చిట్టగాంగ్ వీర వనితల చరిత్ర వెలుగులోకి తెచ్చారు. మణిపూర్మహిళల అంతరంగాన్ని ఆవిష్కరించారు. సినిమా పాటలు రాశారు. సంభాషణలు సమకూర్చారు. స్క్రీన్ప్లేతోనూ కసరత్తు చేస్తున్నారు. చైతన్యపింగళి జీవితం నిండా చైతన్యమే. పేదరికం, వివక్ష, సవాళ్లు.. ఇవేవీ ఆమెను ప్రభావితం చేయలేకపోయాయి. ప్రతి సందర్భంలోనూ ముత్తాత పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండాలా తలెత్తుకునే ఉన్నారు. నిర్భయంగా ఎదిరించారు. ఆ ప్రయాణమంతా ఆమె మాటల్లోనే..
‘జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్యగారి మునిమనవరాలు’ అనే గొప్ప పేరు తప్పిస్తే, వారసత్వంగా వచ్చిన ఆస్తులేమీ లేవు. అమ్మానాన్న ప్రేమ వివాహం చేసుకున్నారు. నాన్న (‘ఎన్కౌంటర్’ దశరథరామ్)ను హత్య చేశారు. అప్పటికి, తమ్ముడు అమ్మ కడుపులో ఉన్నాడు. చేతిలో డబ్బుల్లేవు. ఎవరి సాయమూ అందలేదు. అమ్మ దొరికిన పనిచేసింది. అద్దెలు కట్టలేక ఇళ్లు మారాం. విజయవాడలో కాల్వల పక్కన గుడిసెల్లో ఉన్నాం. బతకడం కష్టమై చాలా ఊళ్లు తిరిగాం. దుర్భర పేదరికం అనుభవించాం. మంగళగిరిలో చార్వాక విద్యాశ్రమాన్ని నడిపే రామకృష్ణ నాన్నకు స్నేహితుడు. అక్కడ ఉచితంగా చదువు చెబుతారు. నన్ను ఆయనే చేరదీసి చదువు చెప్పించారు. అయిదో తరగతి వరకు అక్కడే చదివాను. అమ్మ కూలీనాలీ చేస్తూనే ఆగిపోయిన ఇంటర్మీడియట్ పూర్తిచేసింది. ఉద్యోగం సంపాదించింది. నన్ను ప్రైవేట్ స్కూల్లో చేర్పించింది.
ఉప్పొంగిన గోదారిలా
హైదరాబాద్లోని ముంతాజ్ కాలేజ్లో చదువుకునే రోజుల్లో.. క్లాసులో నేనొక్కదాన్నే హిందువు. అయినా నేను వేరు అనే భావన ఎప్పుడూ కలగలేదు. అంత స్నేహంగా ఉండేవారు. ముందు నుంచీ రాయడం అంటే ఇష్టం. ఆర్టికల్స్, కవితలు పత్రికలకు పంపేదాన్ని. కానీ ఒక్కటీ ప్రచురితం కాలేదు. అనుకోకుండా ‘విజయవిహారం’ పత్రికలో సబ్ ఎడిటర్ ఉద్యోగం వచ్చింది. డిగ్రీ చదువుతూనే ఉద్యోగం చేశాను. పెద్ద పత్రికల్లో అవకాశాల కోసం వెళ్లాను. ఏవో కారణాలు చెప్పి తీసుకోలేదు. టీవీలో పనిచేయమని ఉచిత సలహా ఇచ్చారు. నాకు ఆసక్తి లేదన్నాను. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో జర్నలిజం చదివాను. అప్పుడే, సినిమాలకు రాసే అవకాశం వచ్చింది. ‘గోదావరి’ కోసం శేఖర్ కమ్ముల గారి టీమ్లో చేరాను. సినిమాకు రాయడం కథలు రాసినంత తేలిక కాదని అర్థమైంది. రెండు నెలలకు మానేశాను.
విప్లవ వనితల కోసం..
కడుపులో బిడ్డ పెరుగుతున్న సమయంలో స్వాతంత్య్రోద్యమం గురించి చదివేదాన్ని.
‘అనుశీలన్ సమితి’లో విప్లవ మహిళల సాహసాలు నన్ను ఆకట్టుకున్నాయి. విప్లవ పోరాటంలో మహిళల భాగస్వామ్యం చిట్టగాంగ్ నుంచే మొదలైంది. వాళ్లలో కల్పనా దత్, ప్రీతిలతా దాస్ తెలిసినంతగా మిగతావాళ్లు తెలియదు. వీళ్లది చెప్పాల్సిన చరిత్ర. అందుకే, రాయకుండా ఉండలేకపోయాను. ప్రయాణాలు కష్టమే అయినా.. మా బాలు, నేను కలకత్తా వెళ్లాం. నాటి ఉద్యమకారులు చదివిన, పెరిగిన, పోరాడిన ప్రాంతాలన్నీ తిరిగాం. ‘అమృత్ బజార్’ పాత సంచికలు తిరగేశాం. నేషనల్ ఆర్కైవ్స్కు వెళ్లాం. మూడు నెలలు ఇదే పని. చిన్నప్పుడు, అమ్మ కష్టాలు చూస్తూ పెరిగిన నాకు ఇవన్నీ అవరోధంగా అనిపించలేదు. బాబు పుట్టినప్పుడు మాత్రం కొంత బ్రేక్ ఇచ్చాను. ఆరు నెలల తర్వాత మళ్లీ కలకత్తా వెళ్లాం. బాబుకు ఆరోగ్య సమస్యలు ఉండేవి. అయినా తప్పలేదు.
