాళ్లం. మా వల్ల అతని ఆదాయానికి గండి పడుతుందని రాద్ధాంతం చేశాడు. అప్పుడు అక్కడి పనివాళ్లందరూ ఆ లీడర్కు ఎదురు తిరిగారు. ఒకప్పుడు సంఘంలోకి రమ్మన్నా రాని వాళ్లు పోరాటంలో మాకంటే ముందు నిలిచారు.
పోరాడి సాధించాం
ఇంటిపని కార్మికులను గుర్తించాలని, కనీస వేతన చట్టం, సెలవులు ఇవ్వాలని ఉద్యమించాం. 2004లో వీళ్లను కార్మికులుగా గుర్తిస్తూ చట్టం చేశారు. తర్వాత రెండేండ్లకు కనీస వేతన చట్టం, నెలకు నాలుగు రోజుల సెలవులు, ఆరు నెలలకు ఒకసారి కనీస వేతన సవరణ హక్కుల్ని సాధించుకున్నాం. మా కార్మిక సంఘంలో ఇప్పుడు మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారు. సంఘం పేరుని ‘డొమెస్టిక్ వర్కర్స్ యూనియన్’గా మార్చుకున్నాం. మా పోరాటాల ఫలితంగా అసంఘటిత కార్మికుల సామాజిక భద్రత చట్టం-2008లో ఇంటిపనివాళ్లను కూడా చేర్చారు.
హక్కులు సాధించడంతోనే సంఘం ఆగిపోలేదు. ఇంటి పనిమనుషుల్లో నిరక్షరాస్యత, మద్యపాన సమస్యలు ఉన్నాయి. వాటిని నిర్మూలించడం కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నాం. కార్మికులను తప్పుడు కేసుల నుంచి రక్షించడం కోసం ఎల్ఎల్బీ చదివాను. అలాగే ఇంటి పనివాళ్ల గురించి ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ చేశాను. డాక్టరేట్ డిగ్రీ పొందాను. నేను క్రైస్తవ మిషనరీలో సిస్టర్ అయినా.. ఈ సమాజంలోనే ఉన్నాను. ఇక్కడ అన్యాయానికి గురవుతున్న పిల్లలు, మహిళల కోసం పనిచేస్తున్నాను. ఇన్నేండ్ల మిషనరీ జీవితంలో నేను గ్రహించింది సమాజంలో మారాల్సింది మతం కాదు… మనసు!
…? నాగవర్ధన్ రాయల
– జి.భాస్కర్