Ganjifa | పేకముక్కలు మనకు కొత్త కాదు. ఈ పాశ్చాత్య కాలక్షేపం పరిచయం కాకముందు, అంతకుమించిన వినోదాన్ని పంచిన ఆటలు మన దగ్గర ఉండేవి. వాటిలో ఒకటే.. గంజీఫా. గుండ్రటి అట్టముక్కల సాయంతో ఈ ఆట ఆడేవారు. చేతివృత్తుల కళాకారులు వీటిని రకరకాల రంగులు, రూపాలు, అలంకరణలతో తీర్చిదిద్దేవారు. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకున్న గంజీఫాకు భారతీయులు పురాణాలు, ఇతిహాసాలనూ జోడించారు.
గంజీఫాలో రకరకాలు. ఒడిశా పాలకులు పరిచయం చేసిన ఆట ఒకరకంగా, ఢిల్లీలో అక్బర్ కనిపెట్టిన ఆట మరోరకంగా, మహారాష్ట్రలో దశావతార గంజీఫా ఇంకోరకంగా కనిపిస్తాయి. అయితే ఇవన్నీ గతమే. పురావస్తుశాలలకు పరిమితం అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఓ విచిత్రం జరిగింది. ఓ వ్యక్తి లండన్లోని విక్టోరియా మ్యూజియం చూసేందుకు వెళ్లినప్పుడు, అక్కడ మహారాష్ట్రలోని సావంత్వాడీలో రూపొందించిన గంజీఫాలు కనిపించాయి.
ఆ విషయాన్ని సావంత్వాడీ రాజకుటుంబ వారసులైన శుభదాదేవి, శ్రద్ధకు చేరవేశారు. వారికి మరుగునపడిన తమ వారసత్వ కళను తిరిగి ఎందుకు ప్రచారంలోకి తీసుకురాకూడదనిపించింది. గంజీఫాల తయారీ గురించి తెలిసిన ఎనభై ఏండ్ల వయసుదాటిన వృద్ధ కళాకారులను సంప్రదించి, వాటి నమూనాలు సేకరించారు. వ్యయ ప్రయాసలకు ఓర్చి తిరిగి గంజీఫాలను రూపొందించడం మొదలుపెట్టారు.
దీన్ని కేవలం ఆటగా కాకుండా, ఓ ప్రాచీనకళగా వెలుగులోకి తెచ్చారు. ఆ డిజైన్లో అట్టముక్కలు, పెట్టెలు, చేతి పంఖా, ఫర్నిచర్.. లాంటి ఎన్నో వస్తువులను తయారు చేయిస్తున్నారు. ఇందుకోసం 12 మంది కళాకారులు పనిచేస్తున్నారు. ధరల విషయానికొస్తే రూ. 250 నుంచి లక్షల వరకు పలుకుతున్నాయి. అన్నట్టు, ఈ దశావతార గంజీఫాను 16వ శతాబ్దంలో సావంత్వాడీకి తీసుకువెళ్లింది తెలంగాణ కళాకారులేనని అంటారు.