‘ఈ పరిస్థితుల్లో చదవడం, తిరగడం, రాయడం.. మనకు అవసరమా?’ అనేవాడు బాలు. కానీ, ఎప్పుడూ ఆపలేదు. మొత్తానికి ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ పూర్తిచేశాను. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చాక ఆ కష్టాలన్నీ మర్చిపోయాను. ఓసారి ఎందుకో మణిపూర్ మహిళల ఆకాంక్షలను ప్రపంచానికి చెప్పాలనిపించింది. మణిపూర్ పోరాటంపై పరిశోధన చేశాను. ఇరోం షర్మిలను కలిశాను. నాగాలాండ్ కూడా వెళ్లాను. చాలా స్ఫూర్తినిచ్చిన అనుభవం అది.
ద్వంద్వార్థాలు లేకుండానే..
చిట్టగాంగ్ విప్లవ వనితలు రాస్తున్నప్పుడు వివిధ సంఘటనలను నాటకీయంగా రాయడం అలవాటైంది. ఆ పుస్తకం చదివిన శేఖర్ కమ్ముల ‘మీరు సినిమాలకు రాయలగరు. ట్రై చేయండి’ అన్నారు. స్క్రీన్ప్లే కోసం వర్క్ చేయమని సలహా ఇచ్చారు. అలా, మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. ‘ఫిదా’ సినిమాకు శేఖర్ గారితో కలిసి పనిచేయడం వల్ల డైలాగ్స్ రాయడం కష్టం అనిపించలేదు. ఈ సినిమాలో రెండు పాటలు కూడా రాశాను. ‘నేల టికెట్’, ‘లవ్ స్టోరీ’, ‘మసూద’ కోసం కొన్ని పాటలు రాశాను.
‘నేల టికెట్’కు పనిచేస్తున్నప్పుడు ఓ మాస్ సాంగ్ అవసరమైంది. మహిళలు రాస్తే పాటకు అంత ఊపు రాదని డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ అభిప్రాయం. అయినా కూడా, ‘సరే రాయండి. బాగుంటే వాడేద్దాం. లేకుంటే వదిలేద్దాం’ అన్నారు. బూతు లేకుండానే రాశాను. కమర్షియల్ పాటలు ఇలా కూడా బాగుంటాయని నేటి దర్శకులు నమ్ముతున్నారు కాబట్టే, మాలాంటి వాళ్లకు అవకాశాలు వస్తున్నాయి. శేఖర్ గారి సూచనతో ఆన్లైన్ కోర్సు చేశాను. దీనివల్ల సినిమాకు రాయడం తేలికైంది. స్క్రీన్ప్లే మీద మరింత దృష్టి పెట్టాను. ప్రస్తుతం ఒక సినిమా స్క్రీన్ప్లే రాస్తున్నా.
నమ్మకం కలిగించాలి
సినిమాకు రాత్రీపగలూ పని చేయాలి. షెడ్యూల్ ప్రకారం వెళ్లాల్సిందే. కుటుంబంలోనూ అనుకూల పరిస్థితులు ఉండాలి. సినిమాలో ఒక నిమిషం అంటే మూడు లక్షల పెట్టుబడి. మనం రాసే నాలుగు మాటలూ అంత డబ్బును రాబట్టగలవా అని బేరీజు వేస్తారు. అంతకంటే ఎక్కువ డబ్బు రాబట్టాలంటే ఇంకా గొప్పగా రాయాలి. సమయానికి అందించాలి.
కుటుంబ బాధ్యతల నడుమ ఆడవాళ్లు ఇన్ని పనులు చేయగలరా? అని డైరెక్టర్, ప్రొడ్యూసర్ సందేహిస్తారు. వాళ్లకు నమ్మకం కల్పిస్తే అవకాశాలకు కొదువలేదు. మహిళలు పురుషులతో సమానంగా రాయలగరు. కానీ, వాళ్లకు అంత తీరిక ఉండాలి. రాసుకుంటూ కూర్చుంటే కుటుంబాన్ని పట్టించుకోదని ఎక్కడ అంటారోననే భయం వెంటాడుతూ ఉంటుంది. బాధ్యతలేని మనిషి అనే ముద్ర వేస్తారనే భయం. అందుకే, సినిమా రంగంలో ఆడవాళ్లు వెనుకబడిపోయారు. నిజానికి ఆడవాళ్లు, కొత్తవాళ్లు రావడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. కాబట్టే, పరిశ్రమలో మహిళలకు అవకాశాలు పెరుగుతున్నాయి. కథ, సినిమా, షార్ట్ ఫిల్మ్, ఫేస్బుక్ పోస్ట్.. ఏదైనా సరే రాయడం ఇష్టం నాకు. రాస్తేనే సంతోషం. ఆ రాతల వల్ల డబ్బులొస్తే డబుల్ హ్యాపీ!
…? నాగవర్ధన్ రాయల గడసంతల శ్రీనివాస